RBI: రూ.500 నకిలీ నోట్లున్నాయ్‌.. జాగ్రత్త

దేశీయంగా అందుబాటులో ఉన్న నగదులో.. విలువ పరంగా రూ.500 నోట్ల వాటా 77% పైగా ఉంది. ఈ నోట్లలోనే నకిలీలు ఏటా పెరుగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం విడుదల చేసిన 2022-23 వార్షిక నివేదిక వెల్లడించింది.

Updated : 31 May 2023 08:01 IST

క్రెడిట్‌ కార్డు చెల్లింపులు పెరిగాయ్‌.. డెబిట్‌కార్డువి తగ్గాయి
యూపీఐ చెల్లింపుల్లో 65% వృద్ధి
ఆర్‌బీఐ వార్షిక నివేదిక
ఈనాడు-దిల్లీ

దేశీయంగా అందుబాటులో ఉన్న నగదులో.. విలువ పరంగా రూ.500 నోట్ల వాటా 77% పైగా ఉంది. ఈ నోట్లలోనే నకిలీలు ఏటా పెరుగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం విడుదల చేసిన 2022-23 వార్షిక నివేదిక వెల్లడించింది. బ్యాంకుల్లో కనపడుతున్న రూ.500 నకిలీ నోట్ల సంఖ్య రెండేళ్లలో 130% అధికమైంది. 2022-23లో మొత్తం 2,25,769 నకిలీ కరెన్సీ నోట్లను బ్యాంకుల స్థాయిలో గుర్తించారు. ఇందులో 4.6% నోట్లను రిజర్వ్‌బ్యాంకు స్థాయిలో, 95.4% నోట్లను ఇతర బ్యాంకుల్లో కనిపెట్టారు. 2021-22తో పోలిస్తే రూ.20 నోట్లలో నకిలీలు 8.4%, రూ.500 నోట్లలో 14.4% పెరిగాయి. ఇదే సమయంలో రూ.10 నోట్లలో 11.6%, రూ.100 నోట్లలో 14.7%, రూ.2,000 నోట్లలో 27.9% తగ్గాయి.

చెలామణిలో రూ.33,48,228 కోట్ల నగదు

* 2023 మార్చి ఆఖరుకు ఆర్థిక వ్యవస్థలో రూ.33,48,228 కోట్ల నగదు చెలామణిలో ఉంది. 2021-21తో పోలిస్తే 2022-23లో చెలామణిలో ఉన్న నోట్ల విలువ 7.8%, పరిమాణం 4.4% మేర అధికమైంది.

* మొత్తం నగదులో విలువ పరంగా 77.1%, సంఖ్యాపరంగా 37.9% వాటా రూ.500 నోట్లదే. విలువ పరంగా రూ.2వేల నోట్ల వాటా 10.8%. ఈ రెండు పెద్ద నోట్ల విలువే, మొత్తం ఆర్థిక వ్యవస్థలో 87.9% ఉంది. ఏడాది క్రితం వీటి వాటా 87.1 శాతమే.

రూ.2000 నోట్ల వాటా 1.3 శాతమే

* దేశ ఆర్థిక వ్యవస్థలో రూ.2,000 నోట్ల వాటా మార్చి ఆఖరుకు 1.3 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఈ వాటా 1.6%. విలువ పరంగా చూసినా వీటి వాటా 13.8% నుంచి 10.8 శాతానికి పరిమితమైంది. సెప్టెంబరు 30లోపు రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో జమచేయాలని లేదా ఇతర నోట్లలోకి మార్చుకోవాలని ఆర్‌బీఐ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.  

* నోట్ల ముద్రణ కోసం 2022-23లో ఆర్‌బీఐ రూ.4,682.80 కోట్లు ఖర్చుచేసింది. 2021-22లో ఇందుకు వెచ్చించిన రూ.4,984.80 కోట్లతో పోలిస్తే 6.05% తక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం 2,26,000 నోట్లను ముద్రించింది. 2022-23లో మొత్తం 2,29,264 చిరిగిపోయిన నోట్లను పక్కనపెట్టింది.

* ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఇ-రూపీ-టోకు విలువ రూ.10.69 కోట్ల మేర; ఇ-రూపీ-రిటైల్‌ విలువ రూ.5.70 కోట్ల మేర ఉంది.

* 2022-23లో క్రెడిట్‌ కార్డు చెల్లింపులు పెరిగి, డెబిట్‌కార్డు చెల్లింపులు తగ్గాయి. 2021-22లో రూ.9.72 లక్షల కోట్ల మేర ఉన్న క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, 2022-23లో రూ.14.32 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో డెబిట్‌కార్డు చెల్లింపులు రూ.7.30 లక్షల కోట్ల నుంచి రూ.7.20 లక్షల కోట్లకు తగ్గాయి.

* యూపీఐ చెల్లింపులు రూ.84.16 లక్షల కోట్ల నుంచి 65.33% వృద్ధితో రూ.139.15 లక్షల కోట్లకు;  ఆన్‌లైన్‌లో నగదు బదిలీకి ఉపయోగ పడే ఐఎంపీఎస్‌ లావాదేవీల విలువ రూ.41.71 లక్షల కోట్ల నుంచి  33.90% పెరిగి రూ.55.85 లక్షల కోట్లకు చేరాయి.

* డిజిటల్‌ చెల్లింపులు రూ.1,774.01 లక్షల కోట్ల నుంచి రూ.2,086.87 లక్షల కోట్లకు చేరాయి.  

* రూ.2000 నోట్ల ఉపసంహరణ వల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ.లక్ష కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని