logo

జాతీయ రహదారిపై తెగిపడిన విద్యుత్తు తీగలు

విద్యుత్తు తీగలు తెగిపడిన ఘటన చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గన్నవరం మండలం కేసరపల్లి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Published : 29 May 2023 05:31 IST

పైవంతెన నిర్మాణ పనులు చేస్తుండగా ఘటన

తీగలను పక్కకు నెడుతున్న పోలీసులు, వాహనదారులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : విద్యుత్తు తీగలు తెగిపడిన ఘటన చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గన్నవరం మండలం కేసరపల్లి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పైవంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భలో క్రేన్‌ తగిలి విద్యుత్తు తీగలు ఒక్కసారిగా తెగి హైవేపై పడ్డాయి. ఆ సమయంలో వాహనదారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సుమారు రూ.25 కోట్లతో 1.4 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణానికి టెండర్‌ దక్కించుకున్న ట్రాన్జెట్‌ ఇన్ఫ్రా సంస్థ నిర్లక్ష్యంగా చేపడుతున్న పనుల వల్లే విద్యుత్తు తీగలు తెగిపడినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిర్మాణ సంస్థ ప్రతినిధి యశ్వంత్‌కు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పొరపాటున తీగలు తెగి వాహనదారులపై పడి ఉంటే.. ప్రాణనష్టం తీవ్రంగా ఉండేదన్నారు. మరోవైపు రహదారికి ఇరువైపులా చేపట్టిన డ్రెయిన్‌ నిర్మాణంలోనూ పలు అవకతవకలు జరిగినట్లు గ్రామస్థులు ఆరోపించారు. సుందరయ్య కాలనీ నుంచి సుమారు 3 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు. ఇప్పటికైనా సంస్థ ప్రతినిధులు సరైన జాగ్రత్తలు చేపట్టకుంటే ఆందోళన తప్పదని గ్రామస్థులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని