US: పుతిన్‌ అణుదాడి చేసే.. యుద్ధం ముగిస్తాడు: అమెరికా నిఘా వర్గాల హెచ్చరిక

ఉక్రెయిన్‌ యుద్ధం అంతిమంగా అణుదాడితోనే ముగియనుందా..? పోరు ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాల ప్రయోగానికి కూడా వెనుకాడడా..? అవుననే అంటున్నాయి అమెరికా నిఘా వర్గాలు.

Updated : 12 Mar 2023 09:44 IST

నాటో కూటమినీ పోరులోకి లాగుతాడు
అప్పుడు ప్రపంచానికే పెనుముప్పు

మాస్కో: ఉక్రెయిన్‌ యుద్ధం అంతిమంగా అణుదాడితోనే ముగియనుందా..? పోరు ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాల ప్రయోగానికి కూడా వెనుకాడడా..? అవుననే అంటున్నాయి అమెరికా నిఘా వర్గాలు. అంతేకాదు..రష్యా ప్రజల మద్దతు పొందేందుకు యుద్ధంలోకి నాటోకూటమిని లాగే ప్రయత్నం పుతిన్‌ చేసే అవకాశం ఉందని పేర్కొంది. వార్షిక ముప్పు అధ్యయన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. ‘‘రష్యాను బలహీనపరిచేందుకు ఉక్రెయిన్‌ను అమెరికా బినామీలా ఉపయోగిస్తోందని, సైనిక విజయం.. యూఎస్‌, నాటో బలగాల జోక్యంతోనే సాధ్యమనే అభిప్రాయం ప్రచారంలో ఉంది. ఇది రష్యా నుంచి తీవ్రస్పందనకు దోహదం చేయొచ్చు. ఈ యుద్ధం భౌగోళిక-రాజకీయ స్వరూపాన్ని మార్చుతోంది. చైనా-రష్యాకు పశ్చిమ దేశాలతో ఉన్న సమీకరణాలు మారుతున్నాయి. రష్యా, పశ్చిమ దేశాల మధ్య సైనికపరంగా పెరిగిన ఉద్రిక్తతల వల్ల ప్రపంచానికి ఎన్నడూ చూడని ప్రమాదం పొంచి ఉంది’’ అని యూఎస్‌ నివేదిక తెలిపింది.

కూర్చోని మాట్లాడుకుంటే సరిపోతుంది: చాట్‌జీపీటీ

ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసి శాంతి నెలకొనాలంటే ఏం చేయాలన్న విషయంపై ‘చాట్‌జీపీటీ’ ఆసక్తికర సమాధానాలిచ్చింది. తాజాగా భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వికాస్‌ స్వరూప్‌ మధ్యవర్తిత్వ ప్రణాళిక గురించి చాట్‌బోట్‌ను అడగ్గా..ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం కష్టమైనా ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకుంటే యుద్ధం ముగించొచ్చని పేర్కొంది. ‘‘ఉక్రెయిన్‌, రష్యా మధ్య ఘర్షణలు క్లిష్టమైనవి, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నవి. అయితే, చర్చలు, కాల్పుల విరమణ, అధికార వికేంద్రీకరణ, ఇరు దేశాలు ఒప్పందాలను పాటించడంపై అంతర్జాతీయ పర్యవేక్షణ, ఆర్థిక సహకారం, ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని గుర్తించడం, సంస్కృతి-సంప్రదాయాల పరిరక్షణ, సైనిక బలగాల ఉపసంహరణ: ఈ ఎనిమిది అంశాలను పాటిస్తే యుద్ధానికి పరిష్కారం లభించే అవకాశముంది’’ అని చాట్‌జీపీటీ బదులిచ్చింది. ఈ జవాబును వికాస్‌ స్వరూప్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని