పెట్టుబడుల్లో భిన్నత్వం కోసం...

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తన మొదటి క్వాంట్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ‘క్వాంటిటేటివ్‌ మోడల్‌’ ఆధారంగా పెట్టుబడులు పెట్టే ఫండ్లను క్వాంట్ ఫండ్స్‌ అని వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా

Updated : 11 Jun 2021 06:09 IST

యాక్సిస్‌ క్వాంట్ ఫండ్‌

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తన మొదటి క్వాంట్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ‘క్వాంటిటేటివ్‌ మోడల్‌’ ఆధారంగా పెట్టుబడులు పెట్టే ఫండ్లను క్వాంట్ ఫండ్స్‌ అని వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పత్రాల్లోనే ఈ పెట్టుబడులు ఉంటాయి.
యాక్సిస్‌ క్వాంట్ ఫండ్‌  ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 25. ఎన్‌ఎఫ్‌ఓ సమయంలో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌. కాబట్టి ఎన్‌ఎఫ్‌ఓ ముగిసిన తర్వాత మళ్లీ యూనిట్ల క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయి.
పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో పరిశీలన, అభిప్రాయాల ఆధారంగా కాకుండా కేవలం లెక్కల ఆధారంగా కంపెనీలను ఎంచుకునే ‘క్వాంటిటేటివ్‌ మోడల్‌’కు గత కొంతకాలంగా యూఎస్‌, ఐరోపా దేశాల్లో ఆదరణ పెరుగుతోంది. ఇదే ధోరణి ఇటీవల కాలంలో మనదేశంలోనూ కనిపిస్తోంది. కంపెనీల పనితీరుకు సంబంధించిన గణాంకాలు పెద్దఎత్తున అందుబాటులోకి రావటం, దాన్ని విశ్లేషించే పద్ధతుల ఆవిష్కరణ... దీనికి ప్రధాన కారణాలు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు క్వాంట్ ఫండ్స్‌ను తీసుకువస్తున్నాయి.
యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు చెందిన యాక్సిస్‌ క్వాంట్ ఫండ్‌ నాణ్యత, వృద్ధి, విలువ... తదితర అంశాలు ప్రామాణికంగా అన్ని రకాలైన పరిస్థితులకు అనువైన పోర్ట్‌ఫోలియో నిర్మించాలనే లక్ష్యాన్ని  నిర్దేశించుకుంది. క్రమం తప్పకుండా పోర్ట్‌ఫోలియోను సమీక్షిస్తూ ముందుకు సాగుతారు. ఈ ఫండ్‌ పనితీరును ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 200 టీఆర్‌ఐతో పోల్చి చూస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గు ఉండి, ప్రస్తుత తమ పెట్టుబడుల్లో కొంత వివిధీకరణ ఉండాలని భావించే  మదుపరులకు క్వాంట్ ఫండ్లు అనుకూలంగా ఉంటాయి.


నష్టభయం భరించలేని వారికి..
బీఓఐ యాక్సా బ్లూచిప్‌ ఫండ్‌ 

బీఓఐ యాక్సా మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా బ్లూచిప్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. బీఓఐ యాక్సా బ్లూచిప్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 22న ముగుస్తుంది. ఇది కూడా ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ప్రధానంగా లార్జ్‌ క్యాప్‌ తరగతికి చెందిన కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టే పథకాలను బ్లూచిప్‌ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు.
బీఓఐ యాక్సా బ్లూచిప్‌ ఫండ్‌ కూడా ఇటువంటిదే. దీనికి ఫండ్‌ మేనేజర్‌గా ధ్రువ్‌ భాటియా వ్యవహరిస్తారు. నిఫీˆ్ట 50 టీఆర్‌ఐతో ఈ ఫండ్‌ పనితీరును పోల్చిచూస్తారు.
ఈ పథకం కింద 80 నుంచి 100 శాతం వరకూ లార్జ్‌ క్యాప్‌ షేర్లలోనే పెట్టుబడి పెడతారు. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో 20 శాతం వరకూ పెట్టుబడి పెట్టే వీలుంది. ఫలానా రంగానికి చెందిన షేర్లు.. అని కాకుండా, అన్ని రకాలకు చెందిన షేర్లను పరిశీలించి ఎక్కడ ఆవకాశాలు ఉంటే అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఈ పథకం కింద అవకాశం ఉంది.
పెద్దగా నష్టభయాన్ని, హెచ్చుతగ్గులను ఇష్టపడని మదుపరులకు బ్లూచిప్‌ ఫండ్స్‌ అనుకూలం. మార్కెట్ పడినా, పెరిగినా... దీర్ఘకాలంలో హేతుబద్ధమైన ప్రతిఫలం ఈ పథకాల్లో లభిస్తోంది. గత ఏడాది కాలంలో బ్లూచిప్‌ ఫండ్స్‌ 40 శాతానికి పైగా ప్రతిఫలాన్ని అందించాయి. గత అయిదేళ్ల సగటు చూసినా 14 శాతం ప్రతిఫలం ఇటువంటి పథకాల్లో లభించింది. ఈ కోణంలో చూసి... బీఓఐ యాక్సా బ్లూచిప్‌ ఫండ్లో పెట్టుబడి పెట్టే విషయాన్ని మదుపరులు ఆలోచించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని