Mahadev Betting App Scam: బెట్టింగ్‌ యాప్‌ మాటున స్కామ్‌

దేశంలో బెట్టింగ్‌ యాప్‌ మాటున జరుగుతున్న స్కామ్‌ ఒకటి వెలుగు చూసింది. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గుర్తించింది.

Updated : 17 Sep 2023 09:45 IST

బాలీవుడ్‌లో కలకలం

దిల్లీ: దేశంలో బెట్టింగ్‌ యాప్‌ మాటున జరుగుతున్న స్కామ్‌ ఒకటి వెలుగు చూసింది. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌(Mahadev Betting App) ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గుర్తించింది. రూ.417 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం సీజ్‌ చేసింది. ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకుల్లో ఒకరి పెళ్లికి వీరు హాజరుకావడమే కారణం. దీంతో వారికి ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. దుబాయ్‌ కేంద్రంగా దేశంలో సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌ అనే ఇద్దరు మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో వారు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోల్‌కతా, భోపాల్‌, ముంబయి వంటి తదితర నగరాల్లో సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్‌కు సంబంధించి కొన్ని ఆధారాలు సంపాదించింది. మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్‌ చేసింది. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ వెల్లడించింది.

కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ బెట్టింగ్‌ యాప్‌ పెద్ద ఎత్తున ప్రకటనల కోసం ఖర్చు చేసినట్లూ తెలిపింది. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రకర్‌ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్‌ సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు ఈడీ గుర్తించింది. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌, సన్నీ లియోనీ, నేహా కక్కర్‌, అతీఫ్‌ అస్లాం, రహత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్‌, అలీ అస్గర్‌, విశాల్‌ దద్లానీ తదితరులు హాజరయ్యారు. వీరి కోసం ఓ ప్రైవేటు జెట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమం కోసం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి రూ.112 కోట్లు హవాలా మార్గంలో నిర్వాహకులు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఒక్క హోటల్‌ గదుల కోసమే రూ.42 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. మరో నిర్వాహకుడు రవి ఉప్పల్‌ నిర్వహించిన పార్టీకీ బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలిసింది. ఈ క్రమంలో హవాలా మార్గంలో వచ్చిన సొమ్ము ద్వారా బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకు చెల్లింపులు చేసినట్లు తెలిసింది. దీంతో బాలీవుడ్‌ సెలబ్రిటీలకూ ఈడీ సమన్లు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని