2024.. అత్యంత వేడి సంవత్సరం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్‌ ట్రెండ్స్‌’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

Updated : 07 May 2024 06:53 IST

చరిత్రలోనే తొలి ఐదు స్థానాల్లో ఒకటి   
సూపర్‌ ఎల్‌నినోతో తీవ్ర ఉష్ణోగ్రతలు 
ముందస్తు రుతుపవన జల్లుల జాడే లేదు
ఎన్నికలపై ఎండల ప్రభావం  
క్లైమేట్‌ ట్రెండ్స్‌ నివేదిక వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్‌ ట్రెండ్స్‌’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ముందస్తు రుతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్‌ నెలలో.. భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తరువాత ఐదో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో 2023 జూన్‌ నుంచి 10 నెలలుగా ప్రతినెలా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, 11వ మాసం (ఏప్రిల్‌) అత్యంత వేడి నెలగా రికార్డులకు ఎక్కిందని తెలిపింది. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు జరుగుతున్న ఓటింగ్‌, అభ్యర్థుల ప్రచారంపై వాతావరణ మార్పుల ప్రభావం ఉందని పేర్కొంది. ఈ మేరకు ‘‘దేశంలో మరోసారి వేసవిలో ఎన్నికలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు అనుకూలిస్తాయా?’’ అనే అంశం పేరిట నివేదిక విడుదల చేసింది.

ముఖ్యాంశాలివీ...

  • ఈ ఏడాదిలో ప్రపంచంలోని 49% జనాభా 64 దేశాల్లో ఓటుహక్కు వినియోగించుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా 90 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు.
  • సాధారణంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 4-8 రోజులు వడగాలులు ఉంటాయి. ఈసారి అది 10-20 రోజులకు పెరిగింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కేరళలో ఓటు వేసేందుకు వరుసల్లో నిల్చోవడంతో పది మంది ఎండదెబ్బకు మరణించారు. కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం ఏప్రిల్‌ 22 నాటికి 413 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో 124 కేసులు నమోదైతే ఒక మరణం సంభవించింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటికే 20% ముందస్తు రుతుపవనాల వర్షపాతం లోటు నమోదైంది. మానవ తప్పిదాల కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులతో ఎల్‌నినో మరింత బలంగా మారుతోంది. గతంలో ఎల్‌నినో కారణంగా 2016 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. 2023లో సూపర్‌ ఎల్‌నినో కారణంగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
  • భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం భారత ద్వీపకల్పం మీదుగా యాంటీ సైక్లోన్ల వాతావరణం కారణంగా దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడటం లేదు. దీంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌ నుంచి సముద్రగాలులు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
  • దేశంలోని కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటితే అత్యంత ప్రమాదంగా భావిస్తాం. ఈ తరహా ఉష్ణోగ్రతలు తీర ప్రాంతాలతో పాటు దేశంలోని అన్నిచోట్ల నమోదయ్యాయి. భారత తూర్పు తీరప్రాంతం అత్యంత ప్రభావమైంది.
  • అమెరికాకు చెందిన క్లైమేట్‌ సెంట్రల్‌ సంస్థ వెల్లడించిన ప్రకారం ఎన్నికలు ప్రారంభమైన తరువాత ఏప్రిల్‌లో భారత్‌లోని 51 ప్రధాన నగరాలకు గాను 36 నగరాల్లో వరుసగా 3 అంతకన్నా ఎక్కువ రోజులు 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో 3 రోజుల కన్నా ఎక్కువగా 18 నగరాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మాజీ ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలు..

వేసవిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌, కమిషనర్లు నివేదికలో తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘‘ప్రస్తుత ఎన్నికలను 2023 డిసెంబరు 17 నుంచి 2024 జూన్‌ 16 వరకు ఎప్పుడైనా నిర్వహించవచ్చు. అయితే నవంబరు, డిసెంబరుల్లో కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో లోక్‌సభ ఎన్నికలు రెండు, మూడు నెలల జాప్యంతో నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, రాష్ట్రాల ఎన్నికలు రెండు నెలలు ఆలస్యం చేసి, పార్లమెంటు ఎన్నికలు ఆ 6 నెలల కాలంలో నిర్వహించాలి. 2029లోనూ సాధారణ ఎన్నికలకు జనవరి 1 నుంచి జూన్‌ 30 వరకు కాలపరిమితి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలమైన సమయం. లేదంటే రాష్ట్రాల ఎన్నికలు కొంత ముందు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల కమిషన్‌కు అధికారాలు కల్పిస్తూ చట్టసవరణ చేయాలి.’’ అని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ పేర్కొన్నారు. ‘‘దేశంలో ఎన్నికలను 180 రోజుల్లోగా ఎప్పుడైనా నిర్వహించే అధికారం ఈసీకి ఉంది. వేసవి నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చే ప్రజలకు చల్లటి ప్రదేశాలు, తాగునీటి వసతి కల్పించాలి. అయితే ప్రభుత్వ పదవీకాలాన్ని తగ్గించడానికి వీల్లేదు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ తప్పకూడదు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, వేసవి విపత్తుల ప్రభావాన్ని తగ్గించాలి’’ అని విశ్రాంత ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాస తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని