పదవీ విరమణ కోసం పది పెట్టుబడి మార్గాలు
సరైన ఆర్థిక ప్రణాళికతో పదవీ విరమణ తర్వాత కూడా సంతోషమైన జీవితాన్ని గడపవచ్చు.
ఇంటర్నెట్డెస్క్: పదవీ విరమణ తర్వాత ఆదాయం రావడం ఆగిపోతుంది. దీనికి తోడు వయసు పైబడిన కొద్దీ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దీంతో ఖర్చు పెరిగి ఆరు పదుల వయసులోనూ కష్టపడాల్సి రావచ్చు. వృధ్ధాప్యంలో సంతోషమైన జీవనాన్ని కొనసాగించాలంటే వయసులో ఉన్నప్పటి నుంచే ప్రణాళికను ప్రారంభించాలి. యవ్వనంలో ఉన్నప్పుడే పెట్టుబడులు అనే మొక్కను నాటితే.. పదవీ విరమణ సమయానికి అది పెరిగి పెద్దదై మంచి ఫలాలను అందిస్తుంది. మరి అందుకోసం ఉన్న పెట్టుబడి మార్గాలేమిటో ఇప్పుడు చూద్దాం..
పెట్టుబడులు ఎప్పుడు ప్రారంభించాలి...?
పెట్టుబడిదారుడి ఆదాయం, సంపాదన, రిస్క్ను దృష్టిలో పెట్టుకొని ఏ వయసులో పెట్టుబడిన ప్రారంభించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఎంత చిన్న వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే దీర్ఘకాలంలో అన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందొచ్చు. యుక్త వయసులో ఉన్నప్పుడే పెట్టుబడులు ప్రారంభిస్తే రిస్క్ ఎక్కువ తీసుకున్నా ఫర్వాలేదు. పదవీ విరమణ సమయం దగ్గరపడుతున్నా కొద్దీ ఎక్కువ రిస్క్ తీసుకోలేం. రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్నవారు ఎక్కువ శాతం డెట్ ఫండ్లకు కేటాయించడం మేలు.
పదవీ విరమణ తర్వాత రెగ్యులర్గా ఆదాయం పొందేందుకు ఉన్న 10 పెట్టుబడి మార్గాలు..
1. ఫిక్స్డ్ డిపాజిట్లు: బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు సురక్షితంగా ఉండటంతో పాటు కచ్చితమైన రాబడిని అందిస్తాయి. పదవీ విరమణ కోసం డబ్బు దాచుకోవాలనుకుంటున్న వారికి ఇది సరైన ఆప్షన్. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు పోస్టాఫీస్లు, బ్యాంకింగేత సంస్థలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తాయి. అయితే కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ల రాబడిపై ఎలాంటి హామీ ఉండదు.
2. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్: సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో పెట్టుబడులు కేవలం 60 ఏళ్ల తర్వాతనే ప్రారంభించాలి. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పదవీ విరమణ తీసుకున్నవారు 55 సంవత్సరాల నుంచే ప్రారంభించొచ్చు. ఒకరు లేదా ఉమ్మడిగా ఈ ఖాతాలో గరిష్ఠంగా రూ.15 లక్షలు వరకు డిపాజిట్ చేయొచ్చు. సెక్షన్ 80సీ కింద దీనిపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దీనిపై వడ్డీ రేట్లు 7.4 శాతంగా ఉండనున్నాయి.
3. పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ స్కీమ్: ప్రస్తుత వడ్డీ రేటు 6.6 శాతం. దీనికి మెచ్యూరిటీ గడువు 5 సంవత్సరాలు. వ్యక్తిగత ఖాతాలో అయితే గరిష్ఠంగా రూ.4.5 లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే రూ.9 లక్షలు పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే దీనిపై పన్ను రేట్లు వర్తిస్తాయి.
4. నెలవారీ ఆదాయ ప్రణాళికలు: ఎంఐపీ పెట్టుబడులు ఎక్కువగా డెట్ ఫండ్లలోకి చేరతాయి. పెట్టుబడులు సురక్షితంగా ఉండేందుకు పదవీ విరమణ పొందేవారికి ఇది సరైన ఆప్షన్. రిస్క్ తక్కువగా ఉండటంతో పాటు లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా డివిడెండ్లను అందిస్తుంది. ఎవరైతే తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఎటువంటి రిస్క్ లేకుండా సుక్షితంగా దాచుకొని నెలవారీ కొంత ఆదాయం పొందాలనుకుంటున్నారో వారికి ఇది సరైన మార్గం.
5. ఈక్విటీ పెట్లుబడులు: రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేసేవారు మ్యూచువల్ ఫండ్ల ద్వారా లేదా నేరుగా ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టొచ్చు. మొదటిసారిగా మదుపు చేసేవారు మ్యూచువల్ ఫండ్ల ద్వారా పెట్టడం మేలు. రిస్క్ తీసుకునే శాతాన్ని బట్టి ఈక్విటీ కేటాయింపులు ఉంటాయి. అయితే 20 నుంచి 25 శాతం వరకు పదవీ విరమణ నిధిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెడితే లాభాలను పొందొచ్చు.
6. మ్యూచువల్ ఫండ్లు: మ్యూచువల్ ఫండ్లు.. నిపుణులు నిర్వహణలో ఉండటంతో ఇవి చాలా సురక్షితమైనవిగా చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగతంగా విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని (ఎస్డబ్ల్యూపీ) ఎంచుకుంటే గడువు పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతూ వస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అధిక ద్రవ్యోల్బణాన్ని కూడా తట్టుకొని దీర్ఘకాలానికి మంచి లాభాలను అందిస్తాయి. ఎస్డబ్ల్యూపీలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులకు వీలుండదు. వాయిదాల పద్ధతిలో డిపాజిట్ చేస్తుండాలి. పదవీ విరమణ తర్వాత నెలవారీ విత్డ్రా చేసుకోవాలి.
7. పీపీఎఫ్: పీపీఎఫ్ పెట్టుబడులపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. అసలు, వడ్డీ రెండింటిపై పన్ను ఆదా చేసుకోవచ్చు. వార్షికంగా 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో గరిష్ఠంగా సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఖాతా నిర్వహణ కోసం వార్షికంగా కనీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మాత్రమే కాకుండా కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులలోనూ పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. పీపీఎఫ్ ఖాతాకు 15 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి పూర్తయిన అనంతరం కూడా 5 ఏళ్ళ చొప్పున ఖాతాను కొనసాగించొచ్చు.
8. పన్ను రహిత బాండ్లు: మార్కెట్లో చాలా పన్ను రహిత బాండ్లు అందుబాటులో ఉన్నాయి. పదవీ విరమణ నిధి కోసం పొదుపు చేస్తున్నవారికి కచ్చితమైన రాబడితో పాటు, పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఇందులో లిక్విడిటీ సదుపాయం తక్కవగా ఉంటుంది. లాక్-ఇన్ పీరియడ్ కాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఏదైనా అత్యవసర సమయంలో నిధిని తీసుకోవడం కష్టతరమవుతుంది. దీనిలో పెట్టుబడులకు కొంత ఆలోచించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
9. జాతీయ పింఛను విధానం: ఉద్యోగులు పదవీ విరమణ వరకు ఇందులో పెట్టుబడులు చేస్తే ఆ తర్వాత రెగ్యులర్గా పెన్షన్ పొందేందుకు వీలుంటుంది. పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు 60 శాతం విత్డ్రా చేసుకోవచ్చు. మిగతా 40 శాతాన్ని యాన్యుటీగా ఉపయోగిస్తారు. దీనిపై మరో రూ.50 వేల వరకు అదనంగా పన్ను మినహాయింపు ఉంటుంది.
10. యాన్యుటీ ప్లాన్స్: యాన్యుటీ ప్లాన్లు దీర్ఘకాలానికి సరిపడేవి. దీనిపై పన్ను వర్తిస్తుంది. ఇందులో ఒకేసారి ఎక్కువ మొత్తం చెల్లించకుండా, రెగ్యులర్ చెల్లింపులకు అవకాశముంటుంది. యాన్యుటీ ప్లాన్లు రెండు రకాలు. డిఫర్డ్ యాన్యుటీ, ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్లు. డిఫర్డ్ యాన్యుటీలో ఒకేసారి ఎక్కవ మొత్తంలో లేదా రెగ్యులర్గా డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత లేదా మెచ్యూరిటీ తర్వాత పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్లలో ఎక్కువ మొత్తంలో ఒకేసారి పెట్టుబడులు పెట్టొచ్చు. పెన్షన్ కూడా అప్పటి నుంచే వస్తుంది. మదుపు చేసిన మొత్తంపై ఆధారపడి పెన్షన్ లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.