logo

మూడుముళ్లకు వేళాయె..!

మూడు నెలల తర్వాత ముహూర్తాలు వస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో పెళ్లి సందడి నెలకొంది. వచ్చే నెల 3 నుంచి శుభగడియలు   ప్రారంభం కానున్నాయి.

Published : 29 Nov 2022 06:13 IST

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మూడు నెలల తర్వాత ముహూర్తాలు వస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో పెళ్లి సందడి నెలకొంది. వచ్చే నెల 3 నుంచి శుభగడియలు   ప్రారంభం కానున్నాయి. మరో ఐదు రోజుల్లో  ప్రారంభం కానున్న పెళ్లిళ్లపై అన్ని రంగాల వారు ఆశలు పెట్టుకున్నారు. డిసెంబరు 1వ తేది నుంచి శుక్రమూఢం తొలగిపోనుంది. 3, 4, 7, 9, 14, 16, 17, 18, తేదీల్లో వివాహాలకు దివ్య ముహూర్తాలుగా వేద పండితులు చెబుతున్నారు. వివాహాలకు, శుభకార్యాలకు నిర్వాహకులు అనేక మంది ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఫంక్షన్‌హాళ్లను బుక్‌ చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లిళ్లు నిర్ణయించుకునేవారికి పట్టణాల్లో ఫంక్షన్‌ హాళ్లు లభించే అవకాశం లేదు. అలాంటి వారు వివాహాలను దేవాలయాలు, ఇళ్ల వద్ద జరుపుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గత మూడు నెలల నుంచి ముహూర్తాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడిన ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు ప్రస్తుతం వచ్చే గడియలతో కొంత ఊరట చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు వందలకు పైగా కల్యాణ మండపాలు ఉన్నాయి.  

ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి పందిరి

ముద్రణ రంగం, కల్యాణ మండపాలు, అలంకరణ, పూల వ్యాపారులు, క్యాటరింగ్‌ వంటచేసేవారు, ఫొటో, వీడియో గ్రాఫర్లు ముందస్తుగా ఆర్డర్లు తీసుకుంటున్నారు. ప్రధానంగా నిర్వహణ, క్లీనింగ్‌ తదితర పనులపై ఆధారపడ్డ వేల మంది దినసరి కూలీలకు గత మూడు నెలలు గడ్డుకాలంగా మారింది. మరో అయిదు రోజుల్లో పెళ్లిళ్లు ప్రారంభం కానుండటంతో అన్ని రంగాలవారు ఆనందపడుతున్నారు.


పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి
- రాఘవరెడ్డి, ఫంక్షన్‌హాల్‌ నిర్వాహకుడు  

వచ్చే నెలలో జరిగే పెళ్లిళ్లకు దాదాపు ఫంక్షన్‌హాళ్లు ముందస్తుగా బుకింగ్‌ అయ్యాయి. మూడు నెలల నుంచి ఫంక్షన్‌హాళ్లలో చిన్న చిన్న కార్యక్రమాలు తప్ప ఆడంబరమైన కార్యక్రమాలు జరగలేదు. ప్రస్తుతం వచ్చే నెలలో కూడా ఎనమిది ముహూర్తాలే ఉన్నాయని నిర్వాహకులు ముందస్తుగానే బుక్‌ చేసుకున్నారు. ఆదాయం కొంత ఆశాజనకంగా ఉంది.  


అధికసంఖ్యలో వివాహాలు
-ఫణికుమార్‌, అర్చకులు

వచ్చే నెల 19 తర్వాత నెల రోజుల పాటు ముహూర్తాలు లేవు. ఆ తర్వాత మాఘం, పాల్గుణ మాసాల్లో ఉన్నాయి. దీంతో మార్గశిర మాసంలోనే శుభకార్యాలు ముగించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. మూడు నెలల నుంచి శుభగడియలు లేకపోవడంతో వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్న ముహూర్తాలను నిర్వాహకులు నిర్ణయించుకుంటున్నారు. దీంతో అధిక సంఖ్యలో వివాహాలు జరిగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని