మన్యం వీరుడే మనకు స్ఫూర్తి

బ్రిటిష్‌ పాలకుల్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశంలోని కోట్లాది ఆదివాసీల ధైర్యానికి, స్థైర్యానికి, సంస్కృతికి ప్రతీక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ‘దమ్ముంటే నన్ను ఆపండి’ అని గర్జించి బ్రిటిష్‌ సైనికుల

Updated : 05 Jul 2022 05:58 IST

‘ఒకే భారత్‌... శ్రేష్ఠ భారత్‌’ భావనకు ఆయన ప్రతీక
అల్లూరి ఆదర్శంగా సవాళ్లపై పోరాటం
సీతారామరాజు జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం ఆవిష్కరణ
భీమవరం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి


మనదే రాజ్యం,  వందేమాతరం ఒక్కటే..

సీతారామరాజు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ‘మనదే రాజ్యం’ అన్న నినాదంతో ఆయన దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. వందేమాతరం, మనదే రాజ్యం అన్న భావన ఒక్కలాంటివే. మన్యం వీరుడిగా ఆంగ్లేయులతో పోరాటం ప్రారంభించినప్పుడు అల్లూరి సీతారామరాజు వయసు 24-25 సంవత్సరాలే. అంత చిన్న వయసులోనే ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయనతో కలసి బ్రిటిషర్లపై పోరాడిన ఎందరో యువకులు తమ జీవితాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల నుంచి యావత్‌ జాతి.. శక్తిని, స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.

- ప్రధాని మోదీ


బ్రిటిష్‌ పాలకుల్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశంలోని కోట్లాది ఆదివాసీల ధైర్యానికి, స్థైర్యానికి, సంస్కృతికి ప్రతీక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ‘దమ్ముంటే నన్ను ఆపండి’ అని గర్జించి బ్రిటిష్‌ సైనికుల తుపాకులకు ఎదురొడ్డిన ఆ మహావీరుడి ధైర్యసాహసాలే స్ఫూర్తిగా.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై 130 కోట్ల మంది ప్రజలు ఐకమత్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా, అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం నిర్వహించిన ఉత్సవాల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెదఅమిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని సభా వేదికపై నుంచి రిమోట్‌ కంట్రోల్‌తో వర్చువల్‌గా ప్రారంభించారు. ‘మన్యం వీరుడు, తెలుగుజాతి యుగపురుషుడు, తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా.. అంటూ స్వతంత్ర సంగ్రామంలో యావత్‌ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన నేలపై మనమందరం కలుసుకోవడం మన అదృష్టం’ అంటూ మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి, మన్యంలో రంప తిరుగుబాటు జరిగి వందేళ్లయిన సందర్భంగా ఈ సంవత్సరమంతా దేశంలో పలు చోట్ల ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. యావత్‌ భారతజాతిని ఒక్కతాటిపై నిలుపుతున్న ‘ఒకే భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ భావనకు అల్లూరి అసలైన ప్రతీక అని కొనియాడారు. ఆ భావన అనాదిగా దేశ చరిత్రలోనూ, సాంస్కృతిక చింతనలోనూ మమేకమైందన్నారు.  

యువత నడుం బిగించాలి

‘అప్పట్లో యువతే స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపించింది. దేశాభివృద్ధికి యువత మళ్లీ నడుం కట్టేందుకు ఇది మంచి సమయం. ప్రస్తుతం యువతకు ఎన్నో అవకాశాలు, వారి ప్రతిభను చాటుకోవడానికి మరెన్నో వేదికలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకుని కలల్ని సాకారం చేసుకోవాలి. యువకులు, మహిళలు, దళితులు, ఆదివాసీలతోపాటు, అణచివేతకు గురైన వర్గాలన్నీ ముందుకొచ్చి దేశానికి నాయకత్వం వహిస్తే.. భారత్‌ అభివృద్ధిని ఎవరూ నిలువరించలేరు’ అని ప్రధాని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ దేశభక్తుల పురిటిగడ్డ

ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి అని, ఇక్కడికి రావడం తన అదృష్టమని ప్రధాని అన్నారు. ఈ వీరభూమికి శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.  సీతారామరాజు 125వ జన్మదినోత్సవం సందర్భంగా యావత్‌ భారతదేశం తరపున ఆయనకు పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఎందరో దేశభక్తులకు, స్వాతంత్య్ర సమరయోధులకు పురిటిగడ్డ అని ప్రధాని కొనియాడారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటివారు జన్మించిన పుణ్యభూమి ఈ ప్రాంతమని కొనియాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల తుపాకులకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప యోధుడన్నారు. ‘దేశం కోసం బలిదానాలు చేసిన ఆ యోధులందరి కలల్ని ఈ అమృత కాలంలో సాకారం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఎనిమిదేళ్లుగా భారత ప్రభుత్వం దేశంలోని గిరిజనుల సంక్షేమానికి అవిశ్రాంత కృషి చేస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారిగా గిరిజనుల సంస్కృతిని, ఘన వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు గిరిజన మ్యూజియంలు ఏర్పాటు చేస్తోంది. దానిలో భాగంగానే లంబసింగిలో అల్లూరి సీతారామరాజు స్మారక గిరిజన స్వాతంత్య్ర యోధుల మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.  

అల్లూరి నడయాడిన ప్రాంతాల అభివృద్ధి

అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేసి జాతికి అంకితమిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ‘విశాఖ జిల్లా పాండ్రంగిలో ఆయన జన్మస్థలాన్ని, రంప తిరుగుబాటులో భాగంగా ఆయన దాడి చేసిన చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను పునరుద్ధరిస్తాం. మోగల్లులో అల్లూరి ధ్యాన మందిరాన్ని నిర్మిస్తాం. అమృత మహోత్సవాల స్ఫూర్తి చిహ్నంగా వీటి నిర్మాణాలు చేపడతాం. మన స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల్లోని చారిత్రక ఘట్టాలను దేశ ప్రజలందరికీ తెలియజేయాలన్న సంకల్పానికి అల్లూరి 125వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిదర్శనం. స్వాతంత్య్ర సంగ్రామం కొంత కాలానికో, కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదు.. ఇది దేశంలోని నలుమూలలకూ చెందిన ఎందరో త్యాగధనుల చరిత్ర. మన దేశ భిన్నత్వం, ఐకమత్యం, సంస్కృతిలోని శక్తికి స్వాతంత్య్రోద్యమం అసలు సిసలు ప్రతీక’ అని ఆయన పేర్కొన్నారు.

మాతృభాషలో బోధనతో ఎంతో మేలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్కిల్‌ ఇండియా మిషన్‌’ వల్ల గిరిజన కళలు, నైపుణ్యాలకు కొత్త గుర్తింపు లభిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ కార్యక్రమం... గిరిజనుల కళాత్మక నైపుణ్యాలద్వారా ఆదాయ సముపార్జనకు మార్గం చూపిందన్నారు. ‘ఆకాంక్షిత జిల్లాల’ పథకం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి విద్యాభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. గిరిజనుల పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు దేశవ్యాప్తంగా 750 ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మాతృభాషలో బోధనకు పెద్దపీట వేస్తున్నామని.. ఇది గిరిజన ప్రాంతాల పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు.

90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర  

గిరిజన యువతకు జీవనోపాధి మార్గాల్ని పెంచేందుకు ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు మోదీ తెలిపారు. ‘కేవలం 12 అటవీ ఉత్పత్తులకే కనీస మద్దతు ధర ఉండగా మేం ఆ సంఖ్యను 90కి పెంచాం. 3 వేలకుపైగా వనగణ వికాస కేంద్రాలు, 50వేలకు పైగా వనగణ స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం. గిరిజన కళాకృతులు, ఉత్పత్తులకు సరికొత్త అవకాశాలు కల్పించేందుకు ఈ గ్రూపులు ఎంతో తోడ్పడుతున్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు.


సామాజిక ఐక్యతా సంస్కర్త అల్లూరి: జగన్‌

సామాజిక ఐక్యత ఆవశ్యకతను, గొప్పతనాన్ని చాటిచెప్పిన గొప్ప సంస్కర్త అల్లూరి సీతారామరాజు అని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. భావాలపరంగా ఎన్నటికీ మరణం లేని విప్లవవీరుడాయన అని కొనియాడారు. భీమవరం సభలో సోమవారం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘తెలుగుజాతికి, భారత దేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు. అడవి బిడ్డలకు ఆరాధ్య దైవం. ఆయన వ్యక్తిత్వానికి, గొప్పతనానికి, త్యాగానికి నివాళులర్పిస్తున్నాం. ఆ మహనీయుడి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే.. ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టాం. అక్కడా ఆయన కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. దేశం, అడవి బిడ్డల కోసం తనను తాను అర్పించుకున్న ఆ మహావీరుడికి వందనం. సీతారామరాజు ఎప్పటికీ చరితార్ధుడే. ఆయన త్యాగం ప్రతి ఒక్కరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంది’ అని జగన్‌ కొనియాడారు.


ఏడాది పాటు జయంత్యుత్సవాలు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను సోమవారం నుంచి వచ్చే సంవత్సరం జులై 4 వరకూ ఏడాది పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దిల్లీ, విశాఖపట్నం, హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహిస్తామని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రాంతాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భీమవరం సభలో ఆయన ప్రసంగించారు. ‘ఈ ఏడాదంతా ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో అల్లూరి పేరు మార్మోగాలి. ఆయన కుటుంబీకుల్ని, ఆయనతో కలిసి పనిచేసిన గిరిజన సైన్యంలోని ముఖ్యులైన గంటం దొర, మల్లు దొర, వీరయ్య దొర, కంకిపాటి ఎండుపడాల్‌, శంకోజీ ముక్కడు, బొంకుల మోదిగాడు, భీమవరానికి చెందిన వేగిరాజు సత్యనారాయణ (అగ్గిరాజు) తదితరుల కుటుంబీకుల్ని కలుస్తాం’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.


ఆహ్వానం పలికారు... జాబితాలో పేరు లేదన్నారు
తెదేపా నేత అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి- భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానం మేరకు భీమవరం వెళ్లిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అవమానం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీకి హెలిప్యాడ్‌ దగ్గర స్వాగతం పలికేవారి జాబితాలోగానీ, వేదికపైకి ఆహ్వానితుల్లోగానీ తన పేరు లేదని తెలియడంతో... అచ్చెన్నాయుడు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. భీమవరంలో అల్లూరి విగ్రహానికి నివాళులర్పించి వెనుతిరిగారు. అచ్చెన్నాయుడుకు సంబంధించి ప్రొటోకాల్‌ విషయంలో పొరపాటు జరిగిందని.. దానికి చింతిస్తున్నామని, క్షమాపణ కోరుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ప్రజలతో మమేకమయ్యేందుకే ఈ వేడుకను నిర్వహించామని, రాజకీయాలను పరిష్కరించేందుకు కాదని సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని