పల్లెకు రింగ్‌

తెలంగాణలోని నాలుగు జిల్లాల మీదుగా వెళ్లే ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం మార్గ ప్రణాళిక (అలైన్‌మెంట్‌) కోసం సేకరించాల్సిన భూములను గుర్తించే పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఆయా జిల్లాల్లోని 111 గ్రామాల

Published : 23 Jan 2022 05:07 IST

111 గ్రామాల మీదుగా ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర మార్గం

వచ్చే నెలలోగా భూముల గుర్తింపు పూర్తి

 త్వరలో యజమానులకు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని నాలుగు జిల్లాల మీదుగా వెళ్లే ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం మార్గ ప్రణాళిక (అలైన్‌మెంట్‌) కోసం సేకరించాల్సిన భూములను గుర్తించే పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఆయా జిల్లాల్లోని 111 గ్రామాల వివరాలు ‘ఈనాడు’కు లభించాయి. భూముల గుర్తింపు ప్రక్రియను వచ్చేనెల చివరి వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గుత్తేదారు సంస్థకు స్పష్టం చేసింది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో క్షేత్రస్థాయిలో భూములను గుర్తించి గుర్తులను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 344 కిలోమీటర్ల మేరకు రెండు భాగాలుగా ప్రాంతీయ రింగు రోడ్డును కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి భూ సేకరణ చేసేందుకు వీలుగా మార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఖరారు చేశాయి. ఇందుకోసం 4,620 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారుల అంచనా. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో భూముల గుర్తింపు కోసం సర్వే ముమ్మరంగా సాగుతోంది. రింగురోడ్డు దక్షిణ భాగానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం మాత్రమే తెలిపింది. దానికి తాత్కాలిక జాతీయ రహదారి నంబరును కేటాయించాల్సి ఉంది. ట్రాఫిక్‌ రద్దీపై మరో దఫా అధ్యయనం చేయాలని కేంద్రం కోరింది.

సమాయత్తమవుతున్న రెవెన్యూశాఖ

ఉత్తరమార్గంలో గుర్తించిన భూముల యజమానులకు త్వరలో భూ సేకరణ నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ శాఖ సమాయత్తవుతోంది. మార్గ ప్రణాళికను రూపొందించిన కె అండ్‌ జె ప్రాజెక్ట్‌ సంస్థ ఆయా గ్రామాల జాబితాను ఇప్పటికే కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం. ఆ మేరకే సర్వే నిర్వహిస్తున్నారు. ఇది పూర్తయ్యాక రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. భూసేకరణ యత్నాలపై ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ ప్రక్రియ కోసం నాలుగు జిల్లాల పరిధిలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాన్ని కేంద్రం సూచించింది. అందుకు సంబంధించిన కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు.

ఏయే గ్రామాలంటే...

సంగారెడ్డి జిల్లా: మల్కాపూర్‌, గిర్మాపూర్‌ (కొండాపూర్‌ మండలం). పెద్దాపూర్‌(సదాశివపేట). నాగపూర్‌, ఇరిగిపల్లె, చింతల్‌పల్లి, కలబ్‌గూర్‌, సంగారెడ్డి, తాడ్లపల్లె, కులబ్‌గూర్‌, (సంగారెడ్డి). కాసాల, దేవులపల్లి, హత్నూర్‌, దౌల్తాబాద్‌ (హత్నూర్‌). శివ్వంపేట, వెండికోల్‌, వెంకట కిష్టాపూర్‌, లింగంపల్లె, కోర్పోల్‌ (చౌటకూర్‌).

మెదక్‌ జిల్లా: నాగులపల్లె, మూసాపేట, మహ్మదాబాద్‌, పెద్దచింతకుంట, రుస్తుంపేట, సీతారాంపూర్‌, మల్పర్తి, అచ్చపేట్‌, రెడ్డిపల్లె, చిన్నచింతకుంట, ఖాజీపేట, మంతూర్‌, గొల్లపల్లె, తిర్మలాపూర్‌, తుల్జాపూర్‌ (నర్సాపూర్‌). వెంకటాపూర్‌ (కౌడిపల్లె), లింగోజిగూడ, కొత్తపేట, రత్నాపూర్‌, పాంబండ, ఉసిరికపల్లె, పోతుబోగడ, గుండ్లపల్లె, కొంతాన్‌పల్లి (శివ్వంపేట). వట్టూరు, దండుపల్లె, నాగులపల్లె, తూప్రాన్‌, ఇస్లాంపూర్‌, దాతరపల్లె, గుండ్రెడ్డిపల్లె, కిష్టాపూర్‌, వెంకటాయపల్లె, నర్సంపల్లె, మల్కాపూర్‌ (తూప్రాన్‌). మాసాయిపేట(మాసాయిపేట).

సిద్దిపేట జిల్లా: బేగంపేట, యల్కల్‌ (రాయిపోల్‌). బంగ్లా వెంటకాపూర్‌, మక్తామాసన్‌పల్లె, కోమటిబండ, గజ్వేల్‌, సంగాపూర్‌, ముట్రాజ్‌పల్లె, ప్రజ్ఞాపూర్‌, సిరిగిరిపల్లె (గజ్వేల్‌). మజీద్‌పల్లె, మెంటూర్‌, జబ్బాపూర్‌, మైలారం, కొండాయిపల్లె (వర్గల్‌). మర్కూక్‌, పాములపర్తి, అంగడి కిష్టాపూర్‌, చేబర్తి, ఎర్రవల్లి (మర్కూక్‌). అలీరాజ్‌పేట, ఇటిక్యాల, పీర్లపల్లె (జగ్దేవ్‌పూర్‌).

యాదాద్రి-భువనగిరి జిల్లా: గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్‌, ఇబ్రహీంపూర్‌, దత్తాయిపల్లి, వేల్పుపల్లి (తుర్కపల్లి). మల్లపూర్‌, దత్తాకపల్లి (యాదగిరిగుట్ట), భువనగిరి, రాయగిరి, కేసారం, పెంచికలపహాడ్‌, తుక్కాపూర్‌, చందుపట్ల, గౌస్‌నగర్‌, ఎర్రంబల్లి, నందనం (భువనగిరి). పహిల్వాన్‌పూర్‌, కంచనపల్లె, టేకులసోమారం, రెడ్లరేపాక, ప్రొద్దుటూర్‌, వర్కూట్‌పల్లె, గోకారం, వలిగొండ (వలిగొండ). నేలపట్ల, చిన్నకొండూర్‌, తాళ్లసింగారం, స్వాములవారి లింగోటం, చౌటుప్పల్‌, లింగోజిగూడ, పంతంగి, తంగడ్‌పల్లి (చౌటుప్పల్‌).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని