logo

రైతుకు ప్రోత్సాహం.. యువతకు సహకారం..

పీఎం ప్రమాణ్‌ ద్వారా ప్రకృతి సాగు ప్రోత్సహించడంలో కోటిమంది రైతులకు సహకారం అందిస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు.

Updated : 02 Feb 2023 05:28 IST

ఈనాడు-అమరావతి: పీఎం ప్రమాణ్‌ ద్వారా ప్రకృతి సాగు ప్రోత్సహించడంలో కోటిమంది రైతులకు సహకారం అందిస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ప్రకృతిసాగు చేపట్టేవారికి ఇది ప్రయోజకరం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 48వేల మంది రైతులు ప్రకృతిసాగులో ఉన్నారు. నాణ్యమైన పత్తి దిగుబడిని పెంచడానికి ప్రభుత్వం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తారు. మూడు జిల్లాల పరిధిలో 2లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతున్నందున రైతులకు ప్రయోజనకరం. మూడు జిల్లాల్లో ఉద్యానపంటల సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఆత్మనిర్భర్‌ హార్టికల్చర్‌ క్లీన్‌ ప్లాంట్‌ పథకం ద్వారా నాణ్యమైన మొక్కల లభ్యత పెరుగుతుంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరైజ్డ్‌ చేయడానికి కేంద్రం నిధులు కేటాయించింది. దీంతో పీఏసీఎస్‌ల్లోనూ డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.


* దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు రూ.6835కోట్లు కేటాయించారు. మనజిల్లాలో మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్‌కు నిధులు రానున్నాయి. ఇప్పటికే ఇక్కడ వైద్యసేవలు అందుతుండగా మరిన్ని మెరుగైన సౌకర్యాల అభివృధ్ధికి నిధులు వెచ్చించనున్నారు.

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పురుషులతో పోల్చితే మహిళల జనాభా ఎక్కువ. కేంద్రబడ్జెట్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో రూ.2లక్షల వరకు డిపాజిట్‌ చేసుకునే అవకాశం ఉండటం అతివలకు కలిసివస్తోంది.

యువత కోసం నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటుచేయనున్నట్లు బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ప్రకటించారు. దీనివల్ల నాణ్యమైన పుస్తకాల లభ్యత పెరిగి యువతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు, సాగులో స్టార్టప్‌లకు పెద్దపీట వేయడం, యువత నైపుణ్యాల వృద్ధికి నిధుల కేటాయింపు ద్వారా యువతకు ప్రోత్సాహం అందించనున్నారు. మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయించడంతో ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయి.

రైల్వేబడ్జెట్‌కు నిధులను పెంచడంతోపాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో రైల్వేస్టేషన్ల అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. వందేభారత్‌ రైలును సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడుపుతామని ప్రకటించిన నేపథ్యంలో ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈరైలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల గుండా ప్రయాణిస్తుండటంతో మూడు జిల్లాల పరిధిలో ట్రాక్‌ అభివృద్ధి చేయడంతోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి.


మధ్యతరగతి వారికి వెసులుబాటు

పన్ను రిబేటు రూ.5లక్షల నుంచి రూ.7లక్షలకు పెంచడం వల్ల చాలామంది పన్ను నుంచి మినహాయింపు తీసుకునే వెసులుబాటు లభించింది. . రాబోయే రోజుల్లో ఆదాయం ఉన్నవారందరూ కొత్త పన్ను విధానంలోకి వచ్చే మౌలికసదుపాయాల కల్పనకు రూ.10లక్షల కోట్లు కేటాయింపు ప్రగతి బాటే.

కె.వి.బ్రహ్మం, ఆడిటర్‌


కేటాయింపులు సరే... పంపిణీ ఏదీ?

రైతు రుణాలకు భారీగా కేటాయించినా క్షేత్రస్థాయి ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకులు తనఖా లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టాల్సింది.

యలమంచిలి శివాజీ, మాజీ ఎంపీ


మౌలికం...కీలకం

కేంద్ర నిర్ణయంతో మౌలిక వసతులు కల్పన, రక్షణ రంగం బలోపేతం అవుతుంది. తద్వారా ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేసినట్లయింది. జిల్లాలో ఐటీఐ, పాలిటెక్నిక్‌ వంటి వృత్తివిద్యాకోర్సులు నేర్చుకున్న యువత అనేకమంది ఉన్నారు..వీరికి కేంద్ర బడ్జెట్‌ ఆశలు రేపింది.

బైరిశెట్టి మల్లికార్జునరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని