E-wallet fraud: ఫోన్‌పే నుంచి రూ.52 వేలు మాయం.. ఎలా అంటే?

తాజాగా దిల్లీలో రూ.50,000 కాజేసిన ఇద్దరు మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు....

Published : 13 Nov 2021 12:51 IST

దిల్లీ: కాలం గడుస్తున్న కొద్దీ డిజిటల్‌ చెల్లింపుల పుంజుకుంటున్నాయి. అయితే, అదే స్థాయిలో ఆన్‌లైన్‌ మోసాలూ పెరిగిపోతున్నాయి. అందుకే ఇప్పటికీ కొంతమంది ఆన్‌లైన్‌ లావాదేవీలకు వెనుకాడుతున్నారు. తాజాగా దిల్లీలో రూ.50,000 కాజేసిన ఇద్దరు మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

నవంబరు 3న సందీప్‌ శర్మ అనే వ్యక్తి తన మొబైల్‌ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవంబరు 5న కొత్త ఫోన్‌ కొనుగోలు చేసి సిమ్‌ యాక్టివేట్‌ చేయించుకున్నాడు. కానీ, అప్పటికే తన ఫోన్‌పే ఖాతా యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించాడు. పైగా రూ.52,860 వేరే వారికి బదిలీ అయినట్లు కూడా తెలుసుకున్నాడు. వెంటనే బురారీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పాడు.

దర్యాప్తు చేసిన పోలీసులు ఫోన్‌పే నుంచి నగదు బదిలీ అయిన సంజయ్‌ అనే వ్యక్తిని గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సందీప్‌ పోగొట్టుకున్న ఫోన్‌ రాహుల్‌ దాస్‌ అనే వ్యక్తికి దొరికింది. అతనికి టెక్నాలజీపై మంచి పట్టుండడంతో ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి మొబైల్‌ వ్యాలెట్ల పిన్‌కోడ్‌లన్నింటినీ మార్చేశాడు. అలా ఫోన్‌పే నుంచి రూ.52 వేలు సంజయ్‌ అనే కిల్లీకొట్టు యజమానికి బదిలీ చేశాడు. తర్వాత కొంత మొత్తాన్ని సంజయ్‌.. రాహుల్‌కు ఇచ్చాడు. విచారణలో ఇవన్నీ బయటపడడంతో పోలీసులు ఇరువురినీ అరెస్టు చేశారు. సందీప్‌ పోగొట్టుకున్న మొబైల్‌తో పాటు రూ.20,000 విలువ చేసే మరో ఫోన్‌ని కూడా పోలీసులు రాహుల్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని