అంబులెన్సులో అక్రమ రవాణా
600 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటిక స్వాధీనం
పట్టుబడిన నల్లబెల్లం, పటిక, అంబులెన్సుతో పోలీసులు
వెల్దండ గ్రామీణం, న్యూస్టుడే : అత్యవసర, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులను తరలించాల్సిన అంబులెన్సులో నాటుసారా తయారీలో ఉపయోగపడే నల్లబెల్లం, పటికను కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందిన పోలీసులు సోమవారం అర్ధరాత్రి మాటువేసి చాకచాక్యంగా పట్టుకున్నారు. వెల్దండ ఎస్సై ఎం.నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్మూర్ మండలం నర్సయపల్లి గ్రామానికి రామవత్ శివ, ఆంగోత్ గణేశ్ ఓ నర్సింగ్ హోమ్కు చెందిన అంబులెన్సులో హైదరాబాద్ నుంచి 600 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటికను తరలిస్తున్నారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై వెల్దండ మండలం కొట్రతాండ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ అంబులెన్సును ఆపారు. దీంతో వారిద్దరూ పరారవడానికి ప్రయత్నించగా పోలీసులు వెంటపడి పట్టుకున్నారు. వాహనంలో నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. అంబులెన్సు వాహనాన్ని పట్టుకున్న ఏఎస్సై కుమారస్వామి, హెచ్సీ బాలశంకర్రెడ్డి, సిబ్బంది భాస్కర్, గోపిలను ఈసందర్బంగా ఎస్సై నర్సింహులు అభినందించారు.