Senior Citizens: ఒకవైపు ద్రవ్యోల్బణం..మరోవైపు తక్కువ వడ్డీ.. అధిగమించేదెలా?
ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కోగల పెట్టుబడులను ఎంచుకోవడంలో విఫలం అయితే పదవీ విరమణ నిధి మొత్తం ఆవిరికాకతప్పదు.
ప్రతీ ఒక్కరి జీవితంలో పదివీవిరమణ దశ అనేది చాలా ముఖ్యమైనది. జీతం, వృత్తి, వ్యాపారం..ఇలా ఏ రంగాల ద్వారా ఆదాయం సమకూర్చుకునే వారైనా ఈ దశను సురక్షితం చేసుకోవాలి. ఇందుకోసం పెట్టుబడులు చేయడం ఎంత ముఖ్యమో.. ఆ పెట్టుబడులు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేలా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.
పెట్టుబడిదారులు ఎదుర్కునే అదిపెద్ద ప్రమాదాలలో ద్రవ్యోల్బణం కూడా ఒకటి. ఇది కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఉదాహరణకి, ఇప్పుడు ఒక వస్తువు ధర రూ. 100 ఉంటే, వచ్చే సంవత్సరానికి ద్రవ్యోల్బణం రేటు 5 శాతం పెరిగితే.. ఇప్పుడు రూ. 100 కొన్న అదే వస్తువును వచ్చే సంవత్సరం 105 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అంటే మరో రూ. 5 ఖర్చు పెరుగుతుంది.
ఇది సీనియర్ సిటిజన్లకు ఇది పెద్ద సమస్యే. ఎందుకంటే పదవీ విరమణ తరవాత జీతం ద్వారా వచ్చే క్రమమైన ఆదాయం ఉండదు. ద్రవ్యోల్భణ ప్రభావాన్ని అధిగమించే పెట్టుబడులను ఎంచుకోవడంలో విఫలం అయితే పదవీ విరమణ నిధి వేగంగా తరిగిపోవడంతో ముందు ముందు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి.
అదే సమయంలో సీనియర్ సిటిజన్లు తాము చేసే పెట్టుబడులలో రిస్క్ తక్కువగా ఉండేట్లు చేసుకోవాలి. ఇందుకోసం చాలా మంది సాధారణంగా స్థిర ఆదాయాన్ని ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్లను ఎంచుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఒక సంవత్సరం ఎఫ్డీలపై 5శాతం వడ్డీని అందిస్తుంది. అదే విధంగా భారతీయ పోస్టాఫీసు ఒక సంవత్సరం డిపాజిట్లపై(ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం) 5.5శాతం వడ్డీని ఇస్తుంది. అయితే జూన్ నెల రిటైల్ దవ్యోల్భణం 6శాతం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎఫ్డీ పెట్టుబడిదారులకు రియల్ రాబడి రేటు ప్రతికూలంగా ఉంది. అందువల్ల ఈ మార్గాలలో ద్రవ్యోల్భణాన్ని అధిగమించడం కాస్త కష్టమే.
అధిక ద్రవ్యోల్భణం ఒకవైపు, తక్కువ వడ్డీ రేట్లు మరోవైపు.. ఈ రెండిటి సమస్యకు ఈక్వెటీలలో పెట్టుబడులు చక్కని పరిష్కారం కావచ్చు. కానీ అధిక రిస్క్తో కూడిన ఈక్విటీలలో అందరూ పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడరు. ప్రత్యేకించి పదవీ విరమణ పొందినవారు.
అందువల్ల ద్రవ్యోల్భణాన్ని అధిగమించి అధిక రాబడి వచ్చే పెట్టుబడులనే ఎంచుకోవాలి. ప్రస్తుతం, ద్రవ్యోల్భణాన్ని అధిగమించి సీనియర్ సిటిజన్లకు రాబడి ఇవ్వగల పెట్టుబడి మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఫ్లోటింగ్-రేట్ ఆర్బీఐ బాండ్లు..
* ఈ బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంది. ఈ బాండ్లపై వడ్డీ రేటు జాతీయ పొదుపు పత్రాల వడ్డీ రేటుతో ముడిపడి ఉంటుంది. ఎన్ఎస్సీ బాండ్లపై చెల్లించే వడ్డీ రేటు కంటే 35 బేసిస్ పాయింట్లు(బిపిఎస్) అధికంగా వడ్డీ ఉంటుంది. ఒక బేసిస్ పాయింటు 0.01శాతానికి సమానం.
* ఇవి నూరు శాతం ప్రభుత్వ హామీతో వెనక్కి వచ్చే పెట్టుబడులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు జాతీయ బ్యాంకులు, నాలుగు నిర్దిష్ట ప్రైవేట్ రంగ బ్యాంకుల ద్వారా పెట్టుబడులు పెట్టొచ్చు.
* వీటికి 7 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి ఆధారంగా వడ్డీ రేటు మారుతుంటుంది. సీనియర్ సిటిజన్లలోని కొన్ని నిర్ధిష్ట వర్గాలను కాలపరిమితి కంటే ముందుగానే విత్డ్రాలకు అనుమతిస్తారు.
* ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.15 శాతం. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి, జులై 1వ తేదీన వడ్డీ చెల్లిస్తారు. కుమ్యులేటివ్ బేసిస్లో వడ్డీ పొందే ఆప్షన్ లేదు.
* బాండ్లను కొనుగోలు చేసిన వెంటనే అవి కస్టమర్ బాండ్ లెడ్జర్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. వీటిని ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేయాలి. నగదు రూపంలోనూ కొనుగోలు చేయొచ్చు. అయితే నగదు రూపంలో కొనుగోలు చేస్తే రూ.20వేల పరిమితి ఉంది. ఆన్లైన్లో అయితే ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు. కనీస పెట్టుబడి మొత్తం రూ.1000.
* ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తాయి. వడ్డీ ఆదాయంపై కూడా పన్ను వర్తిస్తుంది. వ్యక్తికి వర్తించే స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి.
2. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్..
* ఇది ప్రభుత్వ హామీతో పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తున్న పథకం. భారతీయ నివాసితులైన సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.
* వ్యక్తిగతంగా గానీ, ఉమ్మడిగా గానీ ఖాతను తెరిచే వీలుంది. అంతేకాకుండా పన్ను మినహాయింపు ప్రయోజనాలతో క్రమమైన ఆదాయాన్ని పొందచ్చు.
* భారత్లోని ఏదైనా అధీకృత బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ ఎస్సీఎస్ఎస్ ఖాతాను తెరవచ్చు. ఖాతా తెరిచినప్పుడు కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగారూ. 15 లక్షల వరకు ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు. ఈ ఖాతాను దేశవ్యాప్తంగా బదిలీ చేసుకునే సౌకర్యం ఉంది.
* ఖాతా ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ల కాలపరిమితి వర్తిస్తుంది. మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు.
* ఇందులో పెట్టుబడి పెట్టిన సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందచ్చు.
* ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.4 శాతం
* ఈ పథకంలో వడ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. ప్రతీ ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్, జూలై, అక్టోబరు, జనవరి నెలల్లో మొదటి తేదిన వడ్డీ ఖాతాలలో జమవుతుంది.
* ముందస్తు విత్డ్రాలపై పెనాల్టీ ఉంటుంది. ఒక సంవత్సరం తరువాత ముందస్తు విత్డ్రాలను అనుమతిస్తారు. జరిమానా డిపాజిట్ మొత్తంపై 1 నుంచి 1.5 శాతం మధ్య ఉంటుంది.
* వార్షిక వడ్డీ ఆదాయం రూ.50వేలకు మించి ఉంటే మూలం వద్ద పన్ను(టీడీఎస్) వర్తిస్తుంది.
3. క్రెడిట్ రిస్క్ ఫండ్లు..
పైన తెలిపిన రెండు పథకాలకు ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టిన అసలు మొత్తాన్ని కొల్పోయే ప్రమాదం లేదు. అయితే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. అందువల్ల రాబడి ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. వీటికి ప్రత్యామ్నాయంగా క్రెడిట్ రిస్క్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇవి డెట్ సాధానాలలో పెట్టుబడి పెడతాయి. అందువల్ల అధిక రాబడి అందిస్తాయి. ఇందులో క్రెడిట్ రిస్క్ ఉంటుంది కాబట్టి పెట్టుబడులు పెట్టేప్పుడు జాగ్రత్త వహించాలి.
ఈ ఫండ్లు గత ఏడాది 8.12 శాతం వడ్డీని అందించాయి. మూడేళ్ల తరువాత దీర్థకాల పెట్టుబడులుగా పరిగణించి పోస్ట్ ఇండక్సెషన్తో 20శాతం పన్ను విధిస్తారు. దీంతో పన్ను గణనీయంగా తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్