MS Dhoni: ఆ సమాచారమే లేదు.. ధోనీనే చెబుతాడు: సీఎస్‌కే సీఈవో

ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. వచ్చే సీజన్‌లోనూ అతడి ఆటను చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Published : 24 Dec 2023 10:49 IST

ఇంటర్నెట్ డెస్క్: మరో మూడు నెలల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL 2024) 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే మినీ వేలం జరిగింది. ముంబయి జట్టుకు కొత్త సారథిగా హార్దిక్ పాండ్యను నియమించుకుంది. తీరా అతడు వచ్చే సీజన్‌లో ఆడతాడో లేదో అనే సందిగ్ధత మొదలైంది. అయితే, గత మూడేళ్లుగా ఐపీఎల్‌ వచ్చిన ప్రతిసారీ ఎంఎస్ ధోనీ (MS Dhoni) వార్తల్లో నిలుస్తుంటాడు. సీఎస్‌కే కెప్టెన్‌ ఈ సీజన్‌ ఆడతాడా? లేదా? అనే చర్చలు తలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు మరోసారి ఈ సీజన్‌లోనూ ఇదే పరిస్థితి. 2024 అతడికి చివరి సీజన్‌గా మారే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ధోనీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం 42 ఏళ్ల ధోనీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ధోనీ జట్టుతో కొనసాగే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీవో కాశీ విశ్వనాథన్‌ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. 

‘‘ఈ విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. కెప్టెన్ ధోనీనే నేరుగా సమాధానం ఇస్తాడు. కానీ, ఇప్పటి వరకు దీనిపై చర్చించలేదు. ప్రస్తుతం ధోనీ శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడి ఫిట్‌నెస్‌ బాగుంది. జిమ్‌లో వర్కౌట్స్‌ కూడా ప్రారంభించాడు. మరో 10 లేదా 15 రోజుల్లో నెట్ ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది’’ అని విశ్వనాథన్‌ తెలిపారు. 

ధోనీ పెళ్లికి అలా వెళ్లిపోయా: సురేశ్‌ రైనా

ఎంఎస్ ధోనీ-సాక్షి వివాహం 2010 జులై 4న దేహ్రాదూన్‌ వేదికగా జరిగింది. అయితే, ధోనీ వెడ్డింగ్‌ను నిరాడంబరంగా చేసుకున్నాడు. పెళ్లికి ఆహ్వానితుల జాబితాలో సురేశ్‌ రైనా కూడా ఉన్నాడు. తనను ధోనీ ఎలా పెళ్లికి పిలిచాడనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో రైనా గుర్తు చేసుకున్నాడు. ‘‘పెళ్లి రోజే ధోనీ నాకు ఫోన్‌ చేశాడు.  ‘ఎక్కడ ఉన్నావు’ అని అడిగాడు. లఖ్‌నవూలో ఉన్నానని చెప్పా. అప్పుడు ‘నేను దేహ్రాదూన్‌లో పెళ్లి చేసుకోబోతున్నా. ఎవరికీ చెప్పొద్దు. త్వరగా ఇక్కడికి వచ్చేయ్‌. నీ కోసం వేచి చూస్తున్నా’ అని ఫోన్‌ పెట్టేశాడు. కాసేపటికే బయల్దేరి వెళ్లిపోయా. అప్పుడు సాధారణ దుస్తులే ధరించి ఉన్నా. అక్కడికి వెళ్లి ధోనీ బట్టలనే నేను వేసుకున్నా’’ అని రైనా తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని