వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు

వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్‌ బాస్‌’పై ఎన్నికల సంఘం వేటు వేసింది.

Published : 07 May 2024 06:05 IST

అనంతపురం రేంజి డీఐజీని బదిలీ చేసిన ఎన్నికల సంఘం
మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలే చట్టమన్నట్లు అమ్మిరెడ్డి విధులు

ఈనాడు-అమరావతి, చిత్తూరు, ఈనాడు డిజిటల్‌-అనంతపురం: వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్‌ బాస్‌’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. అనంతపురం రేంజి డీఐజీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ప్రతిపక్షాలపై అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిపై విచారించిన ఎన్నికల సంఘం చివరకు ఆయన్ను బదిలీ చేసింది. ఆయన తర్వాత స్థానంలోని అధికారికి బాధ్యతలు అప్పగించి వెంటనే విధుల నుంచి రిలీవ్‌ చేయాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు వీలుగా ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పేర్లతో సోమవారం రాత్రి 8 గంటల్లోగా ప్యానల్‌ జాబితాను సమర్పించాలని సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది.

వైకాపా నేతలకు జీహుజూర్‌

అమ్మిరెడ్డి 2023 ఏప్రిల్‌ 13న అనంతపురం రేంజి డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. వైకాపా నేతలు చెప్పారంటే చాలు.. జీహుజూర్‌ అంటారన్న విమర్శలున్నాయి. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైకాపా ఎమ్మెల్యేలు కోరిన సీఐలకు పోస్టింగులిచ్చి పరోక్షంగా సహకరించారు. అనంతపురం సబ్‌డివిజన్‌ పరిధిలో సొంత సామాజికవర్గానికి చెందిన సీఐలను నియమించి వైకాపా నాయకులకు అండదండలు అందించారు. డీఎస్పీలు, సీఐలు క్షేత్రస్థాయిలో వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోలేదు. పైగా మరింత ప్రోత్సహించారు. వైకాపా విధేయుడిగా పేరున్న వీరరాఘవరెడ్డిని అనంతపురం డీఎస్పీగా తీసుకురావడంలో అమ్మిరెడ్డిదే కీలకపాత్రనే విమర్శలున్నాయి. వీరరాఘవరెడ్డి ఏకపక్ష ధోరణిపై తెదేపా పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించలేదు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అనంతపురం గ్రామీణ సర్కిల్‌, ఇటుకలపల్లి సర్కిల్‌ పోలీసులు తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదులున్నా చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోడ్‌కు ముందే అనంతపురం గ్రామీణం, ఇటుకలపల్లి సీఐలను బదిలీ చేయాలని ఫిర్యాదులొచ్చినా వారిని ఆ స్థానాల్లోనే కొనసాగించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడం, రౌడీషీట్లు తెరవడం వంటివి డీఐజీ పర్యవేక్షణలోనే సాగాయనే విమర్శలున్నాయి.

అంగళ్లు ఘటనలో వైకాపాకు వత్తాసు..

గతేడాది ఆగస్టులో అంగళ్లు వద్ద మాజీ సీఎం చంద్రబాబుపై రాళ్లదాడి సంఘటనలో అధికార పార్టీని సమర్థిస్తూ.. ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మాట్లాడారు. ఆ సంఘటనలో చంద్రబాబుతోపాటు మరికొందరు తెదేపా నాయకులపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గనిర్దేశంలో డీఐజీ చేశారని ఆరోపణలొచ్చాయి. అప్పట్లో ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’లో భాగంగా పుంగనూరు మీదుగా చంద్రబాబు పర్యటించేందుకు పోలీసులు అనుమతించలేదు. చంద్రబాబును పుంగనూరు మీదుగా తీసుకెళ్లాలని తెదేపా శ్రేణులు పట్టుదలగా భీమగానిపల్లె కూడలి వద్ద ఉన్నాయి. ఆయన్ను పుంగనూరుకు రానివ్వకూడదని పోలీసులు భీష్మించుకు కూర్చున్నారు. అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు. రాళ్లు రువ్వారు. గాల్లోకి కాల్పులు జరిపారు. తెదేపా కార్యకర్తలు సైతం ప్రతిస్పందించారు. ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం శ్రేణులకు గాయాలయ్యాయి. ఈ ఒక్క సంఘటనపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. దాదాపు 600 మందిని నిందితులుగా చూపారు. 300 మందికిపైగా అరెస్టు చేసి చిత్తూరు జిల్లా జైలు, కడప కేంద్ర కారాగారానికి పంపారు. సంఘటన జరిగిననాడు అక్కడ లేనివారినీ అరెస్టు చేశారు. వైకాపా నాయకులు చెప్పినట్టు పుంగనూరు పోలీసులు వినాలని డీఐజీ అప్పట్లో ఆదేశించారనే ఆరోపణలున్నాయి.

మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే విధులు

డీఐజీగా అమ్మిరెడ్డి బాధ్యతలు చేపట్టాక పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీవారు పేట్రేగిపోయారు. తెదేపా శ్రేణులపై దాడులు చేయడం, తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసే విషసంస్కృతిని తెచ్చారు. అరాచకాలపై డీఐజీగా చర్యలు తీసుకోవాల్సిన అమ్మిరెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్లు చేశారు. శాంతిభద్రతలు అదుపు తప్పినా స్పందించలేదనే ఆరోపణలున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో రైతుభేరి నిర్వహించాలని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్‌ పలుమార్లు నిర్ణయించారు. అనుమతించాలని హైకోర్టు సైతం ఆదేశించినా డీఐజీ హోదాలో ఆయన స్పందించలేదు. ఈ ఏడాది జనవరి 12న పుంగనూరు మండలం చదళ్ల వద్ద ‘ధర్మపోరాట సభ’ నిర్వహించేందుకు రామచంద్రయాదవ్‌ అనుచరులు ఏర్పాట్లు చేస్తుండగా అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తలను వాహనాల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. గంగవరం సీఐ కృష్ణమోహన్‌ ఒక కార్యకర్తను చెప్పుతో కొట్టారు. దీనిపై డీఐజీకి ఫిర్యాదు చేసినా సదరు సీఐపై చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక కూడా డీఐజీ అమ్మిరెడ్డి స్వామి భక్తిని వీడలేదు. గత నెలలో సీఎం జగన్‌ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించినపుడు నిబంధనలు పక్కనపెట్టి సీఎం కాన్వాయ్‌ ముందు నడుస్తూ భద్రత పర్యవేక్షించారు. అలాగే ఇటీవల సీఎం జగన్‌ తాడిపత్రి పర్యటనకు వచ్చినప్పుడు అనంతపురంనుంచి తాడిపత్రి వరకు మంత్రి పెద్దిరెడ్డి వెంట వెళ్లారు.

పెద్దిరెడ్డి స్వగ్రామంలో సంఘటనపైనే వేటు!

మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం సదుం మండలం యర్రాతివారిపల్లెలో ఏప్రిల్‌ 29న రామచంద్ర యాదవ్‌, ఆయన అనుచరులు ప్రచారానికి వెళ్లారు. మంత్రి ఊళ్లో ఎలా ప్రచారం చేస్తారని వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో ప్రచార వాహనాలపై దాడి చేశారు. అక్కడున్న పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప నియంత్రించేందుకు ప్రయత్నించలేదు. అక్కడినుంచి తప్పించుకుని కొంతదూరంలోని గొడ్లవారిపల్లెకు రాగా అక్కడా వైకాపా శ్రేణులు విధ్వంసానికి దిగాయి.
ఈ సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదుం పోలీసుస్టేషన్‌కు వెళ్లగా దాదాపు 200 మంది వైకాపా కార్యకర్తలు స్టేషన్‌ బయట, ఆవరణలో మోహరించారు. ‘వాడిని మాకు వదిలేయండి.. బుద్ధి చెబుతాం’ అంటూ హెచ్చరించారు. స్టేషన్‌ ఎదుటే ఉన్న ప్రచార రథానికి నిప్పుపెట్టారు. మరుసటి రోజు డీఐజీ అమ్మిరెడ్డి సదుం పోలీసుస్టేషన్‌, యర్రాతివారిపల్లెలకు వచ్చి పరిశీలించి వెళ్లారు. బాధ్యులైన వైకాపా నాయకులపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అమ్మిరెడ్డి, పుంగనూరు సీఐ రాఘవరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రామచంద్రయాదవ్‌ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అమ్మిరెడ్డిపై వేటు పడటానికి ప్రధాన కారణం సదుం మండలంలో జరిగిన సంఘటనేనని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు