Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్‌!

న్యూజిలాండ్‌ (New Zealand)కు చెందిన ఓ పిజ్జా కంపెనీ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. దీని గురించి తెలుసుకున్న వినియోగదారులు ఇదేం ఆఫర్‌ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఇలాంటి ఆఫర్లను ఉపయోగించుకోవద్దని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.

Published : 29 May 2023 01:28 IST

వెల్లింగ్టన్‌: ఏదైనా హోటల్‌ లేదా రెస్టారెంట్‌కు వెళితే తిన్న తర్వాత బిల్లు చెల్లించాలి. కొన్నిచోట్ల తినే ముందే టోకెన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, న్యూజిలాండ్‌ (New Zealand)కు చెందిన ఓ పిజ్జా కంపెనీ వినూత్న ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీని గురించి తెలుకున్న కస్టమర్లు ఇదేం వింత ఆఫర్‌ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆఫర్‌ ఏంటంటే? న్యూజిలాండ్‌కు చెందిన హెల్‌ పిజ్జా (Hell Pizza) అనే సంస్థ వినియోగదారులు తమ వద్ద పిజ్జా తిని చనిపోయిన తర్వాత దాని బిల్లు చెల్లించవచ్చని చెబుతోంది. ఇందుకోసం ఆఫ్టర్‌ లైఫ్‌ పే (After Life Pay) పేరుతో కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. 

హెల్‌ పిజ్జా ఈ ఆఫర్‌ను కొద్దిమంది వినియోగదారులకు మాత్రమే అందినున్నట్లు తెలిపింది. ఇందుకోసం యూజర్లు తమ వివరాలను కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంపెనీ రూపొందించిన వీలునామా పత్రాలపై యూజర్లు సంతకం చేయాలి. ఆఫర్‌ పొందిన వినియోగదారుడు చనిపోయిన తర్వాత వీలునామా ఆధారంగా వారి బ్యాంకు ఖాతాలు లేదా  కుటుంబసభ్యుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేస్తారు. ఈ స్కీమ్‌ వెనుక ఎలాంటి అదనపు రుసుంలు, మోసపూరిత వ్యవహారాలు లేవని హెల్‌ పిజ్జా సీఈవో బెన్‌ క్యూమింగ్‌ తెలిపారు.

‘‘న్యూజిలాండ్‌లో ‘బై నౌ పే లేటర్‌’ విధానం ద్వారా కొన్ని కంపెనీల మార్కెటింగ్ మోసాలను గుర్తించలేని ఎంతో మంది అప్పుల పాలవుతున్నారు. మా ఈ ఆఫర్‌ ద్వారా ప్రస్తుతం యూజర్‌ పిజ్జా తిన్నా.. వారు వెంటనే నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికోసం 18 ఏళ్లు నిండిన యూజర్లు తమ వివరాలను కంపెనీకి మెయిల్‌ చేయాలి. అందులోంచి కంపెనీ 666 మంది వినియోగదారులను ఎంపిక చేసి, ముందుగా వారికి ఈ ఆఫర్‌ వర్తింపజేస్తుంది. అనంతరం ఈ స్కీమ్‌ను మిగతా యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని క్యూమింగ్ వెల్లడించారు. 

దీనిపై న్యూజిలాండ్ వినియోగదారుల పరిరక్షణ ఫోరమ్‌ అధికారులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటివల్ల కంపెనీలతోపాటు, వినియోగదారులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చిరిస్తున్నారు. పిజ్జా కోసం ఇలాంటి ఆఫర్లను ఉపయోగించుకోవద్దని సూచిస్తున్నారు. క్యూమింగ్ మాత్రం ఇది సహృదయంతో అమలు చేస్తున్న స్కీమ్‌ అని చెబుతున్నారు. త్వరలోనే ఆస్ట్రేలియాలో సైతం ఇలాంటి తరహా స్కీమ్‌ను అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని