రిఫండు రాలేదా?

చెల్లించాల్సిన ఆదాయపు పన్నుకు మించి జమ చేసినప్పుడు రిటర్నులు దాఖలు చేసి, రిఫండు కోరాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2020-21కి గాను (2021-22 అసెస్‌మెంట్‌ ఇయర్‌) రిటర్నులు

Published : 25 Mar 2022 00:21 IST

చెల్లించాల్సిన ఆదాయపు పన్నుకు మించి జమ చేసినప్పుడు రిటర్నులు దాఖలు చేసి, రిఫండు కోరాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2020-21కి గాను (2021-22 అసెస్‌మెంట్‌ ఇయర్‌) రిటర్నులు దాఖలు చేసిన వారికి ఎంతోమందికి రిఫండు ఇప్పటికే వచ్చింది. కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల అందలేదు. ఈ జాబితాలో మీరూ ఉంటే.. ఈ అంశాలను పరిశీలించండి.

పన్ను బాకీ ఉంటే: క్రితం ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి చెల్లించాల్సిన పన్ను బాకీ ఉంటే.. ఆదాయపు పన్ను విభాగం రిఫండును నిరాకరిస్తుంది. దీనికి సంబంధించి పన్ను చెల్లింపుదారులకు నోటీసులూ జారీ చేస్తుంది. మీకు ఇలాంటి నోటీసులేమైనా వచ్చాయా చూసుకోండి. వీటికి వ్యవధి లోపు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. మీరిచ్చిన జవాబు ఆధారంగా పన్ను బాకీ పోను, మిగతా మొత్తం రిఫండునిస్తుంది.

బ్యాంకు ఖాతాలో పొరపాటు: రిటర్నులు దాఖలు చేసేటప్పుడు బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు దొర్లినా రిఫండు జమ కాకపోవచ్చు. ఈ వివరాలనూ ఒకసారి తనిఖీ చేసుకోండి.

ఇ-వెరిఫై చేయకుండా: రిటర్నులు దాఖలు చేసినప్పటికీ.. దానిని ఇ-వెరిఫై చేయకుంటే రిఫండు రాదు. రిటర్నులు దాఖలు చేసిన 120 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే.. అది చెల్లదు. కాబట్టి, వెంటనే ఇ-వెరిఫై చేయండి.

అదనపు వివరాలు: మీ రిఫండుకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగానికి కొన్ని సందేహాలు రావొచ్చు. వాటిని నివృత్తి చేసుకునేందుకు అదనంగా కొన్ని వివరాలు కోరొచ్చు. ఇన్‌కంట్యాక్స్‌ వెబ్‌సైటులోకి లాగిన్‌ అయినప్పుడు ఈ వివరాలు తెలుస్తాయి. వీటికి తగిన సమాధానాలు ఇవ్వాలి.

అర్హత లేకపోయినా: కొన్నిసార్లు మీరు చేసిన లెక్కలకూ, ఆదాయపు పన్ను విభాగం దగ్గర ఉన్న లెక్కలకూ మధ్య వ్యత్యాసం ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో రిఫండును నిరాకరించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను వెబ్‌సైటులోకి లాగిన్‌ అయి.. ‘పెండింగ్‌ యాక్షన్‌’లో ఏమైనా అదనపు వివరాలు అడిగారా అన్నది చూసి, దానికి    తగ్గట్టుగా స్పందించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని