logo

సరదాగా వెళ్లి.. నీటిలో గల్లంతై..

సరదాగా గడిపేందుకు వచ్చిన ఇద్దరు స్నేహితులు నీటిలోకి దిగగా, వారిలో ఒకరు నీట మునిగి గల్లంతైన సంఘటన నర్సాపూర్‌లో సోమవారం సాయంత్రం జరిగింది.

Published : 21 Mar 2023 02:17 IST

యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు

భార్గవ్‌

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: సరదాగా గడిపేందుకు వచ్చిన ఇద్దరు స్నేహితులు నీటిలోకి దిగగా, వారిలో ఒకరు నీట మునిగి గల్లంతైన సంఘటన నర్సాపూర్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్సై శివకుమార్‌ తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రగతినగర్‌కు చెందిన అంబటి భార్గవ్‌ (22), బోరబండకు చెందిన ఓ యువతి స్నేహితులు. వీరు కూకట్‌పల్లిలోని ఓ జూనియర్‌ కళాశాలలో చదువుకున్నారు. అప్పటి నుంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. భార్గవ్‌ ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల ప్రైవేటు ఉద్యోగం రావడంతో ఆ సంతోషాన్ని స్నేహితురాలితో చెప్పాలనుకున్నాడు. ఇద్దరూ నర్సాపూర్‌లోని పట్టణ ఉద్యానానికి ద్విచక్రవాహనంపై మధ్యాహ్నం చేరుకున్నారు. అక్కడ కంచె నిర్మాణంలో ఉండగా, దానిని దాటి కుటీరాల పక్కనే ఉన్న రాయరావు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ మాట్లాడుకుంటూ నీటిలోకి దిగారు. లోతును అంచనా వేయని భార్గవ్‌  కొంతదూరం వెళ్లడంతో మునిగిపోతుండగా, ఆ యువతి రక్షించాలని కేకలు వేసింది. అక్కడే కుటీరాలు నిర్మిస్తున్న కూలీలు కాపాడేందుకు ప్రయత్నం చేయగా, అప్పటికే భార్గవ్‌ నీట మునిగి కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న పట్టణ ఉద్యాన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రమేశ్‌, తదితరులు చేరుకుని పడవ సాయంతో నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. ఎస్సై శివకుమార్‌, తహసీల్దార్‌ ఆంజనేయులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. చీకటి పడటంతో మంగళవారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపడుతామని ఎస్సై తెలిపారు.

చెరువు వద్ద ఎస్సై, తహసీల్దార్‌, పోలీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని