Twitter: ట్రంప్ను మళ్లీ ట్విటర్లోకి తీసుకోవాలా? ఓటింగ్ పెట్టిన ఎలాన్ మస్క్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అన్నదానిపై ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ నెటిజన్ల అభిప్రాయం కోరారు. ఇందుకోసం తన ట్విటర్ ఖాతాలో పోలింగ్ ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు గురించి వార్తలు మొదలైనప్పటి నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మస్క్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ట్రంప్ను మళ్లీ ట్విటర్లోకి తీసుకోవాలా అనే దానిపై ఓటింగ్ పెట్టారు.
విద్వేష వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు మస్క్ తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగానే ట్రంప్ ఖాతా పునరుద్ధరణ గురించి ఆయన ప్రస్తావించారు. ఇప్పటికే కొందరి ఖాతాలను పునరుద్ధరించామని, అయితే ట్రంప్ ఖాతా గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ట్రంప్ను ట్విటర్లోకి తిరిగి తీసుకోవాలా వద్దా అన్నదానిపై పోలింగ్ ప్రారంభించారు. ప్రజల నిర్ణయమే, దేవుడి నిర్ణయంగా భావిస్తానని మరో ట్వీట్లో చెప్పారు. ఇప్పటివరకు ఈ పోలింగ్లో 50లక్షల మందికి పైగా పాల్గొనగా.. దాదాపు సగం మంది ట్రంప్ ఖాతాను పునరుద్ధరించేందుకు అనుకూలంగా ఓట్లేసినట్లు తెలుస్తోంది.
2021లో క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంగా ట్రంప్ ఖాతాపై ట్విటర్ శాశ్వత నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆరంభంలో ట్విటర్ను కొనుగోలు చేస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించినప్పటి నుంచి ట్రంప్ ఖాతాను మళ్లీ పునరుద్ధరిస్తారని ఊహాగానాలు వచ్చాయి. దీనిపై ఆ మధ్య మస్క్ కూడా స్పందిస్తూ.. అందుకు తాను కూడా అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ట్విటర్ నిషేధం తర్వాత ట్రంప్ సొంతంగా ‘ట్రూత్’ పేరుతో ఓ సోషల్మీడియా సంస్థను ప్రారంభించారు. ఒకవేళ.. తన ట్విటర్ ఖాతాను పునరుద్ధరించినా మళ్లీ అందులో చేరే ఉద్దేశం తనకు లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.
విద్వేష ట్వీట్లపై కొత్త పాలసీ..
ఈ సందర్భంగా ట్విటర్ కొత్త పాలసీ గురించి మస్క్ వివరించారు. ‘‘విద్వేష/ప్రతికూల ట్వీట్లను గుర్తించి వాటిని డీబూస్ట్ చేయడం లేదా వాటి స్థాయిని తగ్గిస్తాం. అంటే.. అలాంటి ట్వీట్ గురించి ప్రత్యేకంగా వెతికితే తప్ప అవి అందరికీ కన్పించవు. అందువల్ల వాటికి ఎక్కువ రీచ్ ఉండదు. అయితే ఇది కేవలం ట్వీట్లకు మాత్రమే వర్తిస్తుంది. మొత్తం ట్విటర్ ఖాతాకు కాదు’’ అని ట్వీట్ చేశారు. ట్విటర్లో మూకుమ్మడి రాజీనామాలు పెరుగుతున్న వేళ.. మస్క్ ఈ పాలసీని ప్రకటించడం గమనార్హం.
ఉద్యోగులకు అత్యవసర మెయిల్
ట్విటర్లో కొనసాగాలంటే కష్టపడి పనిచేయాలని లేదంటే కంపెనీని వీడి వెళ్లిపోవాలని మస్క్ ఇటీవల అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది సంస్థ నుంచి వైదొలిగేందుకే మొగ్గుచూపుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1200 మంది ట్విటర్కు రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ట్విటర్ ఉద్యోగులకు మస్క్ తాజాగా ఓ అత్యవసర మెయిల్ చేశారు. సాఫ్ట్వేర్ తెలిసిన ఇంజినీర్లు వెంటనే శాన్ఫ్రాన్సిస్కోకు వచ్చి తనతో వ్యక్తిగతంగా సమావేశమవ్వాలన్నది ఆ మెయిల్ సారాంశం. గత ఆరు నెలలుగా వారు చేసిన కోడింగ్ వర్క్కు సంబంధించిన సమ్మరీని తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్