E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్‌.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?

అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడంతోపాటు, పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తుల డేటాకు భద్రత కల్పిచడం, నకిలీ పాస్‌పోర్ట్‌లకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-పాస్‌పోర్ట్‌ (E- Passport)లను తీసుకురానుంది. మరి వీటిని ఎప్పటి నుంచి జారీ చేస్తారు? ఇవి ఎలా పనిచేస్తాయనే వివరాలపై ఓ లుక్కేయండి..

Published : 26 Jun 2022 20:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విదేశీ ప్రయాణం చేయాలంటే.. పాస్‌పోర్ట్‌తోపాటు వీసా తప్పనిసరి. అయితే పాస్‌పోర్ట్ పొందడం అంత సులభమైన ప్రక్రియేమీ కాదు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని, పోలీస్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియలో ఎలాంటి అభ్యంతరాలు లేవని రుజువైతే నేరుగా ఇంటికే వస్తుంది. ఒకవేళ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే తిరిగి కొత్తది పొందడం మరో పెద్ద పని. అంతేకాదు.. అందులోని సమాచారం ఇతరుల చేతికి చేరుతుందనేది మరో బాధ. మరోవైపు నకిలీ పాస్‌పోర్ట్‌లు కట్టడి కూడా కేంద్రానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ-పాస్‌పోర్ట్‌ (E- Passport)లను తీసుకురానుంది. వీటి ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడంతోపాటు, పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తుల డేటాకు భద్రత కల్పిచడం, నకిలీ పాస్‌పోర్ట్‌లకు అడ్డుకట్ట వేయొచ్చని కేంద్రం చెబుతోంది. 

పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ రెండో దశలో భాగంగా గతేడాదే ఈ-పాస్‌పోర్ట్‌లు తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజాగా పాస్‌పోర్ట్ దివస్‌ను పురస్కరించుకుని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కీలక ప్రకటన చేశారు. ‘‘ఈ ఏడాది చివరినాటికి ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తాం. పాస్‌పోర్ట్‌ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి, పౌరులకు ఉత్తమమైన సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ-పాస్‌పోర్ట్‌లను తీసుకొస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు. 

ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?

నిజానికి ఈ-పాస్‌పోర్ట్ కొత్త ప్రక్రియ ఏమీ కాదు. ఇప్పటికే 100కు పైగా దేశాలు తమ పౌరులకు ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తున్నాయి. ప్రస్తుతం వినియోగంలో సాధారణ పాస్‌పోర్ట్ తరహాలోనే ఈ-పాస్‌పోర్ట్‌ను ఉపయోగించవచ్చు. డేటా భద్రత, విదేశాల్లో సులువైన ఇమిగ్రేషన్‌ ప్రక్రియ కోసం వీటిలో ఎలక్ట్రానిక్ చిప్‌ను నిక్షిప్తం చేస్తారు. ఇందులో పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, చిరునామా వంటి వివరాలు ఉంటాయి. ఇది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (RFID) చిప్‌. దీనికి వెనుకవైపు చిన్న యాంటినా ఉంటుంది. దీనిసాయంతో ఇమిగ్రేషన్‌ లేదా ఇతరత్రా సమయాల్లో ప్రయాణికుడి వివరాలను వేగంగా వెరిఫై చేయొచ్చు. ఇప్పటికే ఈ-పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించి కేంద్రం ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌ను ఎంపిక చేసింది. ఇందుకోసం భాతర విదేశాంగ శాఖతో కలిస టీసీఎస్‌ ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.  

ఈ-పాస్‌పోర్ట్‌ల జారీ ఎప్పుడు?

తాజాగా కేంద్ర మంత్రి జైశంకర్‌ చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ఈ-పాస్‌పోర్ట్‌ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధారణ పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులు ఈ-పాస్‌పోర్ట్‌కు అప్‌గ్రేడ్‌ అవ్వాలా? వద్దా? అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ-పాస్‌పోర్ట్‌లు చూసేందుకు సాధారణ పాస్‌పోర్ట్‌ల మాదిరే ఉంటాయి. ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎవరైనా కొత్త పాస్‌పోర్ట్ లేదా పాస్‌పోర్ట్ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఈ-పాస్‌పోర్ట్‌లనే జారీ చేస్తారని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని