వసూల్‌ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!

ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలూపుతూ గత ఐదేళ్లుగా అడ్డగోలుగా అనుమతులిచ్చి వారి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలోని ఒక అత్యున్నతాధికారి... ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న వేళ కూడా వైకాపాకు మేలు జరిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Updated : 01 May 2024 09:36 IST

ఎన్నికలయ్యే వరకు ఆస్తిపన్నుపై ఒత్తిడి చేయొద్దని మౌఖిక ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలూపుతూ గత ఐదేళ్లుగా అడ్డగోలుగా అనుమతులిచ్చి వారి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలోని ఒక అత్యున్నతాధికారి... ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న వేళ కూడా వైకాపాకు మేలు జరిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్‌ పూర్తయ్యే వరకు పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను వసూళ్ల కోసం ప్రజలకు డిమాండ్‌ నోటీసులివ్వొద్దని.. పన్ను చెల్లించాలని ఎవరిపైనా ఒత్తిడి తేవొద్దని కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏప్రిల్‌ 1 నుంచి చేపట్టిన ఆస్తి పన్ను వసూళ్ల కారణంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళన ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపుతుందని.. ప్రచారానికి వెళుతున్న నేతలను ప్రజలు నిలదీయక ముందే నివారణ చర్యలు తీసుకోవాలన్న వైకాపా పెద్దల ఆదేశాలతో అత్యున్నతాధికారి రంగంలోకి దిగారు. సోమవారం నుంచి ఆస్తి పన్ను వసూళ్ల కోసం సిబ్బందిని వీధుల్లోకి పంపొద్దని అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో ఆదివారం సెలవు రోజు కూడా ఆస్తి పన్ను చెల్లించి 5% రిబేటు ప్రజలు ఉపయోగించుకోవాలని తెగ హడావుడి చేసిన ఉద్యోగులు సోమవారం తమ నోటికి తాళాలు వేసుకున్నారు. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్ను చెల్లిస్తే తీసుకోవాలని.. ఎవరిపైనా ఒత్తిడి చేయొద్దని అధికారులు సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

చెత్త పన్ను వెనుకా ఇదే వ్యూహం

పట్టణ స్థానిక సంస్థల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణపై వసూలు చేస్తున్న వినియోగ రుసుములు ఎన్నికల ముందు నిలిపి వేయడంలోనూ అత్యున్నతాధికారి ప్రమేయం ఉంది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలతోనే ఇళ్ల నుంచి చెత్త సేకరణ అమలులో ఉన్న పుర, నగరపాలక సంస్థల్లో రెండు, మూడు నెలలుగా వసూళ్లు నిలిపివేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వసూళ్లలో వెనుకబడిన వార్డు సచివాలయాల ఉద్యోగులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసే కమిషనర్లూ కొద్ది రోజులుగా కిమ్మనడం లేదు. చెత్త పన్ను వసూళ్లపై మొదటి నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా జగన్‌ ప్రభుత్వం ప్రజలు ముక్కుపిండి మరీ ఏటా రూ.140 కోట్లపైనే వసూలు చేస్తోంది. ఎన్నికల కోడ్‌ రావడానికి రెండు నెలల ముందు నుంచి చెత్త పన్ను వసూళ్లపై ఒత్తిడి తగ్గించారు. ప్రస్తుతానికి చాలా పుర, నగరపాలక సంస్థల్లో ఈ ప్రస్తావనే లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని