Freebies: ఉచితాలు ఆందోళనకరం.. పరిమితి విధించాల్సిందే : ఎస్‌బీఐ నివేదిక

రాష్ట్ర జీడీపీలో 1శాతం లేదా పన్నుల రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఒకశాతం వరకు ఉచిత పథకాల కోసం ఖర్చుచేసే విధంగా  రాష్ట్రాలపై పరిమితి విధించవచ్చని ఎస్‌బీఐ నివేదిక సూచించింది.

Published : 03 Oct 2022 21:15 IST

ముంబయి: దేశవ్యాప్తంగా ‘ఉచితాల’పై చర్చ జరుగుతోన్న సమయంలో ఎస్‌బీఐ నివేదిక కీలక సూచనలు చేసింది. ఆయా రాష్ట్రాలు పోటాపోటీగా ప్రకటిస్తోన్న ఈ ఉచిత పథకాలను సుప్రీం కోర్టు నేతృత్వంలోని కమిటీ కట్టడి చేయవచ్చని అభిప్రాయపడింది. రాష్ట్ర జీడీపీలో 1శాతం లేదా పన్నుల రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఒక శాతం వరకు ఈ పథకాల కోసం ఖర్చు చేసే విధంగా రాష్ట్రాలపై పరిమితి విధించవచ్చని ఎస్‌బీఐ నివేదిక సూచించింది.

ఆయా రాష్ట్రాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు, ప్రభుత్వాలపై వాటి భారంపై ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న సౌమ్య కాంతి ఘోష్‌ నేతృత్వంలో ఓ నివేదిక రూపొందింది. ఇందులో ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల పరిస్థితులను ఉదహరించగా.. ఆయా రాష్ట్రాలకు వచ్చే ఆదాయం, పెన్షన్‌ చెల్లింపుల మధ్య అంతరం భారీగా ఉందని తేలింది. రాష్ట్రాల పన్నుల ఆదాయం, పెన్షన్‌ చెల్లింపులను పోల్చి చూసినప్పుడు ఝార్ఖండ్‌కు 217శాతం, రాజస్థాన్‌ 190శాతం, ఛత్తీస్‌గఢ్‌కు 207శాతం అధిక భారంగా ఉందంటూ నివేదికలోని అంశాలను సౌమ్య కాంతి ఘోష్‌ వెల్లడించారు.

జీడీపీలో 4.5శాతం..

పెన్షన్‌ పథకంలో మార్పులు కోరుకుంటున్న రాష్ట్రాలను చూస్తే వాటి పన్నుల ఆదాయం, చెల్లింపుల మధ్య అంతరం మరింత ఎక్కువగా ఉండవచ్చని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. పాత పెన్షన్‌ పథకానికి వెళ్లేందుకు యోచిస్తోన్న హిమాచల్‌ప్రదేశ్‌లో పన్నుల ఆదాయం, చెల్లింపుల మధ్య అంతరం 450శాతం ఉండగా.. గుజరాత్‌ 138శాతం, పంజాబ్‌ 242శాతంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, బడ్జెటేతర రుణాలు, ప్రభుత్వరంగ సంస్థలు, గ్యారంటీలతో తీసుకున్న ఇతర రుణాలు 2022 ఏడాది జీడీపీలో సుమారు 4.5శాతానికి చేరుకున్నాయి. పలు రాష్ట్రాల ఆ సంఖ్య గణనీయంగా ఉందని సౌమ్య కాంతి ఘోష్‌ పేర్కొన్నారు.

ఇటువంటి హామీలు మొత్తం తెలంగాణ జీడీపీలో 11.7శాతం ఉండగా..  సిక్కిం 10.8శాతం, ఆంధ్రప్రదేశ్‌ 9.8శాతం, రాజస్థాన్‌ 7.1శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌ 6.3శాతంగా ఉంది. ఈ హామీల్లో అత్యధికంగా 40శాతం విద్యుత్‌ రంగం కోసమే కేటాయించగా.. తర్వాతి స్థానాల్లో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆహారం, నీటి సరఫరా రంగాలు ఉన్నాయని ఘోష్‌ వెల్లడించారు. ఇక పాత పెన్షన్‌ పథకాన్ని అమలు చేస్తోన్న లేదా అమలు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్రాల చెల్లింపులు 2020 ఆర్థిక సంవత్సరంలోనే రూ.3,45,505 కోట్లుగా ఉందన్నారు. ఇక 2023 ఆర్థిక సంవత్సరంలో పలు రాష్ట్రాలు ప్రకటించిన ఉచితాలను ఆయా రాష్ట్రాల జీడీపీ, రెవెన్యూ రాబడులతో పోల్చి చూసినప్పుడు మరింత ఆందోళనకరంగా ఉందని చెప్పారు.

ఏపీ, పంజాబ్‌ జీడీపీలలో 2శాతం..

వివిధ పథకాలు, నగదు బదిలీలు, రాయితీలు, రుణ మాఫీలు, వడ్డీ రహిత రుణాల కోసం ఆయా రాష్ట్రాలు తమ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులపై ఆర్‌బీఐ ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. అందులో ఉచిత పథకాల కోసం ఆయా రాష్ట్రాల జీడీపీలో 0.1శాతం నుండి 2.7శాతం వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్ల జీడీపీలో ఇది రెండు శాతం మించిపోయిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర జీడీపీ (GSDP)లో ఒకశాతం లేదా రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో ఒకశాతం ఖర్చుపెట్టేలా సుప్రీంకోర్టు కమిటీ పరిమితి విధించవచ్చని తాజా నివేదిక ద్వారా సూచించినట్లు సౌమ్య కాంతి ఘోష్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని