logo

15 రోజుల్లో పెళ్లి..కాటేసిన పిడుగు

ఆ యువకుడికి మరో 15 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. శనివారం మంచి మాటలకు కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారు. మృత్య రూపంలో పిడుగు కాటు వేయడంతో యువకుడు అనంతలోకాలకు చేరుకున్న ఘటన గురువారం రాత్రి బళ్లారి తాలూకాలో జరిగింది.

Published : 03 Jun 2023 01:06 IST

శోకసంద్రంగా మారిన రాయపురం

రుద్రమణి (పాత చిత్రం)

బళ్లారి, న్యూస్‌టుడే: ఆ యువకుడికి మరో 15 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. శనివారం మంచి మాటలకు కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారు. మృత్య రూపంలో పిడుగు కాటు వేయడంతో యువకుడు అనంతలోకాలకు చేరుకున్న ఘటన గురువారం రాత్రి బళ్లారి తాలూకాలో జరిగింది. ఈ ఘటనతో సంతోషంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది. తాలూకా రాయపుర గ్రామానికి చెందిన రుద్రమణి(23), స్నేహితుడు తరుణ్‌(21)లు గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. వర్షం రావడంతో పొలంలో చెట్టు కిందకు వెళ్లారు. ఉన్న ఫళంగా పిడుగు పడటంతో రుద్రమణి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, తరుణ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి గాయపడిన తరుణ్‌ను విమ్స్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రాయపురు గ్రామస్థాయి పి.డి.వో ప్రకాష్‌, ఇతర అధికారులు పి.డి.హళ్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విమ్స్‌కు తరలించారు. శుక్రవారం కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పి.డి.హళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మంత్రి బి.నాగేంద్ర సోదరుడు వెంకటేష్‌ ప్రసాద్‌ రాయపుర గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబసభ్యులను ఓదార్చి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం సాయం వచ్చే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు.

పెళ్లింట విషాదఛాయలు

రుద్రమణికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. మరో 15 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. శనివారం నిశ్చితార్థం చేసుకుని తాంబూలాలు తీసుకోవాల్సి ఉంది. ఉన్న ఫళంగా గురువారం రాత్రి పిడుగు పడి రుద్రమణి మృతిచెందడంతో ఇల్లు, గ్రామం  శోకసంద్రంగా మారింది. తాలూకా యాల్పి గ్రామానికి చెందిన ఓ రైతు కూడా చెట్టు కింద ఉండగా పిడుగు పాటుకు గురై మృతిచెందిన ఘటన మరవక ముందే మరో యువకుడు ఇదే తరహాలో మృతిచెందడాన్ని తాలూకా ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని