PNB: స‌ర్వీసు ఛార్జీల‌ను పెంచిన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌

పీఎన్‌బీ వెబ్‌సైట్ ప్రకారం పొద‌పు ఖాతాదారులు ఆన్‌లైన్‌లో చేసే నెఫ్ట్ లావాదేవీల‌కు ఎటువంటి ఛార్జీలు వ‌ర్తించ‌వు.

Updated : 01 Jun 2022 14:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌భుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (PNB) త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ప‌లు ర‌కాల ఎల‌క్ట్రానిక్ సేవ‌లను (ఈ-సేవ‌లు) అందిస్తోంది. ఇందులో నెఫ్ట్ (నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్‌), ఆర్‌టీజీఎస్ (రియ‌ల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్‌) వంటి సేవ‌లు ఉన్నాయి. తాజాగా నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్ సేవ‌ల ఛార్జీల‌ను పెంచుతున్న‌ట్లు పీఎన్‌బీ ప్రకటించింది. పెంచిన రేట్లు మే 20 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు తెలిపింది. అంతేకాకుండా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) ఈ-మ్యాన్‌డేట్ ఛార్జీల‌ను కూడా పునరుద్ధరించింది.

ఆర్‌టీజీఎస్ ఛార్జీలు: ఆర్‌టీజీఎస్ అంటే.. రియ‌ల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్‌.పేరులో సూచించిన‌ట్లుగానే ఇత‌ర ఖాతాల‌కు నిధులు ‘రియ‌ల్ టైమ్‌’లో బ‌దిలీ అవుతాయి. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ తాజాగా ఆర్‌టీజీఎస్ లావాదేవీల ఛార్జీల‌ను పెంచింది. ఆఫ్‌లైన్‌లో బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా చేసే రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ. 5 ల‌క్ష‌లలోపు బ‌దిలీ ఛార్జీల‌ను రూ.24.50కు పెంచింది. ఇంత‌కు ముందు ఈ ఛార్జీ రూ.20గా ఉండేది. రూ.5 ల‌క్ష‌ల‌కు మించిన ఆర్‌టీజీఎస్ బ‌దిలీకి వ‌ర్తించే ఛార్జీల‌ను రూ.40 నుంచి రూ. 49.50కి పెంచింది. ఇంత‌కు ముందు ఆర్‌టీజీఎస్ సేవ‌ల‌ను ఆన్‌లైన్‌లో ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగానే అందించే వారు.

నెఫ్ట్‌: నెఫ్ట్ ద్వారా బ్యాంకులో ఖాతా ఉన్న‌ వ్య‌క్తులు, కంపెనీలు, కార్పొరేష‌న్లు.. ఏదైనా ఇత‌ర బ్యాంకులో ఉన్న ఖాతాకు నెఫ్ట్ సిస్ట‌మ్ ద్వారా ఎల‌క్ట్రానిక్‌గా డ‌బ్బు బ‌దిలీ చేయ‌వ‌చ్చు. పీఎన్‌బీ వెబ్‌సైట్ ప్రకారం పొద‌పు ఖాతాదారులు ఆన్‌లైన్‌లో చేసే నెఫ్ట్ లావాదేవీల‌కు ఎటువంటి ఛార్జీలూ వ‌ర్తించ‌వు. పొదుపు ఖాతా కాకుండా ఇత‌ర ఖాతాల ద్వారా ఆన్‌లైన్‌లో చేసే లావాదేవీల‌కు ఛార్జీలు వ‌ర్తిస్తాయి. రూ. 10 వేలలోపు ఆఫ్‌లైన్ ద్వారా చేసే బ‌దిలీల‌కు రూ. 2.25, ఆన్‌లైన్ ద్వారా చేసే బ‌దిలీల‌కు రూ. 1.75; రూ.10 వేలు నుంచి రూ.1 ల‌క్షలోపు ఆఫ్‌లైన్ బ‌దిలీల‌కు రూ.4.75, ఆన్‌లైన్ బ‌దిలీల‌కు రూ.4.25; రూ.1 ల‌క్ష నుంచి రూ. 2 ల‌క్ష‌ల లోపు చేసే ఆఫ్‌లైన్ లావాదేవీల‌కు రూ. 14.75, ఆన్‌లైన్ బ‌దిలీల‌కు రూ.14.25; రూ.2 ల‌క్ష‌ల పైన చేసే ఆఫ్‌లైన్‌ బ‌దిలీల‌కు రూ. 24.75, ఆన్‌లైన్ బ‌దిలీల‌కు రూ. 24.25 చొప్పున ఛార్జీలు వ‌ర్తిస్తాయి.

ఇన్వ‌ర్డ్ ఎన్ఏసీహెచ్ ఈ-మ్యాన్‌డేట్ (ఆన్‌లైన్ మ్యాన్‌డేట్‌): ఇన్వ‌ర్డ్‌ నాచ్ ఈ- మ్యాన్‌డేట్ వెరిఫికేష‌న్ ఛార్జీల‌ను కూడా బ్యాంక్ పున‌రుద్ధ‌రించింది. ఈ స‌ర్వీస్ కోసం బ్యాంక్ రూ. 100 ఛార్జ్ చేస్తున్న‌ట్లు తెలిపింది. దీనికి జీఎస్‌టీ అద‌నంగా ఉంటుంది. ఈ ఛార్జీలు మే 28 నుంచి అమ‌లవుతాయి.

పీఎన్‌బీ ఐఎంపీఎస్‌ ఛార్జీలు: త‌క్ష‌ణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) ద్వారా చేసే రూ. 1000 వ‌ర‌కు లావాదేవీల‌పై ఎలాంటి చార్జీలు ఉండ‌వు. రూ.1001 నుంచి రూ.1ల‌క్ష వ‌ర‌కు చేసే లావాదేవీల‌కు రూ. 6+జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. ఇంత‌కు ముందు ఇది రూ.5 ఉండేది. రూ.1 ల‌క్ష, ఆ పైనా చేసే లావాదేవీల ఛార్జీల‌ను రూ.10 నుంచి రూ. 12+జీఎస్‌టీకి పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని