SBIలో పెరిగిన IMPS లిమిట్‌.. కొత్త ఛార్జీలూ అమల్లోకి!

ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌ ద్వారా చేసే ఐఎమ్‌పీఎస్ లావాదేవీలకు ఛార్జీలు వ‌ర్తించ‌వు. 

Published : 04 Feb 2022 02:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్) నగదు బదిలీ పరిమితిని పెంచింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలను అనుసరించి రూ.2 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఎస్‌బీఐ కస్టమర్లు ఐఎంపీఎస్ ద్వారా రూ.5 ల‌క్షల వరకు న‌గ‌దు బ‌దిలీ చేసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌ ద్వారా ఈ లావాదేవీలు నిర్వహించినప్పుడు ఎలాంటి రుసుములూ విధించ‌డం లేద‌ని, అయితే బ్యాంకు శాఖ‌ల వ‌ద్ద నిర్వహించే రూ.2 ల‌క్షల వరకు లావాదేవీలకు పాత రేట్లే వ‌ర్తిస్తాయ‌ని బ్యాంకు తెలిపింది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల ఐఎంపీఎస్‌ శ్లాబును బ్యాంకు శాఖల ద్వారా నిర్వహించినప్పుడు మాత్రం రూ.20 (జీఎస్‌టీ అదనం) సేవా రుసుము వ‌ర్తిస్తుంద‌ని బ్యాంకు వెల్లడించింది.

బ్రాంచ్‌ వద్ద చేసే ఐఎంపీఎస్‌ లావాదేవీకి వర్తించే ఛార్జీలు

  • ₹1000- ఎలాంటి ఛార్జీలూ వర్తించవు
  • ₹1000 నుంచి ₹10 వేల వ‌ర‌కు- ₹2 + జీఎస్‌టీ
  • ₹10 వేల నుంచి ₹1 ల‌క్ష వ‌ర‌కు - ₹4 + జీఎస్‌టీ
  • ₹1 నుంచి ₹2 లక్షల వరకు- ₹12 + జీఎస్‌టీ 
  • ₹2 లక్షల నుంచి ₹5 లక్షల వరకు ₹20 + జీఎస్‌టీ 

ఐఎంపీఎస్ అంటే..
ఐఎంపీఎస్ అంటే ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్ (తక్షణ నగదు బదిలీ చెల్లింపు వ్యవస్థ). నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) దీన్ని నిర్వహిస్తుంది. ఈ విధానం ద్వారా వ్యక్తులు దేశీయంగా క్షణాల్లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఎస్సెమ్మెస్‌ వంటి వివిధ ఛానెళ్ల ద్వారా బ్యాంకులు, ఆర్బీఐ అధీకృత పీపీఐ (ప్రీపెయిడ్ పేమెంట్ ఇస్ట్రుమెంట్స్)ల్లో ఇంటర్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ సేవ‌ల‌ను సెలవు రోజుల్లోనూ 24/7 యాక్సెస్ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని