ukraine conflict: ఉక్రెయిన్పై పుతిన్కు అంత కోపమెందుకు..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య 30 ఏళ్లుగా జరుగుతున్న వివాదం ముదిరి పాకానపడింది. కుట్రలు.. విషప్రయోగాలు.. వెన్నుపోటులను దాటేసి యుద్ధం అంచులకు చేరింది.
యుద్ధం దిశగా రష్యా అడుగులు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
రష్యా-ఉక్రెయిన్ మధ్య 30 ఏళ్లుగా జరుగుతున్న వివాదం ముదిరి పాకానపడింది. కుట్రలు.. విషప్రయోగాలు.. వెన్నుపోటులను దాటేసి యుద్ధం అంచులకు చేరింది. తాజాగా ఉక్రెయిన్పై ముప్పేట దాడి చేసేందుకు రష్యా అన్ని విధాలా సిద్ధమవుతోంది. దాదాపు లక్షన్నర మంది సైనికులను మోహరించింది. పుతిన్ దూకుడును అడ్డుకొనేందుకు అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఫలితం కనిపించడంలేదు. తాజాగా 16వ తేదీన దాడి జరగొచ్చని ఏకంగా అమెరికా తేదీలతో సహా ప్రకటనలు చేయడంతో ఐరోపా సమాఖ్యలోని దేశాలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న సమయంలో యుద్ధం వస్తే తట్టుకొనే స్థితిలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థా లేదు. అమెరికా పరిస్థితి కూడా దీనికి మినహాయింపేమీ కాదు.
సోవియట్ సమయంలో రెండుసార్లు స్వాతంత్య్ర ప్రకటన
సోవియట్ యూనియన్ అంత్య దశలో ఉన్న సమయంలో కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా పోలాండ్ కేంద్రంగా ఉద్యమం మొదలైంది. ఇది సోవియట్లో పూర్తిగా విస్తరించింది. 1990లో సోవియట్లో భాగమైన ఉక్రెయిన్లో నాలుగు లక్షల మందితో ఇవనో-ఫ్రాంకివెస్క్ నుంచి కీవ్ వరకు 400 మైళ్ల మేరకు మానవహారం నిర్వహించారు. అప్పట్లో సోవియట్లో బ్యాన్ చేసిన నీలం-పసుపు (ఉక్రెయిన్ పతాకం) జెండాలను ప్రదర్శించారు. అదే ఏడాది జులైలో స్వాతంత్య్రం ప్రకటించుకొంది. అంతేకాదు చర్నోబిల్ అణుకేంద్రాన్ని మూసేయాలని ఉక్రెయిన్ పార్లమెంట్ తీర్మానించింది. 1991 ఆగస్టు24న రెండోసారి ఉక్రెయిన్ స్వాతంత్య్రం ప్రకటించుకొంది. అదే ఏడాది డిసెంబర్లో సోవియట్ విచ్ఛిన్నమైంది. సోవియట్ విచ్ఛిన్నం పుతిన్ వంటి వారికి మింగుడుపడలేదు. ఇటీవల సోవియట్ విచ్ఛిన్నంపై పుతిన్ బాధను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సోవియట్ కూటమిలో భాగస్వాములైన దేశాలపై పట్టు సాధించాలని పుతిన్ చేస్తున్న ప్రయత్నాల్లో క్రిమియా, ఉక్రెయిన్ ఆక్రమణలు భాగాలు.
రష్యాకు నాటో భయాలు..
1992 నుంచే ఉక్రెయిన్పై నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ) దృష్టిపెట్టింది. ఉక్రెయిన్తో సంబంధాలు పెంచుకొంటూ వస్తోంది. అదే ఏడాది నాటో సెక్రటరీ జనరల్ ఉక్రెయిన్ను సందర్శించగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఇవి రష్యాలో ఆందోళనలు పెంచాయి. ఆ తర్వాత 1994 డిసెంబర్లో బుడాపెస్ట్ ఒప్పందంపై అమెరికా, రష్యా, యూకేలు సంతకాలు చేశాయి. దీని ప్రకారం ఉక్రెయిన్ స్వాతంత్య్రాన్ని, సరిహద్దులను గౌరవించాలి. లియోనిడ్ కుచ్మా ఉక్రెయిన్ అధ్యక్షుడు అయ్యాక ప్రైవేటు రంగం వైపు ఆర్థిక వ్యవస్థను నడిపించారు. ఈ క్రమంలో కొందరి చేతుల్లోనే ఆర్థిక వ్యవస్థ ఉండిపోయింది.
అధ్యక్ష అభ్యర్థిపై విషప్రయోగం
లియోనిడ్ ఓ జర్నలిస్టు హత్యకు ఆదేశాలు జారీ చేస్తున్న ఆడియో వెలువడటంతో దేశవ్యాప్తంగా పరపతి దెబ్బతింది. ఆ తర్వాత లియోనిడ్ తన వారసుడిగా విక్టర్ యాన్కోవిచ్ను ఎంపిక చేశాడు. పుతిన్ కూడా 2000 సంవత్సరంలో తొలిసారి రష్యా అధ్యక్ష పదవి చేపట్టారు. రష్యా వేగంగా సోవియట్ నాటి పూర్వవైభవం అందుకొనే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. విక్టర్ యాన్కోవిచ్కు పుతిన్ మద్దతు ఉంది. కానీ, ఆ ఎన్నికల్లో యాన్కోవిచ్కు ప్రత్యర్థిగా విక్టర్ యష్చంకో నిలబడ్డారు. యష్చంకో ప్రజాస్వామ్య విధానాలకు మద్దతుదారు. ఎన్నికల ప్రచారం చివరల్లో ఉండగా.. యష్చంకో తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆయనపై విషప్రయోగం జరిగిందని డాక్టర్లు తేల్చారు. ఆ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. అది ఆరెంజ్ రివల్యూషన్కు దారి తీయడంతో.. చివరికి మూడు సార్లు ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. తుది విజేతగా విక్టర్ యష్చంకో నిలవడం రష్యాకు ఎదురుదెబ్బగా మారింది. విక్టర్ యష్చంకో అధ్యక్షుడిగా.. యూలియా టిమోషెంకో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడి నుంచి పరిస్థితులు రష్యాకు వ్యతిరేకంగా మారుతూ వచ్చాయి.
నాటోలో చేరికకు బీజాలు..
2008లో యష్చంకో, యూలియాలు ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ కూడా దీనికి సానుకూలంగా స్పందించారు.
ఇది పుతిన్ ఆగ్రహానికి కారణమైంది. రష్యా ఆగ్రహాన్ని అర్థం చేసుకొన్న ఫ్రాన్స్, జర్మనీలు బుష్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. అదే ఏడాది ఏప్రిల్లో నాటో స్పందిస్తూ ఉక్రెయిన్ సభ్యదేశం అయ్యే రోజు వస్తుందని హామీ ఇచ్చింది.
గ్యాస్ సంక్షోభం..
నాటోతీరుతో ఆగ్రహంగా ఉన్న రష్యా 2009 జనవరి1 నుంచి ఉక్రెయిన్కు రష్యా గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇదే పైపులైన్ నుంచి తూర్పు, మధ్య ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా అవుతుంది. దీంతో ఆయా దేశాల్లో ఉక్కపోత మొదలైంది. అంతర్జాతీయ ఒత్తిళ్లు పెరగడంతో ఉక్రెయిన్ తరఫున యూలియా టిమోషెంకో పుతిన్తో చర్చలు జరిపారు. అవి సఫలమై జనవరి 20 నుంచి గ్యాస్ సరఫరా మొదలైంది.
అధ్యక్ష స్థానంలోకి రష్యా కీలుబొమ్మ..
2010లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతు ఉన్న విక్టర్ యాన్కోవిచ్ ఉక్రెయిన్ అధ్యక్ష పదవి చేపట్టాడు. వెంటనే ఉక్రెయిన్ తటస్థ దేశంగా ఉంటుందని ప్రకటించాడు. నాటోకు దూరంగా ఉంటామని వెల్లడించాడు. 2011లో మాజీ ప్రధాని యూలియా టిమోషెంకోపై ఆవినీతి ఆరోపణలు వచ్చాయి. 2009 గ్యాస్ సంక్షోభ సమయంలో అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడినట్లు తేల్చి నాలుగేళ్లు జైలు శిక్ష విధించారు. ఇది అమెరికా, ఇతర ఐరోపా దేశాలు, మిగిలిన ఉక్రెయిన్ ప్రతిపక్ష నేతల్లో ఆందోళనకు కారణమైంది. ఐరోపా సమాఖ్య దగ్గరయ్యేందుకు అవసరమైన ఈయూ-ఉక్రెయిన్ అసోసియేషన్ అగ్రిమెంట్పై 2013లో సంతకం చేయాల్సిన చివరి నిమిషంలో అధ్యక్షుడు విక్టర్ యాన్కోవిచ్ నిరాకరించారు. రష్యా కోసం ఈ విధంగా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఉక్రెయిన్ మళ్లీ అల్లకల్లోలం అయింది. రాజధాని కీవ్లో మైదన్ స్క్వేర్, ప్రభుత్వ భవనాలను ఆందోళనకారులు ఆక్రమించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో 100 మంది మరణించారు. ఉక్రెయిన్ చరిత్రలో అది అతిపెద్ద రక్తపాతం. 2014 ఫిబ్రవరి 22న అవిశ్వాస తీర్మానం ఓటింగ్కు ముందే యాన్కోవిచ్ రష్యాకు పారిపోయి శరణు తీసుకొన్నాడు.
క్రిమియా ఆక్రమణ..
ఆ తర్వాత ఉక్రెయిన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో కొత్త ప్రభుత్వాన్ని రష్యా ప్రభుత్వం గుర్తించలేదు. పాలన మార్పిడిని తిరుగుబాటుగా ప్రకటించింది. ఆ తర్వాత వెంటనే క్రిమియాలో సాయుధులు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. తొలుత పుతిన్ వారిని తమ సైనికులుగా అంగీకరించలేదు. మార్చిలో సాయుధుల ఆధీనంలోని క్రిమియాలో రెఫరెండం నిర్వహించారు. ఇది రష్యా కనుసన్నల్లో జరిగింది. దీనిలో అక్కడి ప్రజలు రష్యాలో చేరేందుకు మొగ్గు చూపారు. క్రిమియా ఇక రష్యాలో భాగమని పుతిన్ ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో ఒక దేశం సరిహద్దులు మారడం అదే తొలిసారి. అమెరికా, ఐరోపా సమాఖ్యలు రష్యాపై ఆర్థిక ఆంక్షలను విధించాయి.
డాన్బాసో ప్రాంతంలో అల్లర్లు మొదలు..
అదే ఏడాది ఏప్రిల్లో 40,000 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల వద్ద మోహరించారు. మరోపక్క ఉక్రెయిన్లోని డాన్బాసో ప్రాంతంలో హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. వీటితో తనకు సంబంధం లేదని రష్యా ప్రకటించింది.
పశ్చిమ దేశాల మద్దతుదారైన పెట్రో పొరొషెంకో 2014 జూన్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. రష్యాపై దేశం ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆయన నిర్ణయించారు.
అదే ఏడాది సెప్టెంబర్ 4న ఫ్రాన్స్, జర్మనీల చొరవతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఒప్పందం జరిగింది. డాన్బాసోలో అలర్లు ఆగాయి. కానీ, ఆ ఒప్పందం ఎంతోకాలం నిలవలేదు.మళ్లీ హింస మొదలైంది. ఇప్పటి వరకు అవి కొనసాగుతూనే ఉన్నాయి. 14 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలు ఉక్రెయిన్ వాసుల్లో రష్యాపై వ్యతిరేకతను పెంచాయి. దీంతో నాటో, ఐరోపా సమాఖ్యలో చేరాలన్న డిమాండ్లకు మద్దతు పెరిగింది.
రష్యా దూకుడు..
డాన్బాసోలో హింసాత్మక ఘటనలకు తోడు.. రష్యా సైబర్ దాడులు కూడా పెరిగాయి. 2016లో కీవ్ పవర్ గ్రిడ్పై, 2017లో ఉక్రెయిన్ నేషనల్ బ్యాంక్, ఎలక్ట్రిక్ గ్రిడ్ వంటి కీలక వసతులపై దాడులు జరిగాయి. 2019లో నటుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాక పరిస్థితి నానాటికీ దిగజారింది. ఇతని శాంతి ప్రయత్నాలు ఫలించలేదు.
2021 ఏప్రిల్లో 1,00,000 మంది రష్యా సేనలు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకొని యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టాయి. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటోను సాయం కోరాడు. సభ్యత్వం ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలన్నాడు. ఒక నెల తర్వాత సేనలను విరమించుకొంటానని రష్యా చెప్పినా ఆచరణలో కనిపించలేదు.
ఆగస్టులో జెలెన్స్కీ శ్వేతసౌధానికి వెళ్లి అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ సాయం కోరారు. బైడెన్ కూడా సానుకూలంగా స్పందించారు. కానీ, నాటోలో చేరేందుకు అవసరమైన నిబంధనలు ఉక్రెయిన్ పాటించలేదు. నవంబర్ నాటికి రష్యా సేనలు మళ్లీ ఉక్రెయిన్ సరిహద్దుల వద్దకు చేరాయి. ఈ సారి పూర్తి ఏర్పాట్లతో వచ్చాయి.
పరిస్థితి అర్థం చేసుకొన్న జోబైడెన్ డిసెంబర్లో పుతిన్తో చర్చలు జరిపారు. రష్యా దూకుడుగా ఉంటే మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం తగ్గలేదు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇచ్చేదిలేదని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు బాల్కన్ దేశాలు, రొమేనియాల నుంచి దళాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉక్రెయిన్ ఆక్రమించే ఆలోచనలు లేవని రష్యా విదేశాంగశాఖ ఉప మంత్రి సెర్గీ రెబకోవ్ జనవరిలో అమెరికాకు చెప్పారు. కానీ, క్షేత్ర స్థాయిలో దళాల మోహరింపు ఆపలేదు. దీంతో అమెరికా దౌత్య సిబ్బంది కుటుంబాలను ఉక్రెయిన్ నుంచి తరలించేపనిలో పడింది. డిసెంబర్లో పుతిన్ చేసిన డిమాండ్లకు జనవరి 26న నాటో లిఖిత పూర్వకంగా స్పందించింది. ఉక్రెయిన్ను నాటోలో చేరకుండా అడ్డుకోలేమని వెల్లడించారు. కానీ, ఆయుధ నియంత్రణ వంటి అంశాలపై చర్చలకు సిద్ధమని ప్రకటించారు.
ఫిబవరి నాటికి రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు, జర్మనీ ఛాన్స్లర్లు దౌత్య యత్నాలను తీవ్రం చేసినా ఫలితం లేదు. మరోపక్క జర్మనీ, ఇతర ప్రాంతాల్లోని తన దళాలను రొమేనియా, పోలాండ్ తదితర ప్రాంతాలకు తరలించే పనిలో అమెరికా తలమునకలైంది.
రష్యా కూడా 30,000 మంది సైనికులను మిత్రదేశమైన బెలారస్కు తరలించింది. దీంతో ఉక్రెయిన్ను మూడు వైపుల నుంచి ముట్టడించే అవకాశం రష్యాకు దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం