ATF price: విమాన ఇంధన ధరల మోత.. రూ.6వేలకు పైనే పెంపు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో దేశీయంగానూ చమురు ధరల మోత మోగుతోంది. గత కొంతకాలంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాస్త స్థిరంగా ఉన్నప్పటికీ.. విమాన ఇంధన ధర మాత్రం పైపైకి పోతోంది

Published : 16 May 2022 13:23 IST

వరుసగా పదోసారి బాదుడు

దిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో దేశీయంగానూ చమురు ధరల మోత మోగుతోంది. గత కొంతకాలంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాస్త స్థిరంగా ఉన్నప్పటికీ.. విమాన ఇంధన ధర మాత్రం పైపైకి పోతోంది. సోమవారం ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యుయల్‌ (ఏటీఎఫ్‌) ధరను మరో 5.3 శాతం పెంచారు. దీంతో దేశ రాజధాని దిల్లీలో కిలోలీటర్‌ ధర రూ.6,188.26 పెరిగి రూ.123,039.71 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠానికి చేరింది.

ఈ ఏడాదిలో ఏటీఎఫ్‌ ధర పెరగడం వరుసగా ఇది పదోసారి కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఆధారంగా ఏటీఎఫ్‌ ధరను ప్రతి నెలా 1, 16వ తేదీల్లో సవరిస్తుంటారు. 2022 జనవరి 1 నుంచి ప్రతి 15 రోజులకోసారి వీటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏటీఎఫ్‌ ధర దాదాపు 55శాతం (రూ.49,017.8) పెరిగింది. విమాన నిర్వహణలో దాదాపు 40 శాతం వాటా వ్యయం ఇంధనానిదే. దీంతో రాబోయే రోజుల్లో విమాన ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశముంది.

మరోవైపు గత 40 రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 6 మధ్య లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధర రికార్డు స్థాయిలో దాదాపు రూ.10 వరకు పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి వీటి ధరల్లో ఏ మార్పు లేదు. దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.41, డీజిల్‌ ధర రూ.96.67గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని