విద్యుదాఘాతంతో తండ్రీ కుమార్తెల దుర్మరణం

విద్యుదాఘాతంతో తండ్రీ కుమార్తెలు మృతిచెందిన విషాద ఘటన ఇది. విజయవాడ సత్యనారాయణపురం పోలీసుల కథనం మేరకు.. నగరంలోని రామకోటి మైదానం వద్ద ఇప్పిలి సింహాచలం(60), భార్య వరాలమ్మ, కుమార్తె మంగమ్మ(32), ఇద్దరు మనవళ్లతో కలిసి నివసిస్తున్నారు.

Published : 03 Feb 2023 04:45 IST

విజయవాడ (సత్యనారాయణపురం), న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో తండ్రీ కుమార్తెలు మృతిచెందిన విషాద ఘటన ఇది. విజయవాడ సత్యనారాయణపురం పోలీసుల కథనం మేరకు.. నగరంలోని రామకోటి మైదానం వద్ద ఇప్పిలి సింహాచలం(60), భార్య వరాలమ్మ, కుమార్తె మంగమ్మ(32), ఇద్దరు మనవళ్లతో కలిసి నివసిస్తున్నారు. వీరు ఇళ్లల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. గురువారం సాయంత్రం మంగమ్మ.. వేడినీళ్ల కోసం బకెట్లో విద్యుత్తు హీటర్‌ పెట్టింది. నీరు వేడెక్కాక హీటర్‌ తీస్తుండగా సింహాచలం విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతడు కింద పడిపోయాడు. కాపాడదామని ప్రయత్నించిన కుమార్తె కూడా షాక్‌ తగిలి కింద పడిపోయింది. పక్కింట్లో ఉండే సీతమ్మ అనే మహిళ కూడా విద్యుదాఘాతానికి గురైంది. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా సింహాచలం, మంగమ్మ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సీతమ్మ (50) చికిత్స పొందుతోందని, ఆమెకు ప్రాణహాని లేదని పోలీసులు తెలిపారు. ఐదు కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ పాత ఇంట్లో.. విద్యుత్తు తీగలు శిథిలావస్థలో ఉన్నాయని స్థానికులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని