కొత్త‌ ఐటీఆర్ ఫారాల‌ను విడుద‌ల చేసిన ఆదాయ‌పు ప‌న్ను శాఖ 

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌కు ఐటి శాఖ‌ కొత్త ఫారంలను విడుద‌ల చేసింది.‌

Updated : 02 Apr 2021 14:04 IST

2021-22 అసెస్‌మెంట్ సంత్స‌రానికి కొత్త ఆదాయ పన్ను రిట‌ర్ను ఫారంల‌ను సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేష‌న్‌(సిబిడిటి) నోటిఫై చేసింది. ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్‌-7 వ‌ర‌కు కొత్త‌ ఫారంల‌ను ఏప్రిల్‌1 న విడుద‌ల చేసింది. కోవిడ్‌-19 సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం గత ఏడాదితో పోలిస్తే ఈ సంవ్స‌త‌రం ఐటీ ఫారంలలో చెప్పుకోదగ్గ మార్పులేవీ చేయలేదని సీబీడీటీ తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 లో చేసిన‌ సవరణలకు అనుగుణంగా, అవసరమైన కనీస మార్పులు మాత్రమే చేసిన‌ట్లు సిబిడిటి వెల్ల‌డించింది. 

ప‌న్ను చెల్లింపుదారులు త‌మ పెట్టుబ‌డులను వివరించేందుకు, వారి ఆదాయానికి అనుగుణంగా, సహజ్(ఐటిఆర్-1), ఐటిఆర్ -2, ఐటిఆర్-3, ఐటిఆర్-4(సుగం), ఐటిఆర్-5,  ఐటిఆర్-6,  ఐటిఆర్-7, ఐటిఆర్-వి ఫారంల‌లో త‌గిన ఫారంను ఎంచుకోవ‌చ్చ‌ని సిబిడిటి తెలిపింది.

అధిక సంఖ్య‌లో ఉన్న పెద్ద‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌న్ను చెల్లింపుదారుల‌కు స‌ర‌ళంగా ఉండే ఐటీఆర్ -1(స‌హ‌జ్‌), ఐటీఆర్‌-4(సుగం) ఫారంలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జీతం, ఒక ఇంటి ఆస్తి/ వ‌డ్డీ మొద‌లైన ఇత‌ర వ‌న‌రుల నుంచి ఆదాయం పొందుతూ, రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న వ్య‌క్తులు స‌హ‌జ్‌ను దాఖ‌లు చేయోచ్చు.

హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యుఎఫ్), వార్షిక ఆదాయం రూ .50 లక్షల వరకు ఉన్న సంస్థలు(లిమిటెడ్ ల‌య‌బిలిటి పార్ట‌న‌ర్‌సిఫ్ ఉన్న సంస్థ‌లు త‌ప్ప‌), అదేవిధంగా, వ్యాపారం, వృత్తి నుంచి ఆదాయాన్ని సంపాదించే వ్యక్తులు ఐటీఆర్‌-4 దాఖ‌లు చేయ‌వ‌చ్చు. సంస్థ డైరెక్ట‌ర్‌కు, ఈక్వీటీ షేర్ల‌లో పెట్టుబ‌డి పెట్టిన వ్య‌క్తుల‌కు ఈ రెండు ఐటీఆర్ ఫారంల‌ను వ‌ర్తించ‌వు. 

వ్యాపారం/వృత్తి నుంచి ఆదాయం లేని వ్య‌క్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు(స‌హ‌జ్ ఫైల్ చేసేందుకు అర్హ‌త లేనివారు) ఐటీఆర్-2ను ఎంచుకోవ‌చ్చు. వ్యాపారం, వృత్తి ప‌ర‌మైన ఆదాయం ఉన్న వారు ఐటీఆర్‌-3ని దాఖ‌లు చేయాలి. 

భాగ‌స్వామ్య సంస్థ‌లు, లిమిటెడ్ ల‌య‌బిలిటీ పార్ట్‌న‌ర్‌షిప్ (ఎల్ఎల్‌పీ) సంస్థ‌లు ఐటీఆర్‌-5, కంపెనీలు ఐటీఆర్‌-6, ట్ర‌స్టులు, రాజకీయ పార్టీలు, సంస్థ‌లు, ఛారిట‌బుల్ ఇస్టిట్యూష‌న్లు ఐటీఆర్‌-7లోకి వ‌స్తాయి. 

నోటిఫై చేసిన‌ ఐటిఆర్ ఫారాలు egazette.nic.in లో అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చితే ఐటిఆర్ ఫారాలను దాఖలు చేసే విధానంలో ఎటువంటి మార్పు లేదని ప‌న్ను శాఖ తెలిపింది. 

క్లియర్‌టాక్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్కిత్ గుప్తా మాట్లాడుతూ, "ఈ సంవత్సరం ఐటిఆర్ ఫారమ్‌లలో పెద్ద మార్పులు లేవు, చిన్న చిన్న‌ మార్పులు ఉంటాయి కాబట్టి పన్ను చెల్లింపుదారులు తేలికగా ఫైల్ చేయ‌వ‌చ్చు." అని తెలిపారు. 

చెల్లింపుదారులు, ప‌న్ను చెల్లింపు విధానాన్ని ఎంచుకోవ‌డంతో పాటు, ముంద‌స్తు ప‌న్ను నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా, ముంద‌స్తు ప‌న్ను లెక్కింపు, మూల‌ధ‌న రాబ‌డిపై చెల్లింపులు తెలుసుకునేందుకు ఆర్థిక సంవ‌త్స‌రం 2020-21కి సంబంధించి త్రైమాసిక డివిడెండ్ ఆదాయాన్ని రిపోర్ట్ చేయాలి. 

ఇదిలా ఉండగా, గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం 2020-21లో 2.38 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.2.62 లక్షల కోట్ల విలువైన రీఫండ్లు జారీ చేసిన‌ట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్ల‌డించింది. ఇందులో 2.34 కోట్ల పన్ను చెల్లింపుదారులకు, రూ.87,749 కోట్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను వాపసు, 3.46 లక్షల కేసులలో రూ.1.74 లక్షల కోట్ల విలువైన కార్పొరేట్ పన్ను వాపసు ఉన్నాయి. 2020-21లో జారీ చేసిన రిఫండ్లు దాదాపు 43.2శాతం పెరుగుదలను సూచిస్తుందని ఐటి విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని