Budget 2024: విభేదాలున్నా ఆపన్నహస్తం.. మన బడ్జెట్‌లో మాల్దీవులకు రూ.600 కోట్లు

Budget: బడ్జెట్‌లో పొరుగు దేశాలతో బంధాన్ని బలోపేతం చేసేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రాధాన్యం ఇచ్చారు.

Updated : 02 Feb 2024 09:02 IST

దిల్లీ: తాజా మధ్యంతర బడ్జెట్‌లో (Union Budget 2024) కేంద్ర ప్రభుత్వం మాల్దీవులకు ఆర్థిక సాయం కింద రూ.600 కోట్లు కేటాయించింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 50 శాతం ఎక్కువ. 2023 బడ్జెట్‌లో ఆ దేశ (Maldives) అభివృద్ధికి భారత్‌ రూ.400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. సవరించిన అంచనాల ప్రకారం రూ.770 కోట్లు ఖర్చు చేసింది. ఖర్చు చేసిన దాంతో పోలిస్తే మాత్రం ఈసారి కేటాయింపులు 22 శాతం తగ్గాయి.

బడ్జెట్‌లో (Union Budget 2024) పొరుగు దేశాలతో బంధాన్ని బలోపేతం చేసేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రాధాన్యం ఇచ్చారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.22,154 కోట్లు కేటాయించారు. మన దేశం అవలంబిస్తున్న ‘పొరుగుకే తొలి ప్రాధాన్యం’ విధానంలో భాగంగా సరిహద్దు దేశమైన భూటాన్‌ అభివృద్ధికి రూ.2,068 కోట్లు, మాల్దీవులకు రూ.600 కోట్లు, నేపాల్‌కు రూ.700 కోట్లు, అఫ్గానిస్థాన్‌కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు కేటాయించారు. ఇరాన్‌తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఆ దేశంలోని చాబహార్‌ పోర్టు నిర్వహణకు రూ.100 కోట్లను ప్రకటించింది.

ప్రతి దీవీ.. పర్యాటక దివిటీ!

ఆయా దేశాలతో ఉన్న సంబంధాలను బట్టి కేంద్రం గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌, లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌, ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, సాంకేతిక సహకారం.. ఇలా వివిధ రూపాల్లో సాయం అందిస్తుంది. వాణిజ్యం, ఇంధనం, ఆరోగ్యం, ఇంజినీరింగ్‌, ఐటీ, మౌలికం, క్రీడలు, శాస్త్ర విజ్ఞాన పరిశోధనలు ఇలా వివిధ రంగాలకు నిధులను అందజేస్తుంది. తాజాగా మాల్దీవులతో (Maldives) దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న తరుణంలోనూ కేంద్రం ఆ దేశానికి ఆపన్నహస్తం అందించడానికి మొగ్గుచూపడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని