
నేపాల్ దొంగలను పట్టుకున్నాం!
రాయదుర్గం చోరీ కేసు వివరాలు వెల్లడించిన సజ్జనార్
హైదరాబాద్: రాయదుర్గంలో చోరీకి పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్కు చెందిన ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీసీ సజ్జనార్ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.5.20 లక్షల నగదు, 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ఆయన విలేకరుతో మాట్లాడుతూ... చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. బోర్వెల్ వ్యాపారి మధుసూదన్రెడ్డి ఇంట్లో నేపాల్ ముఠా పని మనుషులుగా చేరి, వారితో నమ్మకంగా ఉంటూ చోరీకి పాల్పడిందన్నారు. ముఠాలో ప్రధాన నిందితుడ్ని నేపాల్కు చెందిన నేత్రగా, మిగిలిన ఇద్దర్నీ ప్రకాశ్ సాహీ, సీతగా గుర్తించామన్నారు.
యజమానుల భోజనం, టీలో సీత నిద్రమాత్రలు వేసిందని, వారంతా గాఢ నిద్రలోకి జారుకున్నాక తమ ముఠా సభ్యులకు ఆమె సమాచారమిచ్చిందని సజ్జనార్ తెలిపారు. యజమానురాలు శైలజ కేవలం టీమాత్రమే తాగడంతో ఆమెకు మెలుకువ రావడంతో ఆమెను కట్టేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లారన్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈ ముఠా చోరీలకు పాల్పనట్లు సజ్జనార్ వివరించారు.‘‘ ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో పనిచేసివారితో మాట్లాడి వారి సహాయంతో చోరీకి పాల్పడతారు.
చోరీ చేశాక తలో దారిలో నేపాల్ చేరుకుంటారు. నార్సింగిలో వృద్ధ దంపతులను కట్టేసి చోరీకి పాల్పడిన కేసులోనూ నేత్ర ప్రధాన నిందితుడు. ఫిర్యాదు రాగానే 10 బృందాలను ఏర్పాటు చేశాం’’ అని సజ్జనార్ వివరించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులు సాయంతో వీరిని పట్టుకున్నామన్నారు. మిగతావారి కోసం వివిధ రాష్ట్రాల్లో గాలిస్తున్నామని చెప్పారు.
తెలియని వాళ్ళని పనిలో పెట్టుకోవద్దని, ఒకవేళ పెట్టుకున్నా వాళ్ల వివరాలను స్థానిక పోలీసులకు ఇవ్వాలని సజ్జనార్ సూచించారు. ఇళ్లలోని అన్ని ప్రాంతాల్లోకి వాళ్లను అనుమతించొద్దన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.