logo

వీధి వ్యాపారుల.. విధిరాత మారేలా..!

వీధి వ్యాపారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. అద్దెలు చెల్లించకలేక.. రోడ్ల వెంట వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.

Published : 04 Feb 2023 05:22 IST

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే

సూర్యాపేటలో వీధి వ్యాపారులు

వీధి వ్యాపారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. అద్దెలు చెల్లించకలేక.. రోడ్ల వెంట వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. గత రెండేళ్లగా కొవిడ్‌ కారణంగా వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడ్డారు. వారిని ఆదుకొనేందుకు ఆత్మనిర్భర్‌ కింద బడ్జెట్‌లో రూ.468 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో 37,784 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. యాదాద్రిలో 9,101, నల్గొండలో 17,093, సూర్యాపేటలో 11,590 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఉపాధిని మెరుగుపర్చేందుకు మొదట పీఎం స్వనిధి(ఆత్మనిర్భర్‌) పథకంలో మొదట రూ.10వేలు రుణంగా అందించారు. తిరిగి చెల్లించిన వారికి రెండో విడత రూ.20వేలు అందజేశారు. ఇవి కూడా సక్రమంగా చెల్లించిన వారికి కేంద్రం రుణ పరిమితి పెంచి రూ.50 వేలు అందజేసింది. వీటితో రోడ్ల వెంట వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి జీవన పరిస్థితిని మరింతగా మెరుగుపర్చేందుకు కేంద్రం రుణపరిమితిని పెంచడంతోపాటు నిధులు కూడా భారీగా పెంచుతోంది. వీటిని సద్వినియోగం చేసుకొని వ్యాపారులు ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చేలా ప్రోత్సహిస్తోంది.

పెరగనున్న రుణం

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో రుణం పెరగనుంది. రూ.10 వేల నుంచి రూ.50 వేల పెరిగిన రుణం ఇప్పుడు రూ.లక్ష వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో వ్యాపారం మరింతగా వృద్ధి చేసుకొనే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ పెరగడంతో పాటు ఆదాయం మరింత వృద్ధి కానుంది. దీంతో వ్యాపారులు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నారు.

దుకాణాల ఏర్పాటు

కేంద్రం ప్రకటించిన నిధులతో పురపాలికల్లో దుకాణాలను నిర్మించనున్నారు. కొవిడ్‌ సమయంలో నిర్మించిన కొన్ని దుకాణాలను వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. నిధుల కొరత కారణంగా అధికారులు సరిపడా దుకాణాలను నిర్మించలేదు. ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వం కేటాయించిన నిధులతో దుకాణాలు నిర్మించుకొనే అవకాశం కలగనుంది. దీంతో వ్యాపారులు రోడ్ల వెంట తోపుడు బండ్లు, రేకుల షెడ్లకు స్వస్తి పలికే అవకాశం ఉంది.


నిధుల కేటాయింపు సంతోషకరం

- ధరావత్‌ రమేశ్‌ నాయక్‌, మెప్మా పీడీ, సూర్యాపేట

కేంద్రం ప్రభుత్వం బడ్జెట్‌లో వీధి వ్యాపారులకు నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. అర్హులైన వ్యాపారులకు రుణాలు అందించి వ్యాపార నిర్వహణకు సహకరిస్తాం. వ్యాపారులు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని