Samsung: బేస్‌ వేరియంట్‌గా ఆ మోడల్‌కు శాంసంగ్‌కు గుడ్‌బై!

శాంసంగ్ వచ్చే నెలలో విడుదల చేయనున్న గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌లో బేస్‌ వేరియంట్‌గా 128 జీబీని తొలగించనుంది. మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ను విడుదలవుతోంది. 

Updated : 03 Jan 2023 14:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  శాంసంగ్‌ కంపెనీ ఫిబ్రవరి మొదటి వారంలో గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌ 23 పేరుతో మూడు వేరియంట్లలో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, శాటిలైట్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇస్తున్నారు. ఈ ఫోన్‌ మోడల్స్‌లో ఇకపై 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను శాంసంగ్‌ నిలిపివేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌లో 128 జీబీ స్టోరేజ్‌ మోడల్‌ బేస్‌ వేరియంట్‌గా ఉంది. దాన్ని తొలగించి, ఆ స్థానంలో 256 జీబీ స్టోరేజ్‌ను బేస్‌ వేరియంట్‌గా పరిచయం చేయనుంది.

శాంసంగ్‌ ఇప్పటికే ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌లో 64 జీబీ వేరియంట్‌ను నిలిపివేసింది. ఇప్పుడు128 జీబీ మోడల్‌ని బేస్‌ వేరియంట్‌గా తొలగించనుంది. శాంసంగ్‌ నిర్ణయంతో యూజర్లకు అధిక స్టోరేజ్ సామర్థ్యంతో ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. దాంతోపాటే బేసిక్‌ వేరియంట్ ధర కూడా పెరుగుతుంది. ఈ ధరల పెరుగుదల యూజర్లకు అదనపు భారం అవుతుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. యూజర్లకు ఎక్కువగా ఉపయోగించే ఫీచర్లులతో మిండ్‌-రేంజ్‌ ఫోన్లు విడుదలవుతుండటంతో, ఫ్లాగ్‌షిప్‌  మోడల్స్‌ కొనుగోలు చేసే యూర్లకు అధిక మెమొరీతో ఫోన్లను అందివ్వాలని మొబైల్‌ తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. యాపిల్‌ కూడా 64 జీబీని బేస్‌ వేరియంట్‌గా తొలగించింది. దాని స్థానంలో 128 జీబీని ఐఫోన్ 14 సిరీస్‌లో పరిచయం చేసింది. 

 ప్రస్తుతం గెలాక్సీ ఎస్‌22 బేస్ వేరియంట్‌ ధర ₹ 72,999గా ఉంది. వచ్చే నెలలో విడుదలయ్యే ఎస్‌23 బేస్‌ వేరియంట్‌ ధర ఇంతకంటే ఎక్కువగా ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23, ఎస్‌23 ప్లస్‌, ఎస్‌23 అల్ట్రా వేరియంట్లలో విడుదలకానుంది. వీటిలో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ ఉపయోగించారు. గెలాక్సీ ఎస్‌23 ప్లస్‌లో 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఈ మోడల్ బేస్‌ వేరియంట్‌ ధర ₹ 80 వేల పైనే ఉంటుందని సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని