పేటీఎం బోర్డు నుంచి చైనీయులు బయటకు

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం బోర్డులో ఉన్న చైనీయులు అందరూ బయటకు వచ్చేశారు. అలీపే ప్రతినిధి జింగ్‌ షియాంగ్‌డాంగ్‌, యాంట్‌ ఫైనాన్షియల్‌కు చెందిన గూమింగ్‌ ఛెంగ్‌, అలీబాబా ప్రతినిధులు మైఖేల్‌ యెన్‌ జెన్‌ యా, టింగ్‌ హాంగ్‌ కెన్నీ

Updated : 08 Jul 2021 10:36 IST

వారి స్థానంలో భారతీయులు, అమెరికన్లు

ప్రతిపాదిత ఐపీఓకు ముందే

వాటాల్లో ఎలాంటి మార్పు లేదు

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం బోర్డులో ఉన్న చైనీయులు అందరూ బయటకు వచ్చేశారు. అలీపే ప్రతినిధి జింగ్‌ షియాంగ్‌డాంగ్‌, యాంట్‌ ఫైనాన్షియల్‌కు చెందిన గూమింగ్‌ ఛెంగ్‌, అలీబాబా ప్రతినిధులు మైఖేల్‌ యెన్‌ జెన్‌ యా, టింగ్‌ హాంగ్‌ కెన్నీ హోలు సంస్థ డైరెక్టర్ల పదవుల్లో నుంచి తప్పుకొన్నారు. వారి స్థానంలోకి భారతీయులు, అమెరికన్లు వచ్చి చేరారు. పేటీఎం పబ్లిక్‌ ఇష్యూకు రాబోతున్న నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న షేర్‌ హోల్డింగ్‌ల్లో (వాటాల్లో) ఎలాంటి మార్పులు లేవని నియంత్రణ సంస్థలకు కంపెనీ సమాచారమిచ్చింది. అమెరికా పౌరుడు డౌగ్లస్‌ ఫీజిన్‌ యాంట్‌ గ్రూప్‌ తరఫున పేటీఎం బోర్డులో చేరారు. సామా క్యాపిటల్‌కు చెందిన అషిత్‌ రంజిత్‌ లిలానీ, సాఫ్ట్‌ బ్యాంక్‌ ప్రతినిధి వికాస్‌ అగ్నిహోత్రి కూడా బోర్డులో జతయ్యారు. బెర్క్‌షైర్‌ హాథవేలో ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ అయిన టాడ్‌ ఆంటోనీ కాంబ్స్‌ పేటీఎం బోర్డు నుంచి గత నెల 30న పదవీ విరమణ పొందారు. పేటీఎమ్‌ మాతృ సంస్థ ఒన్‌97 కమ్యూనికేషన్స్‌ కాగా, ఇందులో అలీబాబా యాంట్‌ గ్రూప్‌ (29.71 శాతం), సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ (19.63 శాతం), సైఫ్‌ పార్ట్‌నర్స్‌ (18.56 శాతం), విజయ్‌ శేఖర్‌ శర్మ (14.67 శాతం), ఏజీహెచ్‌ హోల్డింగ్‌, టి రోవె ప్రైస్‌, డిస్కవరీ క్యాపిటల్‌, బెర్క్‌షైర్‌ హాథవేలు 10 శాతం కంటే తక్కువగా వాటాలు కలిగి ఉన్నాయి. ఐపీఓ ద్వారా రూ.16,600 కోట్ల నిధుల్ని సేకరించేందుకు వాటాదార్ల నుంచి ఈ నెల 12న ఆమోదం లభిస్తుందని పేటీఎం భావిస్తోంది. ఐపీఓ కోసం కంపెనీ విలువను రూ.1.78 లక్షల కోట్లుగా లెక్కగట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను వచ్చే వారంలో కంపెనీ సెబీకి దరఖాస్తు చేసే అవకాశం ఉందని సమాచారం.


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో బజాజ్‌ అలియాంజ్‌ పాలసీలు

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణ బీమా సంస్థ బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తన పాలసీలను విక్రయించేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ)తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 5084 బీఓఐ శాఖలు, 80 రిటైల్‌ బిజినెస్‌ కేంద్రాలు, 60 ఎస్‌ఎంఈ సిటీ కేంద్రాల్లో బజాజ్‌ అలియాంజ్‌ పాలసీలను కొనుగోలు చేయొచ్చు. వాహన, ఆరోగ్య, గృహ, ప్రయాణ బీమా పాలసీలతో పాటు.. ఇతర వాణిజ్య బీమా పాలసీలూ ఇక్కడ అందుబాటులో ఉంటాయని బ్యాంక్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని