Kadapa: కత్తితో పొడిచాడు.. ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు

కడపలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే నిందితుడే బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లడం గమనార్హం.

Updated : 13 Nov 2023 12:47 IST

కడప (నేరవార్తలు): కడప పాత బైపాస్‌ వద్ద దారుణ హత్య జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని సాయికిరణ్‌ అనే వ్యక్తిని కడపకు చెందిన మహేశ్‌ కత్తితో పొడిచాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ హత్య జరిగింది. గడిచిన 24 గంటల్లో ఇది రెండో హత్య కావడం గమనార్హం. ఆదివారం నగరంలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో భవానీ శంకర్ అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. 

వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన సాయికిరణ్ కడపలోని ఓ ప్రైవేట్ షోరూంలో పనిచేస్తున్నాడు. సాయి కిరణ్ కడపకు చెందిన మహేశ్‌ నుంచి ₹50వేలు అప్పు తీసుకున్నాడు. ఇది తిరిగి చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య ఆదివారం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మహేశ్‌ తన వద్ద ఉన్న కత్తితో సాయికిరణ్‌ను పొడిచాడు. తర్వాత మహేశే స్వయంగా బాధితుడిని తన వాహనంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే సాయికిరణ్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై చిన్న చౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని