logo

అధికార అండతో స్థలం అమ్మనీయడం లేదు..: ఆరుద్ర

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పరిధి గొల్లగూడెంలోని తమ స్థలాన్ని అమ్ముకోనీయకుండా తన భర్త భువనేశ్వర్‌ అన్న శేఖర్‌ కుమారుడు భరత్‌కుమార్‌ అడ్డుపడుతున్నారని రాజులపూడి ఆరుద్ర

Published : 21 Mar 2023 05:18 IST

కన్నీరుపెట్టుకుంటున్న కుమార్తె సాయిలక్ష్మీచంద్రతో ఆరుద్ర

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పరిధి గొల్లగూడెంలోని తమ స్థలాన్ని అమ్ముకోనీయకుండా తన భర్త భువనేశ్వర్‌ అన్న శేఖర్‌ కుమారుడు భరత్‌కుమార్‌ అడ్డుపడుతున్నారని రాజులపూడి ఆరుద్ర సోమవారం అమలాపురంలో ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డికి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలైన తన కూతురు సాయిలక్ష్మీచంద్రకు చికిత్స చేయించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన బిడ్డను కాపాడుకునేందుకు కాకినాడ జిల్లా పరిధిలోని ఇల్లు అమ్ముదామంటే వైకాపా మంత్రి దాడిశెట్టి రాజా సంరక్షకుడు అడ్డుపడ్డాడని, కలెక్టర్‌ కృతికాశుక్లా ఆదేశాలతో ఎట్టకేలకు అమ్ముకున్నానన్నారు. అమలాపురంలోని స్థలం అమ్ముతుంటే తన బంధువులు తమకు వైకాపా ఎమ్మెల్సీ కుడుపూడి సూర్య నారాయణరావు అండ ఉందని కొనేందుకు ఎవరూ రాకుండా బెదిరిస్తున్నారని ఆరుద్ర ఆరోపించారు. ఎమ్మెల్సీ కుడుపూడి వారికి హితవుచెప్పి తమను ఆదుకునేలా చూడాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, సీఎస్‌ల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగురాలైన బిడ్డను తీసుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని, జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని