రైతు సంక్షేమానికి కేసీఆర్‌ సంకల్పం గొప్పది

వ్యవసాయం సహా అన్ని రంగాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, రైతులు సహా సమస్త వృత్తులు, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దార్శనిక పాలనతోనే ఇది సాధ్యమైందని జగద్గురు పంచాచార్య స్వామీజీలు అన్నారు.

Published : 04 Jun 2023 04:38 IST

జగద్గురు పంచాచార్య స్వామీజీల ప్రశంస

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయం సహా అన్ని రంగాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, రైతులు సహా సమస్త వృత్తులు, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దార్శనిక పాలనతోనే ఇది సాధ్యమైందని జగద్గురు పంచాచార్య స్వామీజీలు అన్నారు. ‘‘వేల మంది సాధువులను ఏక కాలంలో ఆహ్వానించి వారిని గౌరవించడం ఆనాడు జనక మహారాజుకు, వర్తమాన భారత దేశంలో తెలంగాణలో కేసీఆర్‌కే సాధ్యమైంది. సాధు సంతులను ఆదరించే విషయంలో కేసీఆర్‌ కలియుగ జనకుడు’’ అని వారు కొనియాడారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వీరశైవ పంచపీఠంలోని కాశీ, ఉజ్జయినీ, శ్రీశైల పీఠాల జగద్గురువులను సీఎం ఆహ్వానించారు. చంద్రశేఖర శివాచార్య మహాస్వామి (కాశీ), సిద్ధలింగ శివాచార్య మహాస్వామి (ఉజ్జయినీ), చెన్నసిద్ధ రమా పండితారాధ్య శివాచార్య మహాస్వామి(శ్రీశైలం) శనివారం ప్రగతిభవన్‌కు  వచ్చారు. వెంట మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు శివాచార్య మహాస్వాములు ఉన్నారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగునీటిని అందించడం గొప్ప విషయం. అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ నినాదంతో రైతు సంక్షేమ రాజ్యం కోసం పాటుపడుతున్న కేసీఆర్‌ సంకల్పం గొప్పది’’ అని జగద్గురువులు అన్నారు. కేసీఆర్‌ తలపెట్టిన నయా భారత్‌ నిర్మాణానికి తమ సహకారం, ఆశీర్వాదాలు అన్ని సందర్భాల్లో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.... దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆశీర్వదించడానికి జగద్గురువులు స్వయంగా రావడం తెలంగాణ ప్రజలందరి భాగ్యం అని అన్నారు. ‘‘75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్యం వల్ల దేశ వ్యవసాయ రంగం ఎంతో నష్టపోయింది. తగిన వనరులు ఉన్నా వ్యవసాయానికి సాగునీరు లేక, విద్యుత్తు లేక రైతాంగం అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో రైతు సంక్షేమ పాలన ఈ దేశానికి ఎంతో అవసరముంది. నయా భారత్‌ నిర్మాణం కోసం మీ సంపూర్ణ సహకారం, ఆశీర్వాదం కావాలి’’ అని కేసీఆర్‌ వారిని కోరారు. స్వామీజీలు కేసీఆర్‌ దంపతులను ఆశీర్వదించి, ప్రసాదాలను అందజేశారు. వారిని సంప్రదాయ పద్ధతిలో సీఎం సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, మహారాష్ట్ర భారాస నేతలు శంకర్‌ అన్నా  దోండ్గే, మాణిక్‌ కదమ్‌, హిమాన్షు తివారీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని