నిపుణుల కొరతే పెద్ద సవాలు
‘గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు డిజిటల్ సేవలు తప్పనిసరి అయ్యాయి. 2020 ప్రారంభం నుంచి టెక్నాలజీ కంపెనీలకు ఇది పెద్ద వ్యాపారమే అయ్యింది. కానీ, ఈ గిరాకీని తట్టుకునే దశలో సంస్థలకు కొన్ని ప్రతికూలతలూ ఎదురవుతున్నాయి. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారిని నియమించుకునేందుకు పోటీ పెరిగింది.
నియామకాల్లో పోటీ పెరిగింది
ఇంటి నుంచి పని భారత్లో మహిళలకు మేలు చేస్తోంది
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈఓ బ్రియాన్ హంఫ్రస్
‘గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు డిజిటల్ సేవలు తప్పనిసరి అయ్యాయి. 2020 ప్రారంభం నుంచి టెక్నాలజీ కంపెనీలకు ఇది పెద్ద వ్యాపారమే అయ్యింది. కానీ, ఈ గిరాకీని తట్టుకునే దశలో సంస్థలకు కొన్ని ప్రతికూలతలూ ఎదురవుతున్నాయి. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారిని నియమించుకునేందుకు పోటీ పెరిగింది. తాము ఆశించిన వేతనం, ఇతర ప్రయోజనాలను కల్పించే సంస్థలనే నిపుణులు పరిశీలిస్తున్నారు. ఫలితంగా ఉద్యోగులను నియమించుకోవడం, వారిని నిలుపుకోవడం ఇప్పుడు టెక్నాలజీ సంస్థలకు మునుపెన్నడూ లేనంత కష్టతరంగా మారింది’ అని అంటున్నారు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈఓ బ్రియాన్ హంఫ్రస్. ఐటీ సంస్థలకు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్ల గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో వివరించింది.
(న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో సెప్టెంబరు 30 నాటికి దాదాపు 3,18,000 మంది ఉన్నారు. 2020 ఏడాది ఇదే సమయంలో ఉన్న 2,83,000 మందితో పోలిస్తే 12 శాతం అధికం. అదే సమయంలో జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు అత్యధికంగా 33 శాతం ఉంది)
? ఉద్యోగులను నియమించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి
ప్రపంచంలోని ప్రతి కంపెనీ, రంగంతో సంబంధం లేకుండా డిజిటల్ వ్యాపార నమూనాల వైపు దూసుకుపోతోంది. అందువల్లే సాంకేతిక ప్రతిభ కోసం తీవ్ర పోటీ నెలకొంది. డిజిటల్ పరివర్తన వైపు మార్కెట్ మళ్లింది. ఇది పరిశ్రమకు మంచిదే. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఐటీ నిపుణుల అవసరం పెరిగింది. డిజిటల్ వృద్ధే దీనికి ప్రధాన కారణం. అంతిమంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితికి దారి తీస్తోంది.
? ఇప్పుడు ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు
ఆధునిక యువత.. ఏదో ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం సాధించామా అన్న ధోరణిలో లేరు. ప్రపంచానికి విలువను అందించే సంస్థ కోసం, ఒక లక్ష్యంతో పనిచేయాలని కోరుకుంటున్నారు. ఉద్యోగుల మనసులో ఏముంది? ఏ అంశాలు వారిని నడిపిస్తున్నాయి.. సంస్థ వ్యూహాల గురించి వారు ఎలా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకునేందుకు రోజూ అయిదుగురు ఉద్యోగులతో ఒక గంట మాట్లాడతాను. ఇది ఎంతో ప్రభావం చూపుతోంది.
? ఎక్కడి నుంచైనా పని.. అనేది కంపెనీలకు లాభమా? నష్టమా
ఉద్యోగులు కలిసి ఉన్నప్పుడు, ప్రయాణించేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, సమావేశాల్లో పాల్గొన్నపుడు.. ఇలా ప్రతి సందర్భంలోనూ తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలయ్యేది. కొన్నిసార్లు ఉద్యోగులకు సంస్థలపై విధేయతా భావాన్ని ఇది కలిగించేది.
కానీ, ఇంటి నుంచి పనిలో ఇవన్నీ ఉండవు. అందుకే, ఉద్యోగులను నిలుపుకోవడం కష్టమవుతోంది. అయితే, ఇది ఉద్యోగుల శ్రేయస్సుకు మంచిదే. ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా భారత్ వంటి కొన్ని దేశాల్లో మహిళలు మధ్యలోనే తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారు. వారు ఉన్నత నాయకత్వానికి చేరడం లేదని చరిత్ర చెబుతోంది. ఈ కొత్త విధానం వల్ల వారు ఉద్యోగాల్లో ఎక్కువకాలం కొనడం, తమ ప్రతిభతో ఉన్నత స్థానానికి చేరడానికి తోడ్పడుతుంది. ఈ కొత్త హైబ్రిడ్ పని వాతావరణం పట్ల నేను ఆశాజనకంగానే ఉన్నాను.
? ఉద్యోగులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి చేశారా
ఒక సంస్థగా టీకాలు వేయడాన్ని మేము సమర్థిస్తాం. టీకాలు వేసుకోని ఉద్యోగులను కార్యాలయాలకు రావద్దనే చెబుతున్నాం. ఇంకా టీకా వేయించుకోని వారు ఇంటి నుంచి పని చేయడం కొనసాగిస్తారు.
? టెక్ ఉద్యోగుల నియామకాల్లో ఇమిగ్రేషన్ ఇంకా కీలకంగా మారిందా
ప్రతిభ కోసం పరిశ్రమ వ్యాప్తంగా తీవ్ర పోటీ ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యం. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ గ్యాడ్యుయేట్ల కొరత ఉంది. ఉత్తర అమెరికాలోని అనేక కంపెనీలు అమెరికా పౌరులు కాని వ్యక్తులు, తమ కెరీర్ ప్రారంభంలోనే అమెరికాకు వచ్చిన వారి సారథ్యంలోనే నడుస్తున్నాయి. అనేక కంపెనీల నిర్మాణంలో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకూ భాగస్వామ్యం ఉందని విశ్వసిస్తాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.