Stock Market Update: ఎట్టకేలకు మార్కెట్లకు లాభాలొచ్చాయ్‌!

దేశీయ స్టాక్ మార్కెట్లకు ఎట్టకేలకు లాభాలొచ్చాయి. ఆరు సెషన్ల వరుస నష్టాల తర్వాత సూచీలు ఈరోజు పుంజుకున్నాయి....

Updated : 16 May 2022 16:12 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లకు ఎట్టకేలకు లాభాలొచ్చాయి. ఆరు సెషన్ల వరుస నష్టాల తర్వాత సూచీలు ఈరోజు పుంజుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడితో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ, కాసేపటికే కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో పుంజుకొని స్పష్టమైన లాభాల్లోకి ఎగబాకాయి. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. 6 రోజుల వరుస నష్టాల నేపథ్యంలో మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపారు. మరోవైపు ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు కూడా దేశీయ సూచీలకు దన్నుగా నిలిచాయి.

ఉదయం సెన్సెక్స్‌ 52,946.32 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 53,428.28 - 52,632.48 మధ్య కదలాడింది. చివరకు 180.22 పాయింట్ల లాభంతో 52,973.84 వద్ద ముగిసింది. 15,845.10 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 60.15 పాయింట్లు లాభపడి 15,842.30 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,977.95 - 15,739.65 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.80 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో స్థిరపడ్డాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

*  స్విస్‌ సిమెంట్‌ అగ్రగామి సంస్థ హోల్సిమ్‌కు చెందిన భారత వ్యాపారాన్ని 10.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.81,361 కోట్ల)తో స్వాధీనం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ ఆదివారం ప్రకటించింది. హోల్సిమ్‌కు అంబుజా సిమెంట్‌లో 63.19 శాతం, ఏసీసీలో 4.48 శాతం వాటాలు ఉన్నాయి. ఏసీసీలో 50.05 శాతం వాటా అంబుజాకు ఉంది. అంటే ఏసీసీలో 54.53 శాతం వాటా హోల్సిమ్‌కు ఉంది. ఈ నేపథ్యంలో అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌ షేర్లు ఈరోజు 3 శాతానికి పైగా లాభపడ్డాయి.

* ఫెడరల్‌ బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ రేటును 20 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో స్టాక్‌ ఇంట్రాడేలో 2 శాతం మేర లాభపడింది.

* రహేజా క్యూబీఈ కొనుగోలును నిలిపివేస్తున్నట్లు పేటీఎం ప్రకటించింది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు దాదాపు 9 శాతం మేర లాభపడ్డాయి.

* ప్రభుత్వానికి వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన బకాయిల్లో 33 శాతం వాటాను ఈక్విటీ కిందకు మార్చేందుకు సర్కార్‌ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్తలతో ఇంట్రాడేలో ఈ కంపెనీ షేర్లు 15 శాతం మేర లాభపడ్డాయి.

* మార్చితో ముగిసిన త్రైమాసికంలో అపోలో టైర్స్‌ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ.. బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్‌ను కొనాలని సూచించాయి. దీంతో సంస్థ షేరు ధర ఈరోజు 7.74 శాతం ఎగబాకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని