న్యూజిలాండ్‌ ఎంపీగా మేఘన

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భారత సంతతి వారు ఉన్నత పదవులు అధిరోహిస్తూ దేశఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. ఈ కోవలోకే ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన(18) చేరారు. న్యూజిలాండ్‌

Published : 15 Jan 2022 02:50 IST

టంగుటూరు యువతికి అరుదైన గౌరవం  
సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఎంపిక  

టంగుటూరు, న్యూస్‌టుడే: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భారత సంతతి వారు ఉన్నత పదవులు అధిరోహిస్తూ దేశఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. ఈ కోవలోకే ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన(18) చేరారు. న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికై అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఆ దేశ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక నేపథ్యంలో ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌ సభ్యురాలిగా ‘వాల్కటో’ ప్రాంతం నుంచి ఎంపికయ్యారు.  
ఉత్తమ విద్యార్థినిగా...: మేఘన తండ్రి గడ్డం రవికుమార్‌ ఉద్యోగ రీత్యా 2001లో భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. మేఘన అక్కడే పుట్టి పెరిగారు. కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ ఉన్నత పాఠశాలలో స్కూలింగ్‌ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఆమె ‘హెడ్‌గర్ల్‌’గా ఉండి విద్యార్థుల సమస్యలను మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవారు. నియోజకవర్గాల వారీగా అందించే ‘ఆల్‌ ట్రూజా’ అవార్డును సైతం అందుకున్నారు. సెయింట్‌ పీటర్స్‌ స్కూల్‌ చరిత్రలో తొలిసారిగా భారత సంతతికి చెందిన మేఘనను ఉత్తమ విద్యార్థినిగా పాఠశాల గుర్తించింది.  

అనాథ శరణాలయాలకు అండగా...
న్యూజిలాండ్‌కు వలస వచ్చిన పలు దేశాల శరణార్థులకు కనీస వసతులు, విద్య, ఆశ్రయం కల్పించడంలో మేఘన కీలక పాత్ర పోషించారు. తోటి స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథ శరణాలయాలకు ఇస్తున్నారు. ఆమె సేవా కార్యక్రమాలను గుర్తించిన న్యూజిలాండ్‌ ప్రభుత్వం ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ఆమెను ‘వాల్కటో’ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక చేసింది. 2021 డిసెంబర్‌ 16వ తేదీన జరిగిన ఈ ఎంపిక విషయాన్ని ఆ ప్రాంత ప్రభుత్వ ఎంపీ టిమ్‌ నాన్‌ డిమోలెన్‌.. మేఘన కుటుంబసభ్యులకు తెలిపారు. ఫిబ్రవరిలో ఆమె ప్రమాణ స్వీకారం ఉంటుందని సంక్రాంతికి స్వగ్రామం వచ్చిన కుటుంబసభ్యులు తెలిపారు. ‘‘న్యూజిలాండ్‌ దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తుతా. ఆ దేశానికి వచ్చిన శరణార్థులను ఆదుకొని అక్కున చేర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొనేలా ప్రయత్నిస్తా’’ అని మేఘన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని