News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (20-09-2022)
Updated : 20 Sep 2022 13:20 IST
1/24
చుట్టూ పచ్చదనం నిండిన కొండలు.. వాటిపై మంచు పర్వతాల్లా కనిపించే తెల్లని మేఘాలు. మధ్యలో ఆహ్లాదంగా కనిపించే ఆండ్ర జలాలు.. మెంటాడ మండలంలోని ఆండ్ర జలాశయం వద్ద సోమవారం కనిపించిన దృశ్యమిది.
2/24
ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో సోమవారం సీతాకోకచిలుకను పోలిన అరుదైన కీటకం పలువురిని ఆకర్షించింది. సీతాకోకచిలుకను తలపిస్తోంది. సిట్రస్ జాతి పండ్ల (నారింజ, బత్తాయి వంటివి) రసాన్ని పీల్చే ఈ కీటకం వర్షాకాలంలో రాత్రివేళల్లో ఎక్కువగా సంచరిస్తుందని, దీని శాస్త్రీయనామం యుడోసిమా పుల్లోనియా అని ఎస్కేబీఆర్ కళాశాల బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ టి.రామకృష్ణ తెలిపారు.
3/24
ఇందుపల్లి ప్రధాన పంట కాలువలో సోమవారం ఈదుతూ వెళ్లిన ఆరు నీటి కుక్కలు స్థానికులను కనువిందు చేశాయి. తొలుత వాటిని చూసి భయపడినా నీటికుక్కలుగా గుర్తించామని.. అటవీ ప్రాంతాల్లో అరుదుగా కనిపించే ఇవి మూడు అడుగుల ఎత్తు ఉంటాయని అక్కడివారు పేర్కొన్నారు.
4/24
పాఠశాలకు వెళ్లడానికి బస్సు సదుపాయం లేక విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విడపనకల్లు మండలంలోని ఎన్.తిమ్మాపురంలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 56 మంది ఉన్నారు. వారిలో విద్యార్థినులే అధికం. ఆరు కిలోమీటర్ల దూరంలోని గడేకల్లు జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళుతున్నారు. బస్సు సదుపాయం లేక ఎక్కువ మంది నడుచుకుంటూ వెళుతుండగా.. కొందరు ఆటోలు ఆశ్రయిస్తున్నారు. ఆటోలో కిక్కిరిసి ఉంటుండంతో ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు.
5/24
గోదావరి వరదలు రైతులకు కన్నీళ్లే మిగుల్చుతున్నాయి. కూనవరం మండలంలోనే విలువైన లంక భూముల్లో వరుసగా వస్తున్న వరదలతో పొలంలో నాగలి పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే సాగు ఆలస్యమైందని, వర్షాలు కురుస్తుండటంతో సాగు చేపట్టలేకపోతున్నామని రైతులు కలత చెందుతున్నారు.
6/24
ఎన్ని కష్టాలెదురైనా, ఎవరూ పట్టించుకోకున్నా తల్లికి సేవ చేస్తూ, వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు కుమారుడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్కు చెందిన అరవై ఐదేళ్ల కొరిమి మల్లయ్యను, ఆయన తల్లి సాయమ్మను పిల్లలు పట్టించుకోక పోవడంతో దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. మల్లయ్య భార్య రెండు దశాబ్దాల క్రితం చనిపోయింది. వారికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వేములవాడ, జగిత్యాల, కొండగట్టు, సిరిసిల్ల, సిద్దిపేట, కొమురవెల్లి ప్రాంతాలన్నీ తిరిగారు. ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు ఏరుకొని అమ్ముతూ వచ్చిన దాంతో జీవనం సాగిస్తున్నారు. ఆయన పిల్లలు జగిత్యాల జిల్లాకు వలస వెళ్లారు.
7/24
హైదరాబాద్ శివారు తుర్కయాంజాల్ మాసాబ్ చెరువులో ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన చిత్రమిది. ఓ చేపను నీటిపాము నోట కరచుకొని ఒడ్డుకు చేరుతున్న దృశ్యమిది. వేటాడి పట్టుకున్న చేపను నీటిలోంచి ఒడ్డుకు తేవాలంటే కష్టం. నీటిలో చేప తప్పించుకునే అవకాశముంది. అందుకే పాము తలను పైకెత్తి నోటితో చేపను గట్టిగా పట్టుకుని వెళుతూ కనిపించిందిలా.
8/24
అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి కుమారుడు హనుమంతరెడ్డి చిన్నప్పటి నుంచి మానసికంగా ఎదగలేదు. 40 ఏళ్ల వయసు వచ్చినా.. ఆయనకు సపర్యలన్నీ తల్లిదండ్రులు చేయాల్సిందే. గత నెల నుంచి ఆయన సోదరుడు జేఎన్టీయూలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగిగా పనిచేస్తుండటంతో పింఛను నిలిపేశారు. ఎవరికీ హాని కలగకుండా ఉండేందుకు కుమారుడిని గొలుసుతో బంధించి సోమవారం అనంతపురం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చేందుకు తండ్రి తీసుకువచ్చారు. పింఛను నిలిపేస్తే ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని, ఎలాగైనా పునరుద్ధరించాలని కోరారు.
9/24
ముఖ్యమంత్రి వెళ్లే దారిలో రోడ్డు దుస్థితి ఇది. సీఎం నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే కృష్ణా కరకట్ట మార్గంలో కొండవీటి వాగుపై ఉన్న వంతెనపై గుంతలు పడడంతో వర్షపు నీరు చేరింది. దీంతో సోమవారం ఉదయం సీఎం కాన్వాయ్ వచ్చే ముందు వంతెన మీద ఉన్న గుంతల్లో నీటిని బకెట్లతో తోడి నదిలో పోశారు. ఈ మార్గం చాలా చోట్ల ఇప్పటికే అంచుల్లో కుంగిపోయింది. కొన్ని నెలలుగా రహదారి పరిస్థితి దయనీయంగా ఉన్నా పట్టించుకునే వారే లేరు.
10/24
11/24
పాకిస్థాన్లోని దక్షిణ సింధ్ ప్రావిన్సు థార్పార్కర్లో స్వచ్ఛంద సంస్థ అందించే ఆహారం కోసం బారులుదీరిన వరద బాధితులు
12/24
భూకంపం కారణంగా తైవాన్లోని హువాలియన్లో కూలిపోయిన గోలియావో వంతెన
13/24
ఎలిజబెత్-2 అంతిమయాత్రలో సైనికుల కవాతు
14/24
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు ముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
15/24
కూచిపూడి...భరతనాట్య ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. వివిధ రాష్ట్రాల కళాకారుల అభినయంతో వీక్షకులు మంత్రముగ్ధులయ్యారు.విశాఖపట్నం పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో మూడు రోజులుగా కళాభిమానులను ఆకట్టుకుంటున్న ‘వైశాఖి’ నృత్యోత్సవాలు సోమవారం ముగిశాయి. ప్రతిభావంతులకు బహుమతులు ప్రదానం చేశారు. నృత్యవిన్యాసాల్లో ఓ ఆసక్తికర దృశ్యమిది.
16/24
భీమదేవరపల్లి మండలం వంగర పీవీ రంగారావు బాలికల ఆశ్రమ పాఠశాలలో 597 మంది చదువుతున్నారు. విద్యార్థినులకు భోజనశాల లేకపోవడంతో ఇలా బారులుదీరాల్సి ఉంటుంది. వాన వస్తే ఆ రోజు మరింత దయనీయంగా ఉంటుంది. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అధికారులు స్పందించి భోజనశాల ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
17/24
వడ్డేపల్లి చెరువు కట్టపై నడుస్తూ వెళ్లే వారు జలకళను చూసి ఆనందపడుతుంటారు. కాజీపేట నుంచి రామగుండం వైపు రైల్లో వెళ్లే వారు సైతం సరస్సు మధ్యలోంచి పయనిస్తూ అనుభూతి పొందుతారు. చెరువుతోపాటు రైలు, చుట్టూ ప్రాంతం కనిపించేలా రామినేని భరత్ తీసిన చిత్రాలను ‘న్యూస్టుడే’ సేకరించింది.
18/24
శంషాబాద్ సమీపంలో ఇటీవల ప్రారంభించిన పైవంతెన ఓ వైపు దారి మూసేశారు. వంతెనపై లోపాల కారణంగా శంషాబాద్ నుంచి నగరం వైపు వచ్చే వాహనాలను పైకి వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. రూ.కోట్లతో నిర్మించిన వారధి ఓ వైపు నిరుపయోగంగా మారింది.
19/24
గుర్రాన్ని మచ్చిక చేసుకునేందుకు ఆప్యాయంగా నిమురుతున్నట్లుంది కదూ ఈ చిత్రం. పిల్లలను ఆకట్టుకునేందుకు ఇందిరాపార్కులో బల్లలను విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దారు. గుర్రంలా ఏర్పాటు చేసిన బల్ల వద్ద చిన్నారి.
20/24
రామంతాపూర్లో అన్నపూర్ణ క్యాంటిన్ వద్ద మ్యాన్హోల్ మరమ్మతులకు రహదారి తవ్వారు. నిర్మాణ వ్యర్థాలు అడ్డు తొలగించకపోవడంతో రూ.5 భోజనం చేసేందుకు వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు.
21/24
ఇళ్లపై నీటి ట్యాంకులను విమానాల ఆకారంలో నిర్మిస్తుంటారు కొందరు. మరికొందరు అలంకరణ కోసం ఇలాంటివి నివాసాలపై ఏర్పాటు చేయిస్తుంటారు. ఇది అలా చేసింది కాదు. బేగంపేట విమానాశ్రయంలో దిగే క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానం వద్ద మెట్రో మార్గంపై నుంచి వెళుతుండగా ఈ చిత్రం ఆవిష్కృతమైంది.
22/24
ట్రాఫిక్ విభాగం ఎన్ని వ్యూహరచనలు చేసినా రద్దీ వేళల్లో వాహనదారులకు అష్టకష్టాలు తప్పడంలేదు. ముఖ్యంగా కీలక మార్గాలు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నం.1 నుంచి మాసబ్ట్యాంక్కు వెళ్లే దారిలో సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో చిక్కుకుపోయిన వాహనాలివి.
23/24
వర్షం కురిసినప్పుడు ఖైరతాబాద్ ప్రధాన రహదారి జలమయం అవుతోంది. కొన్ని రోజుల వరకు రహదారి పక్కన నీరు నిలుస్తోంది. దీంతో మురుగుగా మారి దుర్వాసన వస్తోంది. సిగ్నల్ పడినప్పుడు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
24/24
పాతబస్తీ దారుల్షిఫా రోడ్డులో పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించిన అధికారులు.. ఆ ప్రాంతంలో ఇలా పెద్ద డ్రమ్ములను కుండీలుగా మార్చి మొక్కలు నాటారు. అవి పచ్చగా ఎదిగినప్పటికీ పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు పెరిగి నిర్వహణ లేక అధ్వానంగా మారిపోయాయి.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్