స్కోరు తగ్గనీయొద్దు...

కొత్తగా రుణం తీసుకోవాలంటే రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోర్లను బ్యాంకులు పరిశీలిస్తాయని తెలిసిన విషయమే. అందుకే, ఈ స్కోరు తగ్గకుండా చూసుకోవాలని నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ, ఇటీవల

Published : 11 Jun 2021 00:09 IST

కొత్తగా రుణం తీసుకోవాలంటే రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోర్లను బ్యాంకులు పరిశీలిస్తాయని తెలిసిన విషయమే. అందుకే, ఈ స్కోరు తగ్గకుండా చూసుకోవాలని నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ, ఇటీవల కాలంలో చాలామంది ఆదాయాలు తగ్గడంతో.. ఇప్పటికే తాము తీసుకున్న రుణాలకు సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. క్రెడిట్‌ కార్డు బిల్లులూ గడువు లోపు తీర్చడం లేదు. దీంతో ఎంతోమంది సిబిల్‌ క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. సాధారణంగా 750కి మించి క్రెడిట్‌స్కోరు ఉన్నప్పుడు మంచి స్కోరుగా భావిస్తాయి బ్యాంకులు. అధికంగా స్కోరు ఉన్న వారికి వడ్డీ రాయితీలు, ప్రాసెసింగ్‌ఫీజుల రద్దులాంటి వెసులుబాట్లనూ కల్పిస్తున్నాయి.
చెల్లించాల్సిన వాయిదాలు.. క్రెడిట్‌ కార్డు బిల్లులు ఒక రోజు ఆలస్యం చేసినా.. దానికి సంబంధించిన వివరాలు మూడేళ్లపాటు రిపోర్టులో కనిపిస్తాయి. బ్యాంకులు దీన్ని నిశితంగా పరిశీలించి, కొత్త రుణం ఇవ్వడానికి ఆలోచిస్తాయి. కాబట్టి, వీలైనంత వరకూ ఆలస్యం చేయకుండా రుణాన్ని తీర్చేయడం ముఖ్యం.
క్రెడిట్‌ కార్డులపై అవసరానికి మించి ఖర్చు చేయకండి. మీ ఆదాయానికి మించి రుణం తీసుకునే ప్రయత్నం చేయొద్దు. మీ మొత్తం ఆదాయంలో నికరంగా 40 శాతానికి పైగా ఈఎంఐలు ఉండకూడదు. క్రెడిట్‌ కార్డు వాడుతుంటే.. మొత్తం పరిమితిలో 50శాతం లోపే వినియోగించుకోండి.
అవసరం ఉన్నా లేకపోయినా.. రుణాల కోసం దరఖాస్తు చేయకండి. ఇప్పుడు ఆదాయం తగ్గిన నేపథ్యంలో చాలామంది వ్యక్తిగత రుణం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఒక బ్యాంకు ఇవ్వకపోతే.. వేరే బ్యాంకును సంప్రదిస్తున్నారు. ఇది అంత మంచిది కాదు. వెంటవెంటనే బ్యాంకుల్లో రుణాలకు దరఖాస్తు చేయకండి. దీనివల్ల మీరు అప్పులపై అధికంగా ఆధారపడతారనే భావన వస్తుంది. క్రెడిట్‌ స్కోరూ తగ్గుతుంది.
రుణానికి దరఖాస్తు చేసేముందే మీ క్రెడిట్‌ స్కోరును చూసుకోండి. ఇప్పుడు ఎన్నో సంస్థలు ఉచితంగా క్రెడిట్‌ స్కోరును అందిస్తున్నాయి.  ఆ నివేదికను పరిశీలించండి. ఏమైనా తేడాలుంటే.. సంబంధిత బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లి, సరిచేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని