Airtel-VIL: రూ.3,050 కోట్లు కట్టండి.. ఎయిర్‌టెల్‌, వీఐకి డాట్‌ ఆదేశాలు

ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు టెలికాం శాఖ మరో షాకిచ్చింది. రిలయన్స్‌ జియోకు ఇంటర్‌ కనెక్టివిటీ తిరస్కరించిందన్న ఆరోపణలపై ఈ కంపెనీలకు

Updated : 01 Oct 2021 17:47 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు టెలికాం శాఖ మరో షాకిచ్చింది. రిలయన్స్‌ జియోకు ఇంటర్‌ కనెక్టివిటీ తిరస్కరించిందన్న ఆరోపణలపై ఈ కంపెనీలకు రూ.3,050కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని మూడు వారాల్లోగా చెల్లించాలని తాజాగా ఆ కంపెనీలకు డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

2016లో రిలయన్స్‌ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ నెట్‌వర్క్‌తో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా కంపెనీలు ఇంటర్‌ కనెక్టివిటీను నిలిపివేశాయని ఆ మధ్య ఆరోపణలు వచ్చిన విషయం తెలసిందే. జియో వినియోగదారులు ఆ నెట్‌వర్క్‌లకు చేసిన 75శాతం కాల్స్‌ తిరస్కరణకు గురవుతున్నాయని అప్పట్లో జియో ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో చర్యలు చేపట్టిన రెగ్యులేటరీ అథారిటీ.. తొలుత ఈ టెలికాం సంస్థల లైసెన్సులను రద్దు చేయాలని భావించింది. అయితే కోట్లాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని భావించి ఈ సంస్థలకు జరిమానా విధించాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఎయిర్‌టెల్‌కు రూ. 1050కోట్లు, వొడాఫోన్‌కు రూ. 1050 కోట్లు, ఐడియా(ఇప్పుడు వొడాఫోన్, ఐడియా కంపెనీలు ఒకటిగా విలీనమయ్యాయి)కు రూ. 950కోట్ల జరిమానా విధించాలని 2016 అక్టోబరులో ట్రాయ్‌.. టెలికాం శాఖకు సిఫార్సు చేసింది. దీంతో టెలికాం శాఖ ఈ సంస్థలకు జరిమానా విధించింది. దీనిపై ఆయా కంపెనీలు డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ను ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. 2019 జులైలో ఈ కమిషన్‌ కూడా జరిమానాను ఆమోదించింది. అయితే ఇప్పటివరకు ఈ సంస్థలు పెనాల్టీ చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన టెలికాం శాఖ.. గురువారం వాటికి డిమాండ్‌ నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మూడు వారాల్లోగా ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం.

కోర్టుకు వెళ్తాం: ఎయిర్‌టెల్‌

కాగా.. టెలికాం శాఖ జరిమానాపై కోర్టుకు వెళ్తామని ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. ‘‘జరిమానా విధించడంపై మేం అసంతృప్తిగా ఉన్నాం. మాపై వచ్చిన ఆరోపణలు నిరాధారం. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు. చట్టాలకు లోబడే మేం పనిచేస్తాం. నిబంధనలను ఎన్నడూ అతిక్రమించలేదు. ఈ డిమాండ్‌పై న్యాయపరంగా పోరాటం చేస్తాం’’ అని ఎయిర్‌టెల్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై వొడాఫోన్‌ ఐడియా ఇంకా స్పందిచలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని