logo

కరాటే శిక్షణ.. బాలికలకు ఆత్మరక్షణ

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా బాలికలు, మహిళలపై దాడులు కొనసాగుతున్నాయి. బాలికల స్వీయ రక్షణ కోసం ప్రభుత్వం కరాటే శిక్షణ ఇవ్వడానికి చర్యలు చేపట్టింది.

Published : 07 Feb 2023 06:03 IST

జిల్లాలో వంద పాఠశాలల ఎంపిక
న్యూస్‌టుడే, గంభీరావుపేట

గంభీరావుపేట కస్తూర్బాలో శిక్షణ తీసుకుంటున్న బాలికలు

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా బాలికలు, మహిళలపై దాడులు కొనసాగుతున్నాయి. బాలికల స్వీయ రక్షణ కోసం ప్రభుత్వం కరాటే శిక్షణ ఇవ్వడానికి చర్యలు చేపట్టింది. గతంలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వగా కరోనా సమయంలో దీనిని నిలిపివేశారు. ప్రస్తుతం ఈ నెల 4 నుంచి జిల్లా వ్యాప్తంగా బాలికలు అధికంగా ఉన్న పాఠశాలను గుర్తించి శిక్షణ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో కస్తూర్బా, ప్రభుత్వ పాఠశాలలు కలిపి 100 ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో శనివారం నుంచి శిక్షణ ప్రారంభించగా నెల రోజుల పాటు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. 33 మంది శిక్షకులను ఎంపిక చేశారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.5 వేల వేతనం చెల్లించనున్నారు.

పెరగనున్న ఆత్మవిశ్వాసం

ప్రధానంగా బాలికలపై జరుగుతున్న అకృత్యాలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, విపత్కర పరిస్థితుల్లో రక్షించుకోవడానికి కరాటే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని జిల్లాల్లో గత నెలలో ప్రారంభించినప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరాటే శిక్షకులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గతంలో శిక్షణ ఇచ్చిన సీనియర్లతోపాటు మరికొందరిని తీసుకున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం విద్యార్థినులకు ఉపయోగకరంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.


ఎంతో ఉపయోగం

కరాటే శిక్షణ తీసుకోవటం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కేవలం నెల రోజుల పాటు కాకుండా ప్రతి విద్యా సంవత్సరం మూడు నెలల పాటు ఇస్తే అందులోని మెలకువలను పూర్తిగా తెలుసుకోవచ్చు. ప్రతి విద్యా సంవత్సరం అందించే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.

భవనిత వర్ధిని, ఎనిమిదో తరగతి


పకడ్బందీగా నిర్వహణ

జిల్లాలో కరాటే శిక్షణను పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. నెల రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు. పురుషులతో పాటు స్త్రీలు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో కరాటే శిక్షణను అందిస్తున్నాం. విద్యార్థి దశ నుంచి ఆత్మరక్షణ శక్తిని పెంపొందించేలా మార్పు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కరాటే శిక్షణ ఇవ్వటం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినుల సంఖ్య పెరుగుతుంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలకు ఇస్తున్నారు.

పద్మజ, జెండర్‌ అండ్‌ ఈక్విటీ జిల్లా సమన్వయకర్త

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని