పేదలకు ఇళ్ల జాగాలు!

పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థలం కలిగి ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకుగాను రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Published : 08 Mar 2023 04:51 IST

రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
ఖాళీ స్థలాలను గుర్తిస్తున్న రెవెన్యూ యంత్రాంగం
గతంలో పంపిణీ చేయగా మిగిలిన వాటిపైనా దృష్టి
జిల్లాల్లో దస్త్రాలు తిరగేస్తున్న సంక్షేమ శాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థలం కలిగి ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకుగాను రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు జీవో 58 కింద వాటిని క్రమబద్ధీకరించి త్వరలో పట్టాలు అందజేసేందుకూ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నిరుపేదలకు ఎక్కడైనా జాగాల కొరత ఉంటే వారికి అందుబాటులో ఉన్న ఇంటి స్థలాలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం గ్రామ స్థాయిలో అందుబాటులో ఉన్న భూమి,  ఏ రకమైన స్థలాలు ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ శాఖలు సేకరిస్తున్నాయి. నియోజకవర్గం కేంద్రంగా సమాచారం సేకరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. స్థలాలను గుర్తించిన అనంతరం బడుగు, బలహీన వర్గాల వారికి పట్టాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని క్షేత్రస్థాయి యంత్రాంగం చెబుతోంది. మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో అందించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా సమగ్ర వివరాలు సేకరించేందుకు జిల్లాలకు ప్రత్యేకమైన ప్రొఫార్మాలను ప్రభుత్వం అందజేసింది.

లెక్కలు తేల్చండి

గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారికి ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేశాయి. కానీ కొన్ని జిల్లాల్లో    స్థలాలు చూపలేదు. స్థలాలు గుర్తించినా పట్టాలు జారీ చేయలేదు. పంపిణీకి సిద్ధం చేసిన వాటిలో కొన్ని మిగిలిపోయాయి. ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలను రెవెన్యూశాఖ ఆరాతీస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు కూడా ఆయా శాఖల పరిధిలో గతంలో పంపిణీ చేసిన స్థలాల దస్త్రాల దుమ్ము దులుపుతున్నారు. ఆయా శాఖలు గతంలో పేదలకు స్థలాల పంపిణీ చేసేందుకు భూమిని కొనుగోలు కూడా చేశాయి. కొన్ని చోట్ల అభివృద్ధిపరిచి పంపిణీ చేశాయి. అలాంటి చోట్ల కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులు నివాసం ఉండటం లేదు. కొన్ని ప్లాట్లను విక్రయించుకున్న దాఖలాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు బదులు ఇతరులు ఆక్రమించుకున్నారు. ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వివరాలన్నింటినీ క్రోడీకరిస్తున్నారు.

కీలకం కానున్న ప్రొఫార్మాలు

ఖాళీ స్థలాల గుర్తింపునకు మూడు రకాల ప్రొఫార్మాలను ప్రభుత్వం జిల్లాలకు అందజేసింది. వాటి ఆధారంగా స్థలాల ప్రస్తుత స్థితిని అంచనా వేయనున్నారు. ఎన్నిచోట్ల ఇంకా ఖాళీ స్థలం ఉందనేది తేల్చనున్నారు. ఇళ్లు నిర్మించుకునేందుకు పంపిణీ చేయగా ఖాళీగా ఉన్న వాటిని గుర్తించేందుకు 13 అంశాలతో ప్రొఫార్మాను సిద్ధం చేశారు.

* పట్టాల పంపిణీకి గతంలో తీసుకున్న ప్రభుత్వ, సీలింగ్‌, దేవాదాయ, ప్రైవేట్‌ భూముల మొత్తం విస్తీర్ణం, స్థలాలు పంపిణీ చేయగా మిగిలిన ఖాళీలపై నియోజకవర్గం, మండలం, సర్వే నంబర్ల వారీగా వివరాలు.

* ఎసైన్డ్‌ స్థలాల్లో పట్టాలు పంపిణీ చేయనివి, పట్టాలు ఇచ్చినా స్థలం అప్పగించనివి. ఇతర శాఖలకు కేటాయించిన ఎసైన్డ్‌ భూముల్లో వినియోగం లేనివి, ఖాళీగా ఉన్న వాటి వివరాలు.

* సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా భూములు కొనుగోలు చేయగా వినియోగించనివి, ఖాళీగా ఉన్న వాటి వివరాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని