Chinese Billionaires: చలో సింగపూర్‌.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!

Chinese Billionaires Rush To Singapore: చైనా కుబేరుల్లో కొత్త భయాలు నెలకొన్నాయి. చైనాలోనే ఉంటే తమ సంపదకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో పన్నుల స్వర్గధామమైన సింగపూర్‌కు పయనమవుతున్నారు. అక్కడ కుటుంబ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.

Published : 05 Feb 2023 01:23 IST

దిల్లీ: జాక్‌మా.. అలీ బాబా గ్రూప్‌ అధినేత. చైనా (China) కుబేరుల్లో ఒకరు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై (communist government) మాట తూలినందుకు గానూ అక్కడి ప్రభుత్వం కక్షగట్టింది. ఆయన వ్యాపారాలపై ఉక్కుపాదం మోపింది. దీంతో భారీగా సంపదను కోల్పోవడమే కాదు.. పరాయి దేశమైన జపాన్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రేపు ఇదే పరిస్థితి తమకెందుకు రాకూడదు..? ఇదే అనుమానం చైనాలోని కుబేరుల్లో (Billionaires) మొదలైంది. దీంతో సింగపూర్‌కు (Singapore) మకాం మార్చేస్తున్నారు. వ్యాపారాల్లో ఇన్నాళ్లూ కూడబెట్టుకున్న సంపదను కాపాడుకునేందుకు సింగపూర్‌ చక్కేస్తున్నారు.

ఇటీవల చైనాకు చెందిన సంపన్న వర్గాలు సింగపూర్‌ తరలిపోతున్న ఉదంతాలు ఇటీవల వెలుగుచూస్తున్నాయి. టెక్‌ బిలీయనీర్లు, కుబేరులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడం, అణచివేతలకు పాల్పడుతండడం, మూడేళ్ల జీరో కొవిడ్‌ పాలసీ కారణంగా వారు పన్నుల స్వర్గ ధామంగా ఉన్న సింగపూర్‌కు పయనమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సింగపూర్‌కు టికెట్లు బుక్‌ చేసుకున్నారని తెలిసింది. సింగపూర్‌లో గత ఆరు దశాబ్దాలుగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ కార్మిక సమ్మెలు, వీధుల్లో ఆందోళనలపై నిషేధం ఉంది. పన్నుల శాతం కూడా చాలా తక్కువ. దీనికి తోడు చైనా వాసులే ఎక్కువగా సింగపూర్‌లో నివసిస్తుండడం కలిసొచ్చే అంశం. దీంతో ఎక్కువ మంది సంపన్నులు సింగపూర్‌ను గమ్యస్థానంగా మార్చుకుంటున్నారట. సింగపూర్‌లో ఖరీదైన గృహాల్లో నివసిస్తూ, ఖరీదైన కార్లలో తిరుగుతూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని సింగపూర్‌లోని కొందరు వ్యాపారులు చెబుతున్నారు.

మా సొమ్మేంగానూ..?

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై అక్కడి బిలీయనీర్లకు నమ్మకం లేకపోవడమే సింగపూర్‌ తరలిపోవడానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. జాక్‌మా పరిస్థితే రేపు తమకెందుకు రాదని ఆందోళన చెందుతున్నారని తెలిసింది. అదే సింగపూర్‌కు వెళితే ఇన్నాళ్లూ సంపాదించకున్న తమ సొమ్ముకు ఢోకా ఉండదని, రాబోయే తరాల వారికి సంపదను అందించిన వారమవుతామని చైనా సంపన్నులు భావిస్తున్నట్లు ఈ పరిస్థితులను దగ్గర్నుంచి చూస్తున్న ఓ అకౌంటెంట్‌ తెలిపారు. ‘కనీసం నేను ఇక్కడ ఉంటే.. నా సొమ్ము నాదే అవుతుంది’’ అని ఓ కుబేరుడు వ్యాఖ్యానించడం బట్టి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

చైనాకు చెందిన అతిపెద్ద హాట్‌పాట్‌ (ఆహారానికి సంబంధించిన) చైనా హైదిలావ్ వ్యవస్థాపకుల్లో ఒకరు ఇటీవలే సింగపూర్‌లో కుటుంబ కార్యాలయాన్ని తెరిచారు. సాధారణంగా కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే సంపన్న కుటుంబాలు, తమ కోసం ఏర్పాటు చేసుకునే ప్రైవేట్ వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలనే కుటుంబ కార్యాలయాలుగా పేర్కొంటారు. ఆ కుటుంబానికి దేశ, విదేశాల్లో ఉన్న పెట్టుబడులను ఈ కార్యాలయం పర్యవేక్షిస్తుంది. కుటుంబ సంపదను మరింత పెంచి తర్వాతి తరాలకు అందించటం వీటి అసలు లక్ష్యం. 2020లో సింగపూర్‌లో 400 కుటుంబ కార్యాలయాలు ఉండగా.. 2021 నాటికి ఆ సంఖ్య 700కు చేరింది. త్వరలోనే ఈ సంఖ్య 1500కు చేరబోతోందని సింగపూర్‌లోని ఓ ప్రైవేట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కో-హెడ్‌ అంచనా వేశారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి రెండు కుటుంబ కార్యాలయాల్లో ఒకటి చైనాకు చెందిన సంపన్నులే ఏర్పాటు చేసినా తాను ఆశ్చర్యపోనని పేర్కొన్నారు. మరోవైపు చైనా, వాషింగ్టన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలు సైతం చైనా కుబేరులను కలవరపెడుతున్నాయని పలువురు ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని