logo

ఆయుష్మాన్‌ భారత్‌ సేవలకు.. రేషన్‌ కార్డుల గ్రహణం!

రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా రూ.2 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తోంది.

Published : 27 Mar 2023 04:49 IST

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా రూ.2 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా పేదలకు అందుతున్న వైద్య సేవలను కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని నిరుపేదల కోసం రూ.5 లక్షల వరకు వైద్య సేవలు అందిచేందుకు ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆహార భద్రత కార్డుల్లో పేర్లు నమోదై ఉన్నవారందరూ ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తూ ప్రత్యేక కార్డులు జారీ చేస్తోంది. రేషన్‌కార్డుల్లో పేర్లు లేని వారికి ఈ పథకం వర్తించడం లేదు. దీంతో లక్షలాది మంది వైద్య సేవలు పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు.

1,87,487 మంది ఎదురుచూపు

* ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్‌ భారత్‌లో వైద్య సేవల కోసం రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబరుతో మీ సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు.

* గద్వాల పురపాలక సంఘంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా మీసేవ కేంద్రాల నిర్వాహకుల సహకారంతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.

* కార్డుల్లేని వారి పరిస్థితి ఒక లాగా ఉంటే.. కార్డు ఉండి అందులో పేర్లు లేని వారి పరిస్థితి మరోలా ఉంది. అత్యవసర పరిస్థితి ఎదురైతే తమను ఎవరు కాపాడతారని ఆందోళన చెందుతున్నారు. పేర్లు లేని వారి ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకుని నమోదుకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.

* జిల్లాలో 12 మండలాలు, 4 పురపాలక సంఘాల పరిధిలో 1,60,252 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. కొత్త రేషన్‌ కార్డుల కోసం, ఇది వరకే కార్డులు కలిగి అందులో పేర్ల నమోదు కోసం 46,130 దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 1,87,487 మంది అర్హులైన నిరుపేదలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. * కొత్త రేషన్‌ కార్డుల మంజూరు కోసం గత ఏడాది జూన్‌లో ప్రభుత్వం కొంత కసరత్తు చేసినా కార్యరూపం దాల్చలేదు. ఉన్న వాటిలో పేర్ల నమోదుకు అవకాశం కల్పించాలని పేదలు కోరుతున్నారు.


అధికారుల చుట్టూ తిరుగు తున్నా.. : మా కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నాం. రేషన్‌ కార్డు మంజూరు సమయంలో అందరి పేర్లు కార్డులో నమోదయ్యాయి. నాకు తెలియకుండానే నా పేరు తొలగించారు. నమోదు కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.

వెంకటేష్‌, చేనేత కార్మికుడు, బుర్దాపేట, గద్వాల


ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు : కొత్త రేషన్‌కార్డుల జారీ, పేర్ల నమోదుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. చాలా మంది కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పేర్లు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది.

రేవతి, సివిల్‌ సప్లయి అధికారిణి, గద్వాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని