logo

కంప్యూటర్లు మూలకే!

పల్లెల్లో ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో పారదర్శకత, కాగిత రహిత సేవలందించాలన్న లక్ష్యం నెరవేరడంలేదు. గతంలో ఎంపిక చేసి క్లస్టర్‌ పంచాయతీలకు కంప్యూటర్లు అందించి మూలన పడేయగా, ప్రస్తుతం ప్రతి పంచాయతీలో ఆన్‌లైన్‌ సేవలందించేందుకు ఫైబర్‌ నెట్‌ సేవలు ప్రారంభానికి నోచుకోవడంలేదు.

Published : 06 Dec 2022 03:18 IST

మండల కేంద్రాల నుంచే గ్రామ పంచాయతీల ఆన్‌లైన్‌ సేవలు
న్యూస్‌టుడే, సారంగాపూర్‌

మారుమూల పంచాయతీ భవనంపై ఏర్పాటు చేసిన సోలార్‌ పరికరం

పల్లెల్లో ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో పారదర్శకత, కాగిత రహిత సేవలందించాలన్న లక్ష్యం నెరవేరడంలేదు. గతంలో ఎంపిక చేసి క్లస్టర్‌ పంచాయతీలకు కంప్యూటర్లు అందించి మూలన పడేయగా, ప్రస్తుతం ప్రతి పంచాయతీలో ఆన్‌లైన్‌ సేవలందించేందుకు ఫైబర్‌ నెట్‌ సేవలు ప్రారంభానికి నోచుకోవడంలేదు. జిల్లాలోని 380 పంచాయతీలను మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ ప్రతి పంచాయతీకి ఫైబర్‌ నెట్‌ ద్వారా సేవలందించేందుకు రెండేళ్లుగా పనులు కొనసాగిస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన క్లస్టర్లు సేవలందక మండలాలకే పరమితమవ్వగా, ప్రస్తుతం ఈ పంచాయతీ సేవలు ప్రజలకు అందడంలేదు. పంచాయతీ పాలనా అంతర్జాల సహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.  

చేతిరాత రసీదులే..

ప్రభుత్వం 2015లో క్టస్లర్‌ పంచాయతీలకు కంప్యూటర్లను పంపిణీ చేసింది. జిల్లాలో అత్యధికంగా జనాభా ఉన్న పంచాయతీలకు కంప్యూటర్లు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. మేజర్‌ పంచాయతీలు మినహా ఎక్కడా కంప్యూటర్‌ వినియోగంలో లేవు. అయితే కంప్యూటర్లు అందించినా ఆపరేటర్లను నియమించకపోవడంతో ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయి, పలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో చెత్తకుప్పల్లో పడేశారు. పన్నులు, ఇతర సేవలకు రుసుము చెల్లిస్తున్న వారికి చేతిరాత రసీదులే ఇస్తున్నారు. ఇందులో ఎంత మొత్తం గ్రామ పంచాయతీ ఖాతాకు చేరుతున్నది ప్రశ్నార్థకంగా మారింది.

క్లస్టర్‌ వ్యవస్థ నిర్వీర్యం

జిల్లాలో 380 పంచాయతీలు ఉండగా, ఎంపిక చేసిన గ్రామాలను క్లస్టర్‌ పంచాయతీలుగా విభజించారు. ఆయా క్లస్టర్‌ పంచాయతీలకు అందించిన పలు కంప్యూటర్లను మండల పరిషత్తు కార్యాలయాలకు తీసుకువచ్చి మండలానికి ఇద్దరు చొప్పున ఆపరేటర్లను నియమించి నిధుల వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 54 మంది వరకు ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఆపరేటర్‌ కొన్ని గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. వీరికి వేతనాలు ప్రతి పంచాయతీ నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధుల నుంచి 5 నుంచి 10 శాతం చెల్లిస్తున్నారు. అంతేకాకుండా మండల పరిషత్తుకు సంబంధించిన ప్రగతి పనుల సమాచారాన్ని వీరే కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాల్సి వస్తోంది. ఈ పంచాయతీ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలన్న సదుద్దేశంతో ప్రవేశపెట్టిన క్లస్టర్‌ వ్యవస్థ నిర్వీర్యం కావడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా పంచాయతీ వివరాలు పొందుపర్చడానికి మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఆ సమయంలో ప్రజలకు అవసరమైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో ఇతరత్రా కాగితాలకు మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.  

పల్లె సాంకేతికత పూర్తయ్యేదెప్పుడు?

జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు డిజిటల్‌ సేవలందించేందుకు ప్రభుత్వం ఫైబర్‌ లైన్‌ ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల ద్వారా ప్రతి పల్లెకు కేబుల్‌ లైన్‌ వేశారు. జిల్లాలో 18 మండలాల్లోని(పాత) 380 పంచాయతీలు ఉండగా వీటన్నింటికి అంతర్జాల సౌకర్యం కల్పించేందుకు ఫైబర్‌ లైన్‌ వేశారు. ఇతర గ్రామాల నుంచి ఫైబర్‌ నెట్‌ సేవలను అందించేందుకు అనుసంధానం చేశారు. ప్రతి పంచాయతీల సామగ్రితోపాటు సోలార్‌తో పనిచేసేలా యంత్రాలను బిగించారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సాంకేతిక సేవలందక ప్రజలు ఎదురు చూడాల్సి వస్తోంది.  

మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫైబర్‌ నెట్‌ సామగ్రి


ఇబ్బందుల్లేకుండా..
- శశికుమార్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి

ప్రజలకు ఇబ్బందుల్లేకుండా పారదర్శంగా ఆన్‌లైన్‌ సేవలు కొనసాగిస్తున్నాం. మండల స్థాయిలోని కంప్యూటర్‌ ఆపరేటర్ల ద్వారా ఆదాయ, వ్యయ వివరాలను నమోదు చేస్తున్నాం. దీనిద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్‌ల ద్వారా ప్రతి పంచాయతీ వివరాలను చూసుకునే అవకాశముంది. నూతనంగా పంచాయతీలలో ఏర్పాటు చేస్తున్న ఫైబర్‌ నెట్‌ సేవలు ప్రారంభం కానున్నాయి.


ప్రజలకు ఇబ్బంది..
-జమున, సర్పంచి, కోనాపూర్‌

ప్రభుత్వం అందించిన నిధులు, పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ చేయాలన్న లక్ష్యం నెరవేరడంలేదు. గతంలో అందించిన కంప్యూటర్లు మూలన పడేయగా, ప్రస్తుతం ఫైబర్‌ నెట్‌ సేవలు ఇప్పటికీ ప్రారంభం కావడంలేదు. పంచాయతీల ద్వారానే మండలంలో నియమించిన కంప్యూటర్‌ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించాల్సి వస్తోంది. ప్రజల్లో అధునిక సాంకేతికత పెరుగుతున్నా.. పంచాయతీల్లో మాత్రం పాత పద్ధతి వినియోగించుకోవాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని