T20 League: టీ20 లీగ్.. గుజరాత్ గాండ్రింపా..? రాజస్థాన్ రాజసమా..?
టీ20 టోర్నీలో మూడు ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు కాగా.. ఆఖరి దాని కోసం రెండు జట్లు బరిలో నిలిచాయి. అదీ ఇవాళ తేలిపోతుంది. అయితే తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు నాకౌట్ దశలో ఓడినా మరొక అవకాశం..
మే 24న తొలి క్వాలిఫయర్ మ్యాచ్
ఇంటర్నెట్ డెస్క్: టీ20 టోర్నీలో మూడు ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు కాగా.. ఆఖరి దాని కోసం రెండు జట్లు బరిలో నిలిచాయి. అదీ ఇవాళ తేలిపోతుంది. అయితే తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు నాకౌట్ దశలో ఓడినా మరొక అవకాశం ఉంటుంది. మరి లీగ్ స్థాయిలో టాప్-2 జట్లేవి.. వాటి బలాలు, బలహీనతలు.. ఈ సీజన్లో ఆ రెండు టీమ్ల మధ్య జరిగిన పోరులో ఎవరు పైచేయి సాధించారనే విషయాలను తెలుసుకుందాం..
టీ20 లీగ్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ అద్భుత విజయాలతో నంబర్వన్ స్థానం దక్కించుకుంది. హార్దిక్ పాండ్య నేతృత్వంలోని టీమ్ 14 మ్యాచుల్లో 10 విజయాలతో 20 పాయింట్లు సాధించింది. ఇక ఆఖరి వరకు టాప్-4లో ప్లేస్ కోసం పోరాడిన రాజస్థాన్ ఏకంగా రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. రాజస్థాన్, మరొక కొత్త జట్టు లఖ్నవూ కూడా తొమ్మిదేసి విజయాలతో ఉన్నప్పటికీ మెరుగైన నెట్రన్రేట్ కారణంగా సంజూ సేన ముందుకొచ్చింది. నెట్రన్రేట్ ఎంత కీలకమో దీనిని బట్టే అర్థవుతుంది కదా.. ఇక పోతే మే 24న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు డైరెక్ట్గా ఫైనల్కు చేరుకుంటుంది. తొలి క్వాలిఫయర్లో ఓడిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్లో తలపడవచ్చు. ఎలిమినేటర్ మ్యాచ్ మే 25న, రెండో క్వాలిఫయర్ మ్యాచ్ మే 27న, ఫైనల్ మే 29న జరుగుతాయి.
కొత్త జట్టు.. నూతన సారథ్యం
హేమాహేమీలు సారథులుగా ఉన్న టీ20 టోర్నీలో అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అనుభవం లేకుండా నాయకత్వ బాధ్యతలను చేపట్టి జట్టును నడపించడం తేలికైన విషయమేమీ కాదు. అయితే జట్టు సభ్యుల మద్దతు ఉంటే పెద్ద కష్టమేమీ కాదని నిరూపించాడు హార్దిక్ పాండ్య. గత సీజన్ వరకు ముంబయికి ఆడిన హార్దిక్ను మెగా వేలానికి ముందు గుజరాత్ తీసుకుంది. ఏకంగా కెప్టెన్ చేసేసింది. లీగ్ దశలో సాధించిన 10 విజయాల్లో ఏడుసార్లు ఛేజింగ్లోనే గెలిచింది. అన్ని మ్యాచ్లు చివరి ఓవర్ వరకూ వెళ్లడం గమనార్హం. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ బ్యాటర్లు రాణిస్తుండటం గుజరాత్కు కలిసొచ్చింది. బ్యాటింగ్ టాపర్లలో హార్దిక్ పాండ్య 413 పరుగులతో ఏడో స్థానం, 403 రన్స్తో శుభ్మన్ గిల్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు.
గత చివరి నాలుగు మ్యాచ్లను తీసుకుంటే ఓపెనర్లు శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహాలో ఒకరు మాత్రమే మంచి ఆరంభం ఇస్తున్నారు. అయినప్పటికీ స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుని ఒత్తిడిలోకి వెళ్తోంది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ బ్యాటర్లు స్ట్రోక్ షాట్లు కొట్టడంతో విజయాలను నమోదు చేయగలిగింది. అయితే షమీ, యాష్ దయాల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్తో బౌలింగ్ దళం పటిష్ఠంగానే ఉంది. సాయికిశోర్ కూడా ఫర్వాలేదనిపించాడు. ఇక ఓడిపోయిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేసింది. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే. లేకపోతే నాకౌట్ దశలో అన్నిసార్లూ అదృష్టం కలిసిరాకపోవచ్చు. అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 జాబితాలో రషీద్ ఖాన్ (18), షమీ (18) చోటు సంపాదించారు.
ఈసారైనా కప్ దిశగా..
దివంగత దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ తొలి సీజన్లోనే కప్ను కైవసం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఒక్కసారికూడానూ ఫైనల్కు చేరుకోలేదు. కేవలం మూడు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్కు చేరుకుంది. అదీ కూడా మూడో స్థానంతో, నాలుగో స్థానంతో వెళ్లింది. అయితే ఈసారి పాయింట్లపరంగా రెండో స్థానం దక్కించుకున్న రాజస్థాన్ తొలి క్వాలిఫయర్లోనే విజయం సాధించి ఫైనల్కు చేరుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే అదేమీ సులభమేమీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎదుర్కొనేది టాప్ టీమ్ గుజరాత్తో మరి. దీనికోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. అయితే గుజరాత్కు అన్ని విభాగాల్లో రాజస్థాన్ సమవుజ్జీగానే ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే కాస్త మెరుగ్గానే ఉంది. అయితే యాజమాన్యం అనుకున్న ప్రణాళికలను ఆటగాళ్లు మైదానంలో అమలు చేస్తే సరిపోతుంది.
ఓపెనర్ జోస్ బట్లర్ అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. 14 మ్యాచుల్లో మూడు శతకాలు, మూడు అర్ధశతకాలతో 629 పరుగులు సాధించాడు. అయితే గత ఐదు మ్యాచ్ల గణాంకాలను పరిశీలిస్తే కేవలం 63 పరుగులను మాత్రమే సాధించడం గమనార్హం. అంటే తొలి 9 మ్యాచుల్లో 566 రన్స్ చేసిన బట్లర్ ఆ తర్వాత నెమ్మదించాడు. అయితే కీలకమైన నాకౌట్ దశలో విజృంభించాల్సిందే. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, దేవదుత్ పడిక్కల్, రియాన్ పరాగ్ ఫర్వాలేదనిపిస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా మంచి ఫామ్లోకి రావడం రాజస్థాన్కు అదనపు బలం. బౌలింగ్లోనూ ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ ఎలానూ ధాటిగా ఆడేస్తాడు. మరోవైపు బౌలింగ్లోనూ రాజస్థాన్ పటిష్ఠంగానే ఉంది. ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ ఆరంభ ఓవర్లలో వికెట్లను తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేయగలరు. ఇక స్పిన్ ద్వయం యుజ్వేంద్ర చాహల్, అశ్విన్ మధ్య ఓవర్లలో బ్యాటర్ల పని పడతారు.
టాప్-2 మధ్య పోరు ఎలా ఉందంటే?
ఈ సీజన్లో గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య ఒకే మ్యాచ్ జరిగింది. అదీనూ గుజరాత్దే పైచేయి నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అయితే రాజస్థాన్ 155/9 స్కోరుకే పరిమితమై 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. యువ బౌలర్ కుల్దీప్ సేన్ (0/51) తేలిపోయాడు. చాహల్, అశ్విన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తర్వాత బ్యాటింగ్లో జోస్ బట్లర్ (54), హెట్మయేర్ (29) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. కాబట్టి ఫైనల్కు చేరుకుని కప్ను సాధించాలంటే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పోరాడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.